9 November 2017

సిగ్గు, శరం ఉంటే సవాల్‌ను స్వీకరించాలి


హైదరాబాద్‌: చంద్రబాబుకు సిగ్గు, శరం, లజ్జ, దమ్మూ, ధైర్యం ఏ కోశాన ఉన్నా వెంటనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చేసిన సవాల్‌ను స్వీకరించాలని పార్టీ సీనియర్‌ నాయకుడు తమ్మినేని సీతారాం డిమాండ్‌ చేశారు. వైయస్‌ జగన్‌ చాలెంజ్‌ విసిరి 24 గంటలు గడిచినా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ స్వీకరించకపోవడంలో ఆంతర్యమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యాలయంలో తమ్మినేని సీతారాం విలేకరుల సమావేశం నిర్వహించారు. విదేశాల్లో ఒక్క రూపాయి ఉన్నట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వైయస్‌ జగన్‌ సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. 15 రోజుల టైం ఇచ్చి రుజువు చేయాలని వైయస్‌ జగన్‌ చెబితే టీడీపీ ఇంత వరకు ముందుకు రాలేదన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టను కించపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. 

వైయస్‌ జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ రాజకీయాల్లో ఉండొద్దని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్ల కేసుపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు 6వ తేదీన అడ్మిట్‌ చేసిందన్నారు. అది మొత్తం వైరల్‌ కావడంతో దాని నుంచి ప్రజలను డైవర్ట్‌ చేసేందుకు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో లీక్‌ ఇప్పించి దాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా తన అనుకూల పత్రికల్లో రాతలు రాయిస్తున్నారన్నారు. 

నోట్ల రద్దు సమయంలో వైయస్‌ జగన్‌కు రూ. 10 వేల కోట్లు ఉన్నాయని, అదే విధంగా అధికారులను మ్యానేజ్‌ చేసుకొని వైయస్‌ జగన్‌కు సెల్‌ కంపెనీలు ఉన్నాయని, ఈడీ ట్విట్టర్‌లో, వెబ్‌సైట్‌లో పెట్టించారన్నారు. ఈ విషయంపై ఈడీపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి వైయస్‌ జగన్‌ లేఖ రాశారని గుర్తు చేశారు. ప్యారడైజ్‌ పేపర్‌ లీక్‌లలో వైయస్‌ జగన్‌ పేరు ఉందని ప్రచారం చేయడం చిన్న ఆరోపణ కాదని, వైయస్‌ జగన్‌పై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తే చూస్తూ సహించం అన్నారు. ఓటుకు కోట్ల కేసులో ప్రత్యక్షపాత్ర ఉన్న చంద్రబాబు దొరల మాదిరిగా వెళ్తుంటే నేరాలతో ఎలాంటి సంబంధం లేని వైయస్‌ జగన్‌ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు ఏ విధమైన శిక్ష విధించాలో ప్రజలే ఆలోచించాలన్నారు. 

చంద్రబాబు అంటే అబద్ధాల కోరు అని ప్రతి ఒక్కరికీ తెలుసని తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం లేకుండా పాలన జరుగుతుందన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయిస్తూ సభలో దర్జాగా కూర్చోబెట్టారన్నారు. నిన్నగాక మొన్న వంతల రాజేశ్వరిని సిగ్గులేకుండా పార్టీలో చేర్చుకున్నారన్నారు.  

పనామా పత్రాల్లో అంతర్జాతీయ జర్నలిస్టులు పేర్కొన్న విధంగా హెరిటేజ్‌ ఫుడ్‌ డైరెక్టర్‌ శివరామకృష్ణ వరప్రసాద్‌ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయన్నారు. చంద్రబాబు సీఎం అయిన నెలరోజులకే శివరామకృష్ణను డైరెక్టర్‌ను చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో కూడా ఆయనకు భాగస్వామ్య ఉందని అందరికీ తెలుసన్నారు. అనుమానస్పద కంపెనీలు, లావాదేవీలు నడిపిన వారిల్లో హెరిటేజ్‌ డైరెక్టర్‌ ఉన్నారని తేలిందన్నారు. తరువాత శివరామకృష్ణ రాజీనామా చేశారని ప్రకటించారని, అసలు రాజీనామా చేయాల్సింది శివరామకృష్ణా లేక చంద్రబాబా అని ప్రశ్నించారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, ఎట్టి పరిస్థితుల్లో వైయస్‌ జగన్‌పై చేసిన ఆరోపణలను రుజుబు చేయాలని, లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

No comments:

Post a Comment