17 November 2017

అలుపెరగని పది రోజులు


– 137 కిలోమీటర్లు పూర్తి చేసిన జననేత 
– తన దృష్టికొచ్చిన ప్రతి సమస్యపైనా ప్రభుత్వాన్ని నిలదీత
– సీపీఎస్‌ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ 
– విలేజ్‌ సెక్రటేరియట్‌తో గ్రామ స్వరాజ్యం 
– విశ్రాంతి సమయం తగ్గించుకుని ప్రజలతోనే మమేకం

ప్రతిపక్ష నాయకుడు, వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే పదిరోజుల పాటు పాదయాత్రను పూర్తిచేసిన జననేత కర్నూలు జిల్లా ప్రజలతో కలిసి నడుస్తున్నారు. పది రోజుల్లో 137 కిలోమీటర్లకు పైగానే తన పాదయాత్రను పూర్తి చేశారు. కడప జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాగింది. మూడు రోజుల క్రితమే ఆయన కర్నూలు జిల్లాలోకి ప్రవేశించారు. జననేత ఎక్కడికి వెళ్లినా అక్కడికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలనే తేడా లేకుండా జననేతను కలిసి తమ సాదక బాధలను చెప్పుకునేందుకు.. తమను ఆదుకుంటాడనే ఆశతో ఎదురుచూస్తున్నారు. 
ప్రజలకు అండగా నిలుస్తూ ముందుకు
పాదయాత్ర సందర్భంగా వివిధ సమస్యలపై తనను కలవడానికి వచ్చే వారితో ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. నడిచే దూరం కళ్లముందే కనబడుతున్నా ఓపిగ్గా ప్రతి ఒక్కరికీ సమయం కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. తనను కలవడానికి ఇబ్బంది పడుతున్న వయో వృద్ధులు, వికలాంగులను ఆయనే స్వయంగా వెళ్లి కలుస్తూ వారికి భరోసా ఇస్తున్నారు. వారి నుంచి వినతులు స్వీకరిస్తూ వీలైన వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తూ.. కాని వాటికి ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. భోజనం సమయంలోనూ విశ్రాంతి తీసుకోకుండా వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడేందుకే మక్కువ చూపిస్తున్నారు. 
సమస్యలసై నిలదీస్తూ..
పాదయాత్రలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించే సమయాల్లో స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారు. తాగు, సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు.. ప్రజావసరాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కడప జిల్లాలో గాలేరు–నగరి ప్రాజెక్టును సందర్శించి రాబోయే కాలంలో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతానని రైతులు భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభల్లో ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ఆధారం లేని వృద్ధుల కోసం మండలానికో వృద్ధాశ్రమం, ఉద్యోగులకు అండగా ఉంటానని సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని భరోసా కల్పించారు. ప్రతి గ్రామానికి విలేజ్‌ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి.. అందులో పది మంది ఉద్యోగులను నియమించడం ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురాబోతున్నామంటూ తేల్చి చెప్పారు. పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్‌ లాంటి సమస్యలేవైనా 72 గంటల్లోనే పరిష్కరిస్తామని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా నియామకాలు చేపడతామని చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో నిష్పక్షపాతంగా పాలన చేయబోతున్నామని తేల్చి చెప్పారు. అన్ని అర్హతలుండీ పింఛన్లకు దూరంగా ఉంటున్న ఎంతోమంది జననేతను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. 
పాదయాత్రపై సొంతంగా డైరీ 
పాదయాత్ర సందర్భంగా జననేత ఏరోజుకారోజు కార్యక్రమాలపై సొంతంగా డైరీ రాసుకుంటున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై డైరీలోనూ స్పందిస్తున్నారు. పాదయాత్రలో తను చూసిన సంఘటనలపై.. ఆయా ప్రాంతాల్లో నడుస్తుండగా ప్రజలు చూపిస్తున్న ఆప్యాయతానురాగాలను ప్రస్తావిస్తున్నారు. పాదయాత్రలో తన అనుభవాలు తన దృష్టికొచ్చిన ప్రజా సమస్యలు.. ఆయా సమస్యలను తాను అధికారంలోకి వచ్చాక ఎలా పరిష్కిరంచబోతున్నారో ప్రధానంగా వివరిస్తున్నారు. 

No comments:

Post a Comment