30 June 2016

సొంత జిల్లా ప్రజలను పట్టించుకోని సీఎం

  • నగరిలో వెటర్నరీ ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించిన రోజా
  • డాక్టర్లు,మందులు, సరైన సౌకర్యాలు లేకపోవడంపై ఆగ్రహం
  • నగరి నియోజకవర్గంపై బాబు చిన్నచూపు చూస్తున్నారని ఫైర్
  • రాజకీయాలు పక్కనబెట్టి ప్రజలను ఆదుకోవాలని హితవు

చిత్తూరు(నగరి): చంద్రబాబు తన సొంత జిల్లాలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. 
న‌గరి నియోజ‌క‌వ‌ర్గంపై చంద్రబాబుకు,  ప్ర‌భుత్వాధికారుల‌కు ఎందుకంత చిన్న‌చూపు అని  రోజా ప్రశ్నించారు.  నగరి నియోజ‌వ‌వ‌ర్గంలో వెట‌ర్న‌రీ ఆస్పత్రి భ‌వ‌నాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రోజా విలేక‌రుల‌తో మాట్లాడుతూ... భ‌వ‌నాలు నిర్మించారు త‌ప్ప అందుకు సంబంధించిన సిబ్బందిని నియ‌మించ‌లేద‌ని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొన్ని భ‌వ‌నాల నిర్మాణాలు పూర్తైనా సిబ్బంది లేని కార‌ణంగా అవి నిరూప‌యోగంగా ఉన్నాయ‌ని  ఆవేదన వ్యక్తం చేశారు. 

డాక్ట‌ర్లు, మందులు,  స‌రైన సౌక‌ర్యాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేవ‌ని ఆమె వాపోయారు. పుత్తూరులో రెగ్యుల‌ర్ డాక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తూనే న‌గరిలో ఇంఛార్జ్ డాక్ట‌ర్‌గా విధులు నిర్వహించడం కష్టంగా ఉందని వైద్యులు చెబుతున్నారని, దీనిపై క‌లెక్ట‌ర్ ఎందుకు స్పందించ‌డం లేదని రోజా నిలదీశారు.  ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌కు చెడ్డ‌పేరు తీసుకొచ్చేందుకే అధికార ప్ర‌భుత్వం ఇలాంటి ధ్వంధ వైఖ‌రిని అవ‌లంభిస్తుంద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప్రజలను ఆదుకోవాలని సూచించారు. 

ప్ర‌జా న్యాయ‌స్థానంలో వైయ‌స్ జ‌గ‌న్ స‌ఫ‌లం...బాబు విఫ‌లం

  • ఈడీ అటాచ్ మెంట్ ను సాకుగా చూపి టీడీపీ విషప్రచారం
  • ఓటుకు నోటు, రాజధాని భూదందా,ఎమ్మెల్యేల కొనుగోళ్లపై 
  • బాబు సీబీఐ విచార‌ణ‌కు సిద్ధంగా ఉండాలి
  • ప్రజాన్యాయస్థానంలో బాబు దోషిగా నిలబడ్డారు
  • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ‌
హైదరాబాద్ః వైయ‌స్ జ‌గ‌న్‌కు సంబంధించిన ఆస్తుల‌పై కొన్ని ప‌త్రిక‌లు విష‌ప్ర‌చారం చేస్తున్నాయ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు. ఈడీ అనేది న్యాయ నిర్ధార‌ణ సంస్థ కాద‌ని, కేవ‌లం ఒక పోలీస్ వ్య‌వ‌స్థ లాంటిదేనన్నారు. సీబీఐ చేసిన చార్జీషిట్ల‌పై ఆధార‌ప‌డి ఆస్తుల‌పై అటాచ్‌మెంట్‌ను ప్ర‌క‌టించాయన్నారు. సీబీఐ కేసులకు సంబంధించి న్యాయ‌స్థానంలో ఇంకా విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. టీడీపీ రాజా ఆఫ్ కరప్ష‌న్ అనే పుస్తకాన్ని విడుద‌ల చేసేనాటికి  వైయ‌స్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి రాజ‌కీయ నాయ‌కుడు కాద‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలుసునన్నారు. కేవ‌లం ఒక వ్యాపార వేత్త‌గా త‌న తెలివితో పైకి వ‌చ్చిన వ్య‌క్తి వైయ‌స్ జ‌గ‌న్ అని చెప్పారు.  

కావాల‌నే వైయ‌స్ జ‌గ‌న్‌పై విష‌ప్ర‌చారం...
వైయ‌స్ జ‌గన్ ఆస్తుల అటాచ్‌మెంట్‌ను సాకుగా చేసుకొని టీడీపీకి చెందిన కొంద‌రు విష ప్ర‌చారం చేస్తున్నార‌ని ప‌ద్మ మండిప‌డ్డారు. కేవ‌లం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని నొక్కేయాలి... తొక్కేయాలి అన్న ధోర‌ణితోనే టీడీపీ సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేసింద‌న్నారు. బాబు అధికారంలో లేన‌ప్పుడు వైయస్ జ‌గ‌న్‌కు వ‌స్తున్నప్రజాధార‌ణ‌ను చూసి ఓర్వలేకపోయారని... ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల కాలంలో జ‌రుగుతున్న అవినీతి కుంభ‌కోణాల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకు వైయ‌స్ జ‌గ‌న్‌పై మరోసారి విష‌ప్ర‌చారం చేస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. కేవలం వైయస్  జ‌గ‌న్‌ను టార్గెట్ చేసే ఇదంతా జ‌రుగుతుంద‌న్నారు. కానీ టీడీపీ నాయ‌కులు తెలుసుకోవాల్సిన నిజం ఇంకోటి ఉంద‌న్నారు. ఈడీ కేవ‌లం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస్తుల‌ను మాత్రమే అటాచ్‌మెంట్ చేసిందన్నారు.  స్వాధీనం చేసుకోలేద‌న్న విష‌యం తెలుసుకోవాల‌న్నారు. 

ప్ర‌జాభిమానం చూసి ఓర్వ‌లేక‌నే...
వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణం త‌రువాత  వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఓదార్పు యాత్ర చేయ‌డం వ‌ల్ల వ‌చ్చిన ప్ర‌జాభిమానం చూసి హస్తం పార్టీ భయపడిందన్నారు . ఓదార్పు యాత్ర‌ను ఆపివేయాలని కాంగ్రెస్ చెప్పడంతో వైయ‌స్ జ‌గన్ అందుకు నిరాక‌రించి బ‌య‌ట‌కు వ‌చ్చి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టార‌న్నారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ ఆస్తుల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కాంగ్రెస్‌, టీడీపీ లు కుట్రపన్ని పిటిష‌న్ వేసిన విష‌యం గుర్తు చేశారు. ఇప్ప‌టికీ సీబీఐ కోర్టులో విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. 16 నెల‌లు జైలులో పెట్టినా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌న్న ఆత్మ‌స్థైర్యంతో ఉన్నారని, ఇప్ప‌టికీ తామంద‌రం అదే ఆత్మ‌స్థైర్యంతో ఉన్నామ‌న్నారు.  న్యాయస్థానాల తుది తీర్పులో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్దోష‌న్న తీర్పు వ‌స్తుంద‌న్నారు. 

ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లోంచి దూరం చేయ‌లేరు...
వైయ‌స్ జ‌గ‌న్‌ను ప్ర‌జ‌ల మ‌నస్సుల్లోంచి దూరం చేయాల‌న్న ఆలోచ‌న‌లోనే టీడీపీ నాయ‌కులు విఫ‌లం చెందార‌న్నారు. ఇంత‌కు ముందు సైతం ఈడీ వైయస్ జ‌గ‌న్ ఆస్తుల‌ను అటాచ్‌మెంట్ చేసిందని, చివ‌రికి ఆ ఆస్తుల‌ను అప్ప‌గించార‌న్నారు. ఎవ‌రూ కూడా నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్ జ‌గ‌న్‌కు భూములు కేటాయించ‌లేద‌ని ఐఏఎస్ అధికారుల‌తో పాటు టీడీపీ స‌ర్కారే స‌ర్టిఫికెట్లు ఇస్తుంద‌న్నారు. భూముల కేటాయింపు అక్ర‌మం కాద‌న్నారు.  విచార‌ణ పూర్తికాక‌ముందే వైయ‌స్ జ‌గ‌న్ జైలుకెళ్తాడు... ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంటారు... వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తార‌న‌డం కేవ‌లం టీడీపీ నాయ‌కుల భ్రమ అన్నారు. 

బాబుకు ముందుంది ముసళ్ల పండగ..
చంద్ర‌బాబు అవినీతిపై రూపొందించిన పుస్తకాన్ని ప్ర‌ధాన‌మంత్రి, రాష్ట్ర‌ప‌తి, మంత్రులంద‌రికీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అందజేసిన విషయాన్ని పద్మ ఈసందర్భంగా ప్రస్తావించారు. బాబుపై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే భ‌యంతో పారిపోతున్నారన్నారు. రాజ‌ధాని భూ అక్ర‌మ దందాపై ద‌మ్ముంటే సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌న్నారు. ఓటుకు నోటు కేసు, రాజ‌ధాని అక్ర‌మ భూదందా, అవినీతి డ‌బ్బుతో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై బాబుకు ముందుంది ముస‌ళ్ల పండ‌గ అని వాసిరెడ్డి ప‌ద్మ హెచ్చరించారు.  ప్ర‌జాన్యాయ‌స్థానం అనేది కూడా న్యాయ‌స్థానాల్లో ముఖ్య‌మైంద‌న్నారు. అలాంటి ప్ర‌జాన్యాయ‌స్థానంలో వైయ‌స్ జ‌గ‌న్ స‌ఫ‌లం అయితే... బాబు దోషిగా నిల‌బ‌డ్డార‌న్నారు. తాను దొంగ‌త‌నం చేసి మ‌రో వ్య‌క్తిని దొంగ‌దొంగ అన్న‌ట్లు ....బాబు అవినీతికి పాల్ప‌డుతూ ఇత‌రుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. నిత్యం అవినీతి అక్ర‌మాల‌తోనే బాబుకు తెల్ల‌వారుతుంద‌న్నారు. త్వ‌ర‌లోనే సీబీఐ విచార‌ణ‌కు బాబు సిద్ధంగా ఉండాల‌ని సూచించారు. అంతిమ విజ‌యం వైయ‌స్ జ‌గ‌న్‌దే అన్న ధీమా అంద‌రిలోనూ ఉంద‌న్నారు. 

రెండేళ్ల‌లో గ‌ర్వంగా చెప్పుకునే ఒక్క ప‌థ‌కం లేదు...
రెండేళ్ల కాలంలో గ‌ర్వంగా చెప్ప‌కునే ఒక్క ప‌థ‌కాన్ని కూడా బాబు ప్రవేశ పెట్ట‌లేద‌న్నారు.  ఏ త‌ప్పు లేనప్పుడు బాబు సీబీఐ విచార‌ణ‌కు ఎందుకు సిద్ధంగా లేరని ప్ర‌శ్నించారు. బాబు రెండేళ్ల పాల‌న‌పై కోర్టులో అనేక పిటిష‌న్లు ఉన్నాయ‌ని, ఆ పిటిష‌న్లు ఏ రాజ‌కీయ నాయ‌కులో చేసిన‌వి కాద‌ని రైతులు, సామాన్య ప్ర‌జ‌లు వేసినవేనన్నారు. రాజ‌ధాని భూముల‌పై జ‌రుగుతున్న అక్ర‌మ భూదందాపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి బాబుపై విచార‌ణ జ‌రిపించాల‌ని కోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం గుర్తు చేశారు. బాబు అవినీతిపై పార్టీ త‌ర‌ఫున ఎప్ప‌టిక‌ప్పుడు నిల‌దీస్తున్నామ‌న్నారు. సీబీఐ విచార‌ణ జ‌రిగితే అభివృద్ధి ఆగిపోతుంది అన‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. కేంద్రంలో  మిత్ర ప‌క్షంగా ఉండి కూడా సీబీఐ విచార‌ణ‌కు బాబు భ‌య‌ప‌డ‌డం చూస్తేనే... ఎంత‌మేర అవినీతికి పాల్ప‌డ్డారో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతుంద‌న్నారు. 

సచివాలయం పూర్తికాకముందే ప్రారంభోత్సవాలు

  • ఈ హంగు ఆర్భాటాలు అవసరమా..?
  • అమరావతి రాజధాని ఏపీకా..? సింగపూర్‌కా..?
  • లక్షల కోట్ల ఎంవోయూలు  ఏమయ్యాయి
  • విదేశీ మోజును వీడి రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలి
  • వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌: ఏపీ రాజధాని తరలింపు పేరుతో బస్సులు, రైళ్లు అంటూ యుద్ధప్రతిపాదికన టీడీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రెండు సంవత్సరాల కాలంగా నిద్రపోయిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తన్నారో అర్ధం కావడం లేదన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో పట్టిసీమలో కాల్వలు పూర్తికాకముందే ప్రాజెక్టు అయిపోయిందని, అనుసంధానం అయిపోయిందని ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. అదే రీతిలో ఒక చిన్నరూం కూడా నిర్మాణం పూర్తికాని తాత్కాలిక సచివాలయంలో చంద్రబాబు ఒకసారి, మంత్రులు అనేక సార్లు ప్రారంభోత్సవాలు చేసి మళ్లీ 29వ తేదికి ఒక ముహూర్తం పెట్టారని ఎద్దేవా చేశారు. ఇన్ని ఆర్భాటాలు ఎందుకో చంద్రబాబు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 

అధికారం ఉందికదా అని ఏం చేస్తే అదే శాసనం అనే విధానాన్ని వైయస్‌ఆర్‌ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్‌కు కట్టబెట్టడాన్ని పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుపై వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళన చెందుతుందని పేర్కొన్నారు. మనకున్న జీవనశైలిలో ఆర్థికంగా వెనుకబడిన పేదవాడు నివసించే విధంగా రాజధాని నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. గతంలో దేశాన్ని పాలించిన బ్రిటీష్‌ వారు కూడా చంద్రబాబు లాంటి నిబంధనలు, దురాక్రమణలు చేసివుండరని విరుచుకుపడ్డారు. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానా? లేక సింగపూర్‌కు రాజధానా? అని చంద్రబాబును ప్రశ్నించారు. 

20 సంవత్సరాలు వాణిజ్యపరంగా అమ్ముకునేందుకు, అది చాలకపోతే మరో 5 సంవత్సరాలు అమ్ముకునేందుకు సింగపూర్‌ కంపెనీలకు నిబంధనలు పెట్టడం దుర్మార్గమన్నారు. ఈ ఒప్పందాలపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే టీడీపీ అవినీతి భయటపడుతుందనే నెపంతో పది రెట్లు ప్రభుత్వ సొమ్మును చెల్లించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ఎవరిని మోసం చేయడానికి ఈ నిబంధనలు పెడుతున్నారని ప్రశ్నించారు. 

బాబువి దుర్మార్గపు నిర్ణయాలు
చంద్రబాబు  నిర్ణయాలన్ని దుర్మార్గమైన నిర్ణయాలని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలో సమ్మిట్‌లు పెట్టి రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అసెంబ్లీ రికార్డులలో మాత్రం  రూ. 10 వేల కోట్లు అని చూపిస్తున్నారని మండిపడ్డారు. అదే విధంగా విజయవాడలో పెట్టుబడులు పెట్టేందుకు రూ. 2 లక్షల కోట్లు, జపాన్‌ నుంచి లక్షలాది కోట్లు, సింగపూర్‌ దావోస్‌ నుంచి లక్షల కోట్లు వస్తున్నాయి. ఎంవోయూలు కూడా కుదుర్చుకున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఆ ఎంవోయూలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ. 3 వేల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌ వస్తుంది అని చెప్పారు. ఆ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌ గురించి విచారణ చేస్తే అది పూర్తిగా నష్టాల్లో ఉన్న కంపెనీగా తేలిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన సమయంలో వింతపోకడలతో పోతున్న ప్రభుత్వాన్ని చూస్తుంటే భయాందోళనలు రేకెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

గత కొద్ది రోజులుగా చంద్రబాబు మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నారు కానీ మనసంతా సింగపూర్‌లోనే ఉన్నట్లుగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. బాబుకు సింగపూర్ అంటే ఎందుకు అంత ప్రేమ అని ప్రశ్నించారు. భారతదేశంలో మంచి ఇంజనీర్స్‌ ఉన్నారని ప్రపంచ దేశాలు అంటుంటే చంద్రబాబు మాత్రం రాజధానిలో మురికివాడలను కట్టాలనుకుంటున్నారా అని ఇంజనీర్స్‌ను, సంస్థలను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఏరకంగా ఉందో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. ఇతిహాద్‌ హెయిర్‌లైన్స్‌ వస్తున్నాయని చెబుతున్నారు . వాణిజ్య పరంగా ఆ కంపెనీ అభివృద్ధి చెందుతుంది కానీ పేద ప్రజలకు ఒరిగేదేముందో అర్ధం కావడం లేదన్నారు.  రెండు సంవత్సరాల కాలంలో చేసిందేమీ లేక గత ప్రభుత్వాలు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలపై పేర్లు మార్చి మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విదేశీ మోజును వీడి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. 

29 June 2016

బాబు సీఎం ఏపీకా..? సింగ‌పూర్‌కా..?

హైదరాబాద్) అస‌లు బాబు సీఎం ఏపీకా..?  లేక సింగ‌పూర్‌కా అని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్‌.కె.రోజా మండిప‌డ్డారు. రాజ‌ధాని నిర్మాణంలో సింగ‌పూర్ వాటా 58శాత‌మ‌ని బాబు ఎలా నిర్ణ‌యిస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సింగపూర్ కంపీనీలు కేవ‌లం 350 కోట్లు పెడుతున్నార‌ని, అంతకు మించి అనేక రెట్ల మేర లాభాలు దండుకొంటున్నాయని అభిప్రాయ పడ్డారు. భూమి, నీరు, క‌రెంటు, ఇత‌రాత్రా సౌక‌ర్యాలు క‌ల్పిస్తే సింగ‌పూర్ కంపెనీలు మాత్రం కేవ‌లం నిర్మాణాలు చేస్తాయన్నారు.
అంతా విదేశీమయం
ఏపీని తెల్ల‌దొర‌ల చేతిలో బాబు పెడుతున్నార‌ని,  ఒక‌ప్పుడు తెల్ల‌వాడి పాల‌న‌ను ఎంద‌రో మ‌హానాయ‌కులు త‌ర‌మికొడితే బాబు ఆ పాల‌న‌ను తిరిగి  తీసుకొస్తున్నాడ‌ని రోజా నిప్పులు చెరిగారు. టీడీపీ మంత్రులు సైతం చంద్రబాబు తాన అంటే తందానా అంటున్నార‌ని ఆరోపించారు. స్విస్ చాలెంజ్ పద్ధతిని అడ్డుకునేందుకు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామ‌న్నారు. సింగ‌పూర్ అమ్ముకుంటే అందులో 58శాతం వారికి ఇచ్చే ఒప్పందంలో అవినీతి నెల‌కొంద‌న్నారు. భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఎక్క‌డ కూడా ఇలా జ‌ర‌గ‌లేద‌న్నారు. ఎక్క‌డో ఉన్న సింగ‌పూర్ వారిని తీసుకొచ్చి వారికి ల‌బ్ధి చేసేవిధంగా చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. అమ‌రావ‌తిలో భూముల్ని బినామీల పేరుతో కొల్ల‌గొట్టి, బినామీల కోస‌మే సింగ‌పూర్ కంపెనీల‌కు రాజ‌ధానిని అప్ప‌గించార‌ని రోజా ఆరోపించారు.

అమ‌రావ‌తి పేరుతో బాంబులు...
రాజ‌ధాని పేరుతో అమ‌రావ‌తి నిర్మిస్తున్నారా..?  లేక అమ‌రావ‌తి పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బాంబులు పేల్చ‌బోతున్నారా అని రోజా బాబును ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించిన విజ‌య్ కేల్క‌రీ క‌మిటీ సైతం స్విస్ ఛాలెంజ్ ప‌ద్ద‌తి వ‌ల్ల న‌ష్ట‌మ‌ని నివేద‌క స‌మ‌ర్పించిందన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానం వ‌ద్ద‌ని సుప్రీం కోర్టు స్వ‌యంగా చెప్పినప్పటికీ, బాబు విన‌టం లేద‌న్నారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అడ్డుకుంటుంద‌న్నారు. రాష్ట్రాన్ని విభ‌జ‌న చేయ‌డం వ‌ల్ల సోనియాగాంధీని ప్ర‌జ‌లు ఎలా దూరం పెట్టారో... బాబు చేసే అవినీతిని చూసి ప్ర‌జ‌లు  అలాగే దూరం పెడ‌తార‌న్నారు. భ‌గ‌వంతుడు అంటే భ‌యంలేని బాబు దేశాన్ని ఏం గౌర‌విస్తాడు... రాష్ట్రాన్ని ఏం పాలిస్తార‌ని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని తెలుగు దొంగ‌ల పార్టీగా మార్చిన ఘ‌న‌త బాబుద‌న్నారు.
మోడీ మెకిన్ ఇండియా... బాబూ టెకిన్ ఇండియా...
మోడీ మెకిన్ ఇండియా అంటుంటే... బాబు టెకిన్ ఇండియా అంటున్నార‌ని ఆమె తెలిపారు. బాబు అవినీతి పాల‌న‌పై బీజేపీ నాయ‌కులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. రాజ‌ధాని బాబుదో లేక బాబు కుటుంబానికి సంబంధించిన‌దో కాద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు సంబంధించినద‌ని రోజా పేర్కొన్నారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రాన‌ని బాబే చెప్ప‌డం జ‌రిగింద‌న్నారు. సింగ‌పూర్ కంపెనీల‌కు సైతం టీడీపీ అధికారంలోకి రాదన్నవిష‌యం అర్థ‌మ‌యింద‌న్నారు. అందువ‌ల్లే ఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా, ఈ ప‌ద్ధ‌తిని కొన‌సాగించాల‌న్న నిబంధ‌న విధించార‌న్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆధ్వ‌ర్యంలో తిరిగి ఢిల్లీకి వెళ్లి స్విస్ ఛాలెంజ్ పద్ధ‌తిపై పోరాటం చేస్తామ‌న్నారు. ఛాన‌ళ్ల‌ను సైతం పెద్ద‌బాబు, చినబాబుత‌మ గుప్పెట్లో పెట్టుకున్నారని చెప్పారు. ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్ట‌డం, పొలాల‌ను త‌గ‌ల‌బెట్ట‌డం వంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌న్నారు. 
  బాబు చేస్తున్న అవినీతికి వ్య‌తిరేకం
రాజ‌ధాని అనేది ఒక్కరికి సంబంధించింది కాద‌ని అంద‌రీ భ‌విష్య‌త్‌కు సంబంధించిన విష‌య‌మ‌న్నారు. గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిస్తే ప్ర‌పంచంలో ఉన్న అంద‌రూ పాల్గొంటార‌న్నారు. రాష్ట్రంలో ఎన్ని అరాచ‌కాలు జ‌రిగినా బాబును ప్ర‌శ్నించేవారు లేకుండా కేసులు పెడుతున్నార‌న్నారు. ప్ర‌భుత్వం రూ. 5వేల కోట్ల‌తో మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తుంద‌న‌డంలో ఎంత‌మేర నిజ‌ముంద‌న్నారు. భూకంపం వ‌చ్చినా, సునామీ వ‌చ్చినా సింగ‌పూర్‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి అని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులు క‌ట్టిన ఘ‌న‌త భార‌తీయుల‌కు ఉంద‌న్నారు. చంద్ర‌బాబు ద‌ద్ద‌మ్మ కాబ‌ట్టి భార‌త‌దేశంలో ఉన్న యువ‌త‌, ఇంజ‌నీర్లు ద‌ద్ద‌మ్మ‌లు అనుకోవ‌డం సిగ్గు చేట‌న్నారు. బాబు త‌న‌యుడు ఫారిన్‌లో చ‌దువుకున్నా రాష్ట్రానికి ఏమాత్రం ఉప‌యోగం లేద‌న్నారు.  ప్ర‌స్తుతం నాసాలో 50శాతానికి పైగా భార‌తీయులు ప‌ని చేస్తున్నార‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.   
నో పోలీస్‌,... 
త‌న బావ‌మ‌రిది బాలక్రష్ణ నటించిన సింహ సినిమాలో నో పోలీస్ అన్న డైలాగును బాబు ఆచ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. బాబు ప‌బ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్క‌రాలో 29 మందిని చంపేస్తే నో పోలీస్‌... రితితేశ్వ‌రీని ర్యాంగింగ్ చేసి చంపేస్తే నో పోలీస్‌... కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్‌లో వంద‌ల మంది మ‌హిళ‌ల‌ను వ్య‌బిచారంలోకి దించితే నో పోలీస్‌... కాల్‌మ‌నీ వ్య‌వ‌హారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మ‌హిళ‌ల‌పై రెచ్చిపోయిన నో పోలీస్... చింత‌మ‌నేని వ‌న‌జాక్షిని కొట్టిన నో పోలీస్ అన్న ధోర‌ణితోనే బాబు పాల‌న ఉంద‌ని మండిప‌డ్డారు. ప్రాణం పోతుంటే మంచినీళ్లు ఇవ్వ‌కుండా త‌రువాత బంగారు గ్లాసులో ఇస్తాన‌న్న విధంగా బాబు పాల‌న ఉంద‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఏపీకి రావాల్సిన హ‌క్కుల‌ను ముందు తీసుకు వ‌చ్చి చూపించాల‌న్నారు. రాజ‌ధాని అనేదీ కేవ‌లం అర‌చేతిలో వైకుంఠ‌మ‌న్నారు. 

కేంద్రం ప్రశ్నకు జవాబేది చంద్రబాబూ..

హైదరాబాద్: కేంద్రం ఇస్తున్న నిధుల్ని దిగమింగేసి, సొంత డబ్బా కొట్టుకొనే చంద్రబాబుకి ఢిల్లీ పెద్దలు షాక్ ఇచ్చారు. కొత్త నిధులు ఇవ్వాలంటే పాత వాటికి ఖర్చులు చెప్పాల్సిందే అని తాకీదు పంపారు.
అసలేమైందంటే..
  2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఉత్త‌రాంధ్ర‌లోని మూడు, రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌కు ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున రూ. 350 కోట్ల‌ను  కేంద్రం ఇచ్చింది. 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో కూడా ఇదే త‌ర‌హాలో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున ఏడు జిల్లాల‌కు రూ. 350 కోట్లు ఇచ్చింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి కూడా నిధులు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోరినప్పుడు కేంద్రం తీవ్రంగా స్పందించింది. జమా ఖర్చులు  పంపించాల్సిందిగా కోరినప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కూ పంప‌క‌పోవ‌డాన్ని త‌ప్పుప‌ట్టింది. కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను త‌క్ష‌ణ‌మే పంపాల‌ని, అలాగే ఇచ్చిన నిధులు రూ. 700 కోట్ల‌కు సంబంధించిన వినియోగ ప‌త్రాల‌ను పంపించాల‌ని పేర్కొంది. వాటిని పంపాకే త‌దుప‌రి నిధులు ఇస్తామ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌ణాళిక శాఖ‌కు లేఖ రాసింది. 
కేంద్రం నిధులు ప‌క్కదారి?
వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధుల‌ను ఏపీ స‌ర్కారు ప‌క్క‌దారి ప‌ట్టించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం అనుమానం వ్య‌క్తం చేస్తోంది. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు ఏడు జిల్లాల్లో రూ. 52 కోట్ల‌తో  స్కానింగ్ యంత్రాల‌ను కొనుగోలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధుల నుంచే వీటిని కొన్నారు. దీంతోపాటు మ‌రికొన్ని రంగాల‌కు ఈ నిధుల‌ను వెచ్చించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ల‌కే ఆ నిధుల‌ను విడుద‌ల చేశామ‌ని, వారే దేనికి ఎంత వ్య‌యం చేయాలో నిర్ధారించాల్సి ఉంద‌ని రాష్ట్ర ప్ర‌ణాళికా శాఖ పేర్కొంటోంది. ఏడు జిల్లాల అభివృద్ధికి ఇచ్చిన రూ. 700 కోట్ల‌ను     ప‌క్క‌దారి ప‌ట్టించ‌డంపై కేంద్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 
గతంలోనూ దొంగలెక్కలు
దీనికైనా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా స్పందిస్తుందా లేక, ఎప్పటిలాగే దొంగలెక్కలు రాసి తప్పించుకొంటుందా అన్న మాట వినిపిస్తోంది. గతంలో రాజధానికి ఇచ్చిన రూ. 18వందల కోట్లకు కేంద్రం లెక్కలు అడిగింది. అప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో గవర్నర్ నివాసం అయిన రాజ్ భవన్, హైకోర్టు భవనాలు కట్టేసినట్లుగా లెక్కలు రాసేసి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకొంది.

కోడెల‌పై అన‌ర్హ‌త వేటు వేయాలి


హైదరాబాద్: అడ్డగోలుగా డ‌బ్బులు వెద‌జ‌ల్లి గెలిచిన స‌త్తెన‌ప‌ల్లి   టీడీపీ ఎమ్మెల్యే మరియు స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్ గెలుపు నైతిక గెలుపు కాద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు అన్నారు. 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రూ. 30వేలు ఖ‌ర్చ అయ్యాయ‌ని,  అదే 2014లో పోటీచేస్తే రూ. 11.5 కోట్లు ఖ‌ర్చు అయ్యాయ‌ని చెప్పిన కోడెలపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అంబ‌టి అన్నారు. ఎన్నిక‌ల నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి ఖ‌ర్చు చేసిన   కోడెల‌పై ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భ‌న్వ‌ర్‌లాల్‌కు వైయ‌స్సార్సీపీ నాయకులు అంబ‌టి, వాసిరెడ్డి పద్మ,  ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా త‌దితరులు ఫిర్యాదు చేశారు. 


వేటు వేయాల్సిందే
ఎన్నిక‌ల నియామ‌వ‌ళికి విరుద్ధంగా ఖ‌ర్చు చేసిన కోడెల‌పై అన‌ర్హ‌త చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఓ టీవీ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో త‌న ఎన్నిక‌ల ఖ‌ర్చు రూ. 11.5 కోట్లు అయ్యాయ‌ని కోడెల స్వ‌యంగా చెప్పార‌న్నారు. రూ. 28ల‌క్ష‌ల‌కు మించి ఖ‌ర్చు చేయ‌రాద‌ని ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉన్నప్పటికీ అందుకు వ్య‌తిరేకంగా కోడెల కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశార‌ని అంబ‌టి మండిప‌డ్డారు. రూ. 11.5 కోట్లు ఖ‌ర్చు చేసి త‌న‌పై కేవ‌లం 924 ఓట్ల తేడాతోనే గెలిచాడ‌ని ఎద్దేవా చేశారు. అక్ర‌మంగా సంపాధించిన డ‌బ్బును నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు ల‌క్ష‌ల మందికి పంచార‌ని విమ‌ర్శించారు. అక్ర‌మ ప‌ద్ధ‌తిలో గెలుపొందిన వ్య‌క్తి కాబ‌ట్టే ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్న ఎమ్మెల్యేల‌పై వేటు వేయ‌టం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ తీసుకునే నిర్ణ‌యం ఆధారంగా న్యాయ‌నిపుణుల‌ను సంప్ర‌దిస్తామ‌న్నారు.  


డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టేముందు రూల్స్ గుర్తుకు రాలేవా..?
అసెంబ్లీలో రూల్స్‌, రెగ్యూలేష‌న్స్ అని ప‌దేప‌దే మాట్లాడే స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌కు ఎన్నికల నియామ‌వ‌ళికి విరూద్దంగా డ‌బ్బులు ఖర్చు చేసేట‌ప్పుడు రూల్స్ గుర్తుకు రాలేదా అని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజా అన్నారు. కోడెల డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టిన విధానం చూస్తేనే ఎంత‌మేర నైతిక విలువ‌లు ఉన్నాయో   తెలుస్తుంద‌న్నారు. ఎన్నిక‌ల్లో అక్ర‌మ మార్గంలో గెలుపొందారు కాబ‌ట్టే ఆయ‌న కుమారుడు, కూతురు, డ్రైవ‌ర్, బినామీల పేర్ల‌తో రాజ‌ధాని చుట్టూ భూములు కొనుగోలు చేస్తున్నార‌ని ఆరోపించారు. కోడెల కూతురు చేస్తున్న అవినీతిని పార్టీ ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ రెడ్డి ఆధారాల‌తో స‌హా నిరూపించిన విష‌యం గుర్తు చేశారు. 
స్పీక‌ర్ స్థానంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌లు జ‌రిపించాల్సిన కోడెల టీడీపీ ఎమ్మెల్యేలను వైయ‌స్సార్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపైకి ఉసిగొల్పుతున్న తీరు చూస్తే ప్ర‌జ‌ల‌పై, శాస‌న‌స‌భ‌పై ఎంత గౌర‌వం ఉందో తెలుస్తుంద‌న్నారు. చంద్ర‌బాబు కోట్లు పెట్టి ఎమ్మెల్యేల‌ను కొంటుంటే స్పీక‌ర్ డ‌బ్బులు పెట్టి ఓట్లు కొంటున్నాన‌ని ప్ర‌జ‌ల‌ను అవ‌మానిస్తున్నార‌ని మండిపడ్డారు. భ‌విష్య‌త్‌లో ఇలాంటివి పున‌రావృతం కాకుండా కోడెల శివ‌ప్ర‌సాద్‌ను సస్పెండ్ చేయాల‌ని ఆమె కోరారు.
బాబు బాటలో కోడెల
ఓటుకు నోటు కేసులో  త‌న‌దైన అడ్డ‌దారిలో త‌ప్పించుకున్న చంద్ర‌బాబు దారిలోనే కోడెల న‌డుస్తున్నార‌ని వైయ‌స్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు. ఎన్నిక‌ల నిబంధ‌న‌లో కోడెల తాను ఇచ్చిన అఫిడ‌విట్ త‌ప్పు అని ఒప్పుకున్న త‌ర్వాత కూడా చర్య‌లు తీసుకోక‌పోతే ప్ర‌జాస్వామ్యం బ‌త‌క‌ద‌న్నారు. 

28 June 2016

ప్రజలకు మరింతగా సేవలు


న్యూఢిల్లీ: వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా విజయసాయిరెడ్డి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.
అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ పదవిని తాను అలంకార ప్రాయంగా భావించటం లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి రాష్ట్రాభివృద్ధికి తన వంతుగా పాటు పడతానని ఆయన అన్నారు. వైయస్సార్సీపీ నుంచి తానే మొదటి రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావటం సంతోషంగా ఉందని అభిప్రాయ పడ్డారు. ఇందుకు గాను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 

విదేశీ మోజులో అమరావతిని నాశనం చేస్తున్నారు

  • కుమారుడికి దోచిపెట్టడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు
  • నెంబ‌ర్ 1 కూలీ కాదు... నెంబ‌ర్ 1 విలాసాల ముఖ్య‌మంత్రి 
  • విదేశీ పర్యటనలో మోడీని మించిపోయారు
  • విమానాల్లో తరలుతున్న సూట్ కేసుల్లో ఏముందో బాబు చెప్పాలి
  • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు

హైదరాబాద్ః రాష్ట్రానికి నేను ముఖ్య‌మంత్రిని కాదు నెంబ‌ర్ వ‌న్ కూలీన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు కుటుంబం... 7 స్టార్ హోట‌ల్ లో ఎందుకు ఉంటుంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు నిలదీశారు. ప్ర‌భుత్వ సొమ్మును వంద‌ల కోట్లు ఖ‌ర్చుపెడుతూ, ప్ర‌త్యేక విమానాల్లో విదేశాల‌కు వెళ్లే బాబు నెంబ‌ర్ 1 కూలేనా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. భార‌త‌దేశంలో ఉన్న ముఖ్య‌మంత్రులంద‌రిలో అత్యంత విలాసవంత‌మైన ఖ‌ర్చుదారుడైన ముఖ్య‌మంత్రి చంద్రబాబేనని అంబటి దుయ్యబట్టారు. బాబు నెంబర్ వన్ కూలా లేక విలాసవంతమైన ముఖ్యమంత్రో ఒక్కసారి ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌ని సూచించారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని పెట్టుబ‌డులు తెచ్చారు బాబు..?
రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురావ‌డానికే నేను విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నానని చెప్పే బాబు ఇంత వ‌ర‌కు ఎన్ని పెట్టుబ‌డులు తీసుకోచ్చారో చెప్పాల‌ని అంబ‌టి డిమాండ్ చేశారు. నేరుగా విదేశీ పెట్టుబ‌డులు భారత‌దేశానికి రావ‌డం త‌గ్గిపోయాయ‌ని ఆయ‌న తెలిపారు. 18 దేశాల్లో నేరుగా విదేశీ పెట్టుబ‌డులు తీసుకురావ‌డంలో భార‌త‌దేశం పేరు లేద‌ని వివ‌రించారు. ఇండియాకు నిధులు త‌క్కువ వ‌చ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎక్కువ పెట్టుబ‌డులు ఎలా వ‌స్తాయో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. 

మోడీని మించిపోయారు
చంద్ర‌బాబు విదేశీప‌ర్య‌ట‌న‌లో మోడీని సైతం మించిపోయార‌ని అంబ‌టి ఎద్దేవా చేశారు. భార‌త‌దేశ పాల‌సీమీదే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు నేరుగా విదేశీ పెట్టుబ‌డులు ఉంటాయ‌న్న విష‌యాన్ని బాబు విస్మ‌రిస్తున్నారో లేక నాట‌కం ఆడుతున్నారో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు.  రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు జపాన్  అంగీక‌రించింద‌ని బాబు చెప్పారని... మ‌రి ఆ పెట్టుబ‌డులు ఏమ‌య్యాయ‌ని అంబటి ప్ర‌శ్నించారు. ఎంఓఎం రాసుకోవ‌డానికి ముందుకువ‌చ్చాయ‌న్న బాబు మాట‌లు గాలిలో మేడ‌ల వంటివ‌ని విమ‌ర్శించారు. బాబు రెండేళ్ల పరిపాల‌న‌లో ఒక్క రూపాయి పెట్టుబ‌డి తీసుకువ‌చ్చారా అని నిల‌దీశారు. విశాఖ‌ప‌ట్నంలో పార్ట్‌న‌ర్‌షిఫ్ స‌మ్మిట్ పెట్టి రూ.ల‌క్ష 50వేల కోట్ల రూపాయ‌లు వ‌స్తున్నాయ‌న్న బాబు మ‌రి ఎందుకు రాలేదో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. 

పెట్టుబ‌డులు తీసుకురావ‌డానికా...?  దోచుకుంది దాచుకోవ‌డానికా..?
మాట్లాడితే చైనా, జ‌పాన్‌, సింగ‌పూర్‌, దావోస్ అంటూ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసే చంద్ర‌బాబు అస‌లు రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురావ‌డానికి వెళ్తున్నారా..?  లేక ఏపీలో దోచుకుంది దాచుకోవ‌డానికి వెళ్తున్నారా అని అంబ‌టి విమ‌ర్శించారు. ప్ర‌త్యేక విమానాల్లో సూట్‌కేస్‌లతో ఎందుకు వెళుతున్నారో స‌మాధానం చెప్పాల‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి క‌న్నా ఎక్కువ‌గా విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న బాబుపై కేంద్రం ఎందుకు ప‌రిశీల‌న పెట్ట‌లేద‌ని ఆయ‌న నిలదీశారు. ఇప్ప‌టికైనా బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌పై ప‌రిశీల‌న పెట్టాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. చంద్ర‌బాబు ధోర‌ణి దేశానికి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల‌ను తెచ్చిపెట్టే విధంగా క‌నిపిస్తున్నాయ‌ని మండిపడ్డారు. 

ప్రత్యేకహోదాను కాదని బిక్షాటనా
బాబు విదేశీ పెట్టుబ‌డుల కోసం ఎందుకు బిక్షాట‌న చేస్తున్నార‌ని అంబటి ప్ర‌శ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌దుపాయ‌లు బాగుంటే వారే వ‌చ్చి పెట్టుబ‌డులు పెడ‌తార‌ని సూచించారు. స‌దుపాయాలు బాగుండాలంటే గ‌తంలో బీజేపీ ఇచ్చిన ప్ర‌త్యేక హోదా ఇస్తే అన్ని స‌దుపాయ‌లు బాగుంటాయ‌ని, అప్పుడు బాబు వ‌ద్ద‌న్నా వ‌చ్చి మ‌రి పెట్టుబ‌డులు పెడ‌తార‌ని తెలిపారు. అధిక లాభాలు పొందే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి వారే వ‌స్తారన్నారు. 

పోలీసుల‌కు ప‌చ్చ చొక్కాలు వేసి తిప్పుతున్నార‌ని, వ్యాపార‌వేత్త‌ల‌ను జైలులో పెట్టే ప‌రిస్థితిని బాబు తీసుకొచ్చార‌ని అంబటి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టాలంటే భ‌య‌ప‌డే దుస్థితి నెల‌కొంద‌న్నారు. స్విస్ ఛాలెంజ్ ప‌ద్థ‌తి చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని ఐఏఎస్ అధికారులే చెబుతున్నార‌న్నారు. బాబు ప‌రిపాల‌న స‌క్ర‌మంగా లేనందునే పెట్టుబ‌డులు పెట్ట‌డం లేద‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా బాబు ప్ర‌త్యేక హోదా తీసుకొచ్చి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని అంబటి సూచించారు. విదేశాల మోజులో స్వ‌దేశంలో ఉన్న వ్యాపార‌వేత్త‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా బాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సింగపూర్ వాళ్లు సిమెంట్‌, ఇసుక ఏమైనా తెస్తారా..?
తెలుగు వాళ్లు రాజ‌ధానిని మురికివాడ‌లుగా క‌డ‌తార‌న్న బాబు వ్యాఖ్య‌లు సిగ్గు చేట‌న్నారు. సింగ‌పూర్ వారికి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు అప్ప‌గిస్తే సింగ‌పూర్ నుంచి ఇసుక‌, ఇటుక‌, ఐరన్, సిమెంట్‌, వేల సంఖ్య‌లో కూలీల‌ను  ఏమైనా తీసుకొస్తారా..? అని అంబ‌టి ప్ర‌శ్నించారు. సింగ‌పూర్ వారు రాజ‌ధానిని నిర్మించిన దానికి మ‌న సిమెంట్‌, మ‌న ఇటుక‌, మ‌న మాన‌వ వ‌న‌రులు, మ‌న కూలీలే ప‌ని చేయాల‌న్న విష‌యం బాబు తెలుసుకోవాల‌న్నారు. విదేశీ వ్యామోహంలో బాబు అమ‌రావ‌తిని న‌ాశ‌నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మ‌న‌వాళ్లు రాజధాని క‌డితే క‌మీష‌న్‌లు ఇవ్వ‌ర‌నే బాబు విదేశాల‌కు అప్ప‌గిస్తున్నార‌ని ఆరోపించారు. 

స్వీడ‌మ్ నుంచి ఒక ఆర్థిక మినిస్ట‌ర్ వ‌చ్చిన‌ప్పుడు బాబు ఇలాగే ఇష్ట‌మొచ్చిన‌ట్లు కూత‌లు కూస్తే ...ఆయన వెళ్తూ ఇలాంటి వారిని మా దేశంలో పిచ్చి ఆస్ప‌త్రికి పంపిస్తాన‌ని చెప్పిన విష‌యం గుర్తు చేశారు. రాజ‌ధాని నిర్మాణ ప‌నుల‌ను మీడియా కెమెరాల‌కు చిక్క‌కుండా నిశిద్ధ ప్రాంతంలాగా పోలీసుల‌ను మొహరించ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. కేవ‌లం త‌న కుమారుడికి దోచిపెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా బాబు ప‌ని చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. బాబు అక్ర‌మ, అన్యాయ పాల‌న‌ను వైయ‌స్సార్‌సీపీ ఎప్పుటికప్పుడు ఎండ‌గ‌డుతుంద‌న్నారు. భ‌వ‌నాలు పూర్తికాక‌ముందే ప్రారంభోత్స‌వాలు ఏంట‌ని ఆయ‌న కడిగిపారేశారు. ఓటుకు నోటు కేసు ఒప్పందంలో భాగంగానే హైద‌రాబాద్ నుంచి బాబు పారిపోతున్నార‌ని విమ‌ర్శించారు. 

27 June 2016

బెదిరింపులే టీడీపీ మార్గం


వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ డోన్ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌

కర్నూలు: ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను చులకన చేయ‌డమే ధ్యేయంగా టీడీపీ ప‌ని చేస్తోంద‌ని పీఏసీ చైర్మ‌న్‌, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ డోన్ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి అన్నారు. డోన్ నియోజక‌వ‌ర్గ టీడీపీ ఇంచార్జీ కేఈ ప్ర‌తాప్ సోద‌రులు అధికారులను బెదిరించడం, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం, దౌర్జన్యానికి పాల్పడటమే ధ్యేయంగా ప‌ని చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 

మద్యం వ్యాపారంలో సంబంధాలు ఉన్న వ్యక్తులు సంఘ సంస్కర్తలు ఎలా అవుతారని రాజేంద్రనాథ్‌రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు. సంఘ సంస్కర్త కోటాలో జన్మభూమి కమిటీలో సభ్యుడిగా చేరిన కేఈ ప్రతాప్‌కు నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు సంబంధం ఉంద‌న్నారు. ప్రభుత్వ ధర కంటే 10 శాతం అధికంగా విక్ర‌యిస్తున్న‌ప్ప‌టికీ ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. నియోజకవర్గంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న భవనాలను డిప్యూటీ సీఎం హోదాలో కేఈ కృష్ణమూర్తి ప్రారంభించడం ఎంత వరకు సమంజసమన్నారు. గత ప్రభుత్వాల పథకాలకు కేఈ సోదరులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఆయా పథకాలకు నిధులు ఎవరు మంజూరు చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.

తనకు మతిభ్రమించిందంటూ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రపంచంలో అందరి చిట్టాలు విప్పే అతని చరిత్ర గురించి ఎవరికీ తెలియదనుకోవడం అవవివేక‌మ‌ని బుగ్గ‌న అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే  పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొల‌గించిన విష‌యం గుర్తు చేశారు. ఆయన వసూళ్ల గురించి కర్నూలులో ఏ పెట్రోల్ బంక్, కిరాణ షాపు యజమానిని అడిగినా చెబుతారన్నారు. అలాంటి వ్యక్తులకు తనను విమర్శించే స్థాయి ఎక్కడిదని ప్రశ్నించారు.

బాబోయ్‌.. అవినీతి అనకొండ

అమరావతి:  రాజ‌ధాని లో అడుగ‌డుగునా పెద‌బాబు, చిన‌బాబుల అవినీతి బుస‌లు కొడుతోంది. ఈ ర‌క‌మైన‌ అరాచ‌క పాల‌న‌, అడ్డ‌గోలు నిర్ణ‌యాల‌కు మ‌రో ప్ర‌త్య‌క్ష సాక్ష్యం కొండ‌వీటి వాగు వ‌ర‌ద నీటిఎత్తిపోత‌ల ప‌థ‌కం. ఊరుపేరులేని కంపెనీకి రూ. 200 కోట్ల విలువైన ప‌నులు అప్ప‌గించేందుకు చిన్నబాబు ఏర్పాట్లు చేశారు.

జ‌రిగింది ఏమిటంటే
 గరిష్టంగా రూ. 10 లక్షల కు మించితే తప్పకుండా టెండర్లు పిలవాలనే నిబంధన ఉంది. రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువైన పనులకు టెండర్లు పిలిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ అనుమతి త‌ప్ప‌నిస‌రి అన్న‌ది నిబంధ‌న‌. అయితే టెండర్లలో పోటీ పెరిగినా అడ్డగోలు వ్యవహారాలకు సీఎస్ అడ్డుకట్ట వేసినా అనుకున్న మేరకు ముడుపులు అందే అవకాశంలేదు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా అనుకున్నవాడికి అనుకున్న రేటుకు కట్టబెట్టి భారీగా  కమీషన్లు నొక్కేసేందుకు చినబాబు వ్యూహం రచించగా  సాగునీటి శాఖ అధికారులు అమలు చేసేశారు. రూ.200 కోట్ల పనులను నిబంధనలకు విరుద్ధంగా అక్వాటెక్ కంపెనీకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

సాంకేతికంగా స్కెచ్‌
కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతలకు దాదాపు రూ. 200 కోట్ల విలువైన పంపులు, మోటార్లు సరఫరా చేయడానికి కొటేషన్లు ఇవ్వాలంటూ గుంటూరు ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ కేవీఎల్‌ఎన్‌పీ చౌదరి ఈనెల 15న ఎంపిక చేసిన నాలుగైదు కంపెనీలకు లేఖలు రాశారు. అందులో పని విలువ కాని, సాంకేతికపరమైన పూర్తి వివరాలు కానీ ఇవ్వలేదు. దాదాపు ఆరు వేల క్యూసెక్కుల నీటిని 10-12 మీటర్లు ఎత్తిపోవడానికి వీలుగా పంపులు, మోటార్లు ఏర్పాటుచేయాలని మాత్రమే పేర్కొన్నారు. పంపులు, మోటార్లలో పేరెన్నికగన్న కంపెనీలు కిర్లోస్కర్, కేఎస్‌బీ, విలో, ఫ్లోమోర్ లాంటి కంపెనీలకు లేఖలే రాయకపోవడం గమనార్హం. ఎస్‌ఈ లేఖకు మూడు కంపెనీలు స్పందించాయి.

తమిళనాడుకు చెందిన కంపెనీ ఈ-మెయిల్‌లో ప్రతిపాదనలు పంపించిందని సాకుగా చూపించి అనర్హత వేటు వేశారు. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీని కూడా ఏదో సాకు చూపించి అనర్హత వేటు వేశారు. ఫైనల్‌గా చినబాబుతో ముందస్తు అవగాహన ఉన్న అక్వాటెక్ కంపెనీకి పనులు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంలో దాదాపు రూ. 100 కోట్లు ముడుపులు చేతులు మారనున్నట్లు సాగునీటి శాఖలో ప్రచారం జరుగుతోంది.
 
విద్యుత్ లేకుండా ఎలా
దాదాపు ఆరు వేల క్యూసెక్కుల వరద నీటిని తోడటానికి వీలుగా ఏర్పాటుచేయనున్న మోటార్లకు 30 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా. అయితే అత్యవసరంగా అంత విద్యుత్ సరఫరా చేయడానికి అవకాశం లేదు. 220 కేవీ విద్యుత్ లైన్ నుంచి సరఫరా చేస్తే, లోడ్ సరిపోదని విద్యుత్ ఇంజనీర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరా అందించాలనే నిర్ణయానికి వచ్చారు. నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్) ఒక్కో యూనిట్‌లో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఏడో వంతు విద్యుత్ ఉత్పత్తిని డీజిల్ జనరేటర్లతో చేయాలని, దాంతో ఎత్తిపోతల మోటార్లు నడిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా డీజిల్ వాడటం వల్ల కాలుష్యం భారీగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు డీజిల్ జనరేటర్లు సరఫరా చేసే కాంట్రాక్టును కూడా చినబాబు సూచించిన వ్యక్తికి ఇవ్వడానికి పావులు కదులుతున్నాయి. మోటార్లు, పంపులు సిద్ధమైన తర్వాత అత్యవసరం పేరిట డీజిల్ మోటార్లు భారీ ధరలకు తెచ్చిపెడతారని అధికార వర్గాలు తెలిపాయి. డీజిల్ జనరేటర్లు, ఇతర సివిల్ పనులు కనీసం రూ. 200 కోట్లుగా నిర్ధారించడానికి రంగం సిద్ధమయిందని ఆ వర్గాల సమాచారం.

25 June 2016

పరవళ్లు తొక్కుతున్న అవినీతి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి వరదలై పొంగుతోంది. సాగునీటి పారుదల రంగంలో అయితే పరవళ్లు తొక్కుతోంది. కేవలం నాలుగు ప్రాజెక్టుల విషయంలో లెక్కలు తీసినా గుండె గుభేల్ మంటుంది. అక్షారాల  రూ. 748 కోట్లు లూటీ చేసిన నాలుగు ప్రాజెక్టుల వివరాలు చూద్దాం. 
గోరకల్లులో రూ.350 కోట్లు 
గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(ఎస్‌ఆర్‌బీసీ) 56.77 కి.మీల వద్ద 12.44 టీఎంసీల సామర్థ్యంతో కర్నూల్ జిల్లాలోని గోరకల్లులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చినప్పుడు ఎస్‌ఆర్‌బీసీ ద్వారా తరలించి, గోరకల్లు రిజర్వాయర్‌లో నిల్వ చేసి గాలేరు-నగరి సుజల స్రవంతి ఆయకట్టుకు నీళ్లందించడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించింది. ఈ రిజర్వాయర్ పనులకు 2005లో టెండర్ పిలిచారు. సాబీర్-షూ-ప్రసాద్(జాయింట్ వెంచర్) సంస్థ 14.33 శాతం తక్కువ ధరకు కోట్ చేసి రూ.448.20 కోట్లకు పనులను చేజిక్కించుకుంది. ఈ జాయింట్ వెంచర్‌లో సింహభాగం వాటా టీడీపీ మాజీ మంత్రికి చెందిన సాబీర్ సంస్థదే కావడం గమనార్హం. ఇప్పటికే 92 శాతం పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ రూ.428 కోట్లను బిల్లుల రూపంలో పొందారు. మరో రూ.20.20 కోట్ల విలువైన 8 శాతం పనులు మాత్రమే చేయాల్సి ఉంది.
గోరకల్లు ప్రాజెక్టులో తట్టెడు మట్టెత్తకుండానే రూ. 350 కోట్లు కొట్టేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. పెదబాబు డెరైక్షన్‌లో కీలక మంత్రి చక్రం తిప్పారు. అధికారపార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన కాంట్రాక్టర్‌తో కలసి మాస్టర్ ప్లాన్ అమలుకు పూనుకున్నారు. జలాశయంలోకి నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని సాకుగా చూపి అంచనా వ్యయాన్ని రూ.448.20 కోట్ల నుంచి రూ.840.34 కోట్లకు పెంచేశారు. అదనపు పని విలువ రూ.42.17 కోట్లకు మించదని జలవనరుల శాఖ అధికారవర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. తక్కిన రూ.350 కోట్లను కాంట్రాక్టర్‌తో కలసి పెదబాబు దోచుకోవడానికి రంగం సిద్ధం చేశారు. 
హంద్రీ-నీవాలో రూ. 54 కోట్లు
హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి రాయలసీమలో 4.04 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హంద్రీ-నీవా ప్రధాన కాలువ సమీపంలో చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం అడవిపల్లె వద్ద 1.089 టీఎంసీల సామర్థ్యంతో ఓ రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ రిజర్వాయర్‌కు నీళ్లందాలంటే చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలోని గొల్లపల్లె నుంచి వైయ‌స్సార్ కడప జిల్లా చిన్నమండ్యం మండలంలో కోటగడ్డకాలనీ వరకు 4.54 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వాలి. 4.54 కిమీల సొరంగం పనులతోపాటూ 1.1 కిమీల ప్రధాన కాలువ తవ్వకం పనులను 20వ ప్యాకేజీ కింద రూ.45.57 కోట్లకు ఎకేఆర్ కోస్టల్ అనే సంస్థ తొలుత ద‌క్కించుకుంది. ప్రధాన కాలువ 1.1 కిమీల తవ్వకం పనులను పూర్తి చేసిన ఆ సంస్థ 800 మీటర్ల మేర సొరంగం పనులనూ పూర్తి చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.18.97 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించారు.
బాబు స‌ర్కార్ అధికారంలోకి రాగానే సొంత పార్టీ నేతలకు పనులు కట్టబెట్టి నిధులు దోచిపెట్టడానికి పెదబాబు ఎత్తులు వేశారు. ఆ క్రమంలోనే పనులు చేయడం లేదనే సాకు చూపి సొరంగం పనులను రద్దు చేసి, ఏకేఆర్ కోస్టల్ సంస్థ చేయగా మిగిలిన పనులను అంటే 3.74 కిమీల సొరంగం పనులను రూ.28.6 కోట్లకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు ఏకంగా నామినేషన్‌పై అప్ప‌గించారు. రూ. పది లక్షల విలువైన పనులను మాత్రమే నామినేషన్‌పై అప్పగించవచ్చు. కాబ‌ట్టి సొంత పార్టీ నేతకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు తుంగలో తొక్కారు. ఆర్కే కన్‌స్ట్రక్షన్స్ సంస్థ 300 మీటర్ల పనులను చేసింది. ఇందుకు ఆ సంస్థకు రూ.11.88 కోట్లు బిల్లులు చెల్లించారు. తక్కిన రూ. 16.77 కోట్ల విలువైన పనులను రద్దు చేసి అంచనాలు పెంచేసి మరో బినామీ కాంట్రాక్టర్‌కు అప్ప‌గించి దోపిడీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆమేరకు అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.70.82 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారు. అంటే రూ. 54 కోట్ల మేర కాజేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.  
పులిచింతలలో రూ. 300 కోట్లు
 కృష్ణా డెల్టాలో 12.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించాలన్న లక్ష్యంతో కృష్ణా నదిపై నాగార్జునసాగర్‌కు 121 కి.మీల దిగువన ప్రకాశం బ్యారేజీకి 83 కి.మీల ఎగువన పులిచింతల ప్రాజెక్టుకు అక్టోబర్ 15, 2004న దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.268.87 కోట్లతో చేపట్టిన పులిచింతల హెడ్ వర్క్స్ పనులను టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ద‌క్కించుకుంది. టెండర్ ఒప్పందం ప్రకారం పనులను మార్చి 31, 2007 నాటికే పూర్తి చేయాలి. అప్పట్లో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినా పనులను పూర్తిచేయడంలో కాంట్రాక్టు సంస్థ తీవ్ర జాప్యం చేసింది. ఒక దశలో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవడంతో పనుల్లో కొంత కదలిక వచ్చింది.
పెదబాబు  వ్యూహం మేర‌కు 2014 నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.300 కోట్లు చెల్లించాలంటూ పులిచింతల కాంట్రాక్టర్ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌కు లేఖ రాశారు. అదనంగా రూ.300 కోట్లు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్ అలా లేఖ రాశారో లేదో పెదబాబు సూచనల మేరకు మంత్రి ఇలా స్పందించారు. పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు తక్షణమే రూ.300 కోట్లు చెల్లించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారు.

అవుకులో రూ.44 కోట్ల లూటీ
        గాలేరు - నగరి సుజల స్రవంతి పథకం (జీఎన్‌ఎస్‌ఎస్)లో భాగంగా అవుకు సొరంగం పనులు చేపట్టారు. జీఎన్‌ఎస్‌ఎస్ వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా అవుకు టన్నెల్ -2 తవ్వకం పనుల (30వ ప్యాకేజీ) ని రూ. 401 కోట్లకు ఎన్‌సీసీ - మేటాస్ (జాయింట్‌వెంచర్) సంస్థ చేజిక్కించుకుంది.
        టన్నెల్ తవ్వకంలో బండరాళ్లు అడ్డురావడం, మట్టిపెళ్లలు విరిగిపడడం వల్ల అలైన్‌మెంట్ మార్చాల్సి వచ్చిందనే కుంటిసాకులు చూపుతూ 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల పని అదనంగా చేయాల్సి వచ్చిందంటూ 2015 అక్టోబర్‌లో ఎన్‌సీసీ - మేటాస్ సంస్థ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసింది. అదనంగా చేసిన పనికి రూ. 44 కోట్లు చెల్లించాలని కోరింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్రక్షన్ (ఈపీసీ) నిబంధనల ప్రకారం అదనంగా చేసిన పనికి ఎలాంటి బిల్లులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. అందులోనూ డీజిల్, పెట్రోలు, ఇనుము ధరలు సైతం తగ్గాయి. సిమెంట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ పెదబాబు, చినబాబుల డెరైక్షన్‌లో కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్లు అదనంగా చెల్లించాలంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులపై తీవ్రఒత్తిడి తీసుకొచ్చారు. ఇదే ప్రాజెక్టులో 29 వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.12 కోట్ల విలువైన పనులను రద్దు చేసి రూ. 110 కోట్లకు పెంచి తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌కు కట్టబెట్టారు. అందులో రూ. 35 కోట్లను చెల్లించారు. అది తనకు తెలియకుండానే జరిగిందని జలవనరులశాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యానించడంతో కినుక వహించిన సీఎం రమేశ్ 30వ ప్యాకేజీలో అదనంగా చెల్లించబోతున్న రూ. 44 కోట్ల సంగతిని బయటపెట్టారు. అయితే ఇద్దరి మధ్య పెదబాబు రాజీ కుదర్చడంతో ఆ తర్వాత వివాదాలన్నీ తొల‌గిపోయాయి. 30వ ప్యాకేజీలో రూ.44 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించేసింది.

నారాయణ కోచింగ్ సెంటర్ లా కేబినెట్ మీటింగ్

  • రాజధాని మాటున దోచుకుంటున్నారు
  • లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు
  • ప్రజలు, ప్రతిపక్షాల మీద గౌరవం లేదు
  • నారాయణ కోచింగ్ సెంటర్ లా కేబినెట్ మీటింగ్
  • బాబు రైతులను పూర్తిగా గాలికొదిలేశాడు
  • చేతగాని ముఖ్యమంత్రి, మంత్రులు
  • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన పార్థసారథి

విజయవాడః దోపిడీ కోసమే ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని అవలంభిస్తోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. కేంద్రం నియమించిన కేల్కర్ కమిటీ స్విస్ ఛాలెంజ్ విధానం దేశానికి మంచిది కాదని, దాన్ని తొలగించాలని చెప్పినా వినకుండా చంద్రబాబు ఎందుకు కొనసాగిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా, ప్రతిపక్షాలన్నా చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని పార్థసారథి ఫైర్ అయ్యారు.  రాష్ట్ర ప్రజలు  ఇచ్చిన ఓ సువర్ణవకాశం రాజధాని నిర్మాణం అని , లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతూ దాన్ని దుర్వినియోగం చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్ర హక్కులను కేంద్రం తిరస్కరించిందా...? లేక  మీరే ఉద్దేశ్యపూర్వకంగా కేంద్రం నుంచి  హక్కుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కావాలని వద్దని నిర్ణయం తీసుకున్నారా..? ప్రజలకు తెలియపర్చాలన్నారు. పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి కల్పించిన హక్కుల్లో ఒకట్ రాజధాని నిర్మాణం అని, దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాజధాని గురించి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో చర్చించకుండా ఇష్టానుసారం చేసుకోవడం దారుణమన్నారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులు మెచ్చేవిధంగా రాజధాని నిర్మించాలన్న ఆలోచన బాబుకు లేకపోవడం బాధాకరమన్నారు. కేవలం లక్షల కోట్లు దోచుకోవడం కోసం, మునిమనువడి వరకు కావాల్సిన నిధులు ఏర్పాటు చేసుకోవడం కోసం, టీడీపీ నాయకుల అక్రమ సంపాదనే లక్ష్యంగా  రాజధాని నిర్మిస్తున్నట్లుగా ఉందని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

స్విస్ చాలెంజ్  విధానంలో పారదర్శకత లేదు, అందరికీ సమాన హక్కులుండవు, అవకతవకలున్నాయని కేల్కర్ కమిటీ స్పష్టంగా చెప్పిన విషయాన్ని పార్థసారథి గుర్తు చేశారు. ఈవిధానం దేశానికి మంచిది కాదని కేల్కర్ కమిటీ చెప్పినా కూడా  బాబు దీన్నిఎందుకు అమలు చేస్తున్నారో రాష్ట్రానికి తెలియపర్చాలన్నారు. అమరావతి రాజధానికి వైయస్ జగన్ అడ్డుపడుతున్నారు, కేంద్రం నుంచి నిధులు అందడం లేదు, చాలామంది ఇబ్బంది పెడుతున్నారని బాబు నిస్సిగ్గుగా వయసుకు తగకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  మీరు  కుట్రలు, కుతంత్రాలతో చేస్తున్న దోపిడీకి ప్రజలు, ప్రతిపక్షాలు ఆమోదించి మీరు చెప్పినట్టు తలాడించాలా అని బాబుపై నిప్పులు చెరిగారు.  

అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని కావాలన్నదే వైయస్సార్సీపీ, వైయస్ జగన్ అభిమతమని పార్థసారథి చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి, రాజధానికి తాము అడ్డంకి కాదని, అభివృద్ధి ముసుగులో ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, లోపాయికారి ఒప్పందాలకు మాత్రమే తాము వ్యతిరేకమని పార్థసారథి స్పష్టం చేశారు.  ఏ ప్రైవేటు ప్రాపర్టీ చూసుకున్నా ఓనర్ కు ఎక్కువ పర్సెంట్ ఇచ్చి వ్యాపారులకు తక్కువ ఇస్తారని, కానీ  42 పర్సెంట్ సీఆర్డీఏకు, 58 పర్సెంట్ సింగపూర్ కంపెనీలకు ఇవ్వడం దుర్మార్గమన్నారు.   స్విస్ చాలెంజ్ వెనుక లోకేష్ ఛాలెంజ్ ఉన్నందునే దాని గురించి చంద్రబాబు ఇంతగా తహతహలాడుతున్నారని పార్థసారథి దుయ్యబట్టారు. సింగపూర్ కంపెనీకి ఇచ్చే షేర్లలో నిర్మాణ బాధ్యతలు చేపట్టి వారికి 2,3 పర్సెంట్ ఇచ్చి...58లో 56 పర్సెంట్ తీసుకొని సొంత కంపెనీల జేబు నింపుకునేందుకు బాబు తాపత్రయ పడతున్నారన్నారు. ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థలను కాదని బాబు రాజధాని మాటున ఏ స్థాయిలో అక్రమంగా సంపాదిస్తున్నాడో ప్రజలు గమనించాలన్నారు. 

కేబినెట్ మీటింగ్ నారాయణ కోచింగ్ సెంటర్ లాగా ఉందని పార్థసారథి ఎద్దేవా చేశారు. ప్రజల గురించి కాకుండా స్వలాభం కోసం ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. సీజనల్ సమస్యల ద్వారా ప్రజలు ఎదుర్కునే దాని గురించి కేబినెట్ లో  చర్చించకపోవడం బాధాకరమన్నారు. ఇసుక, నీరు-చెట్టు ఇలా వాటి ద్వారా ఎలా సంపాదించాలన్న ధ్యాసే తప్ప ...ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులు పంటలు వేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వం చెప్పిన అబద్ధాల వల్ల నీళ్లు ఇవ్వకపోవడంతో రైతాంగం ఇదివరకే పంటలు కోల్పోయి వేల కోట్లు నష్టపోయిందన్నారు. 

ఖరీఫ్ సీజన్ మొదలైనా ఇంతవరకు రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచిన పాపాన పోలేదు. నారుమళ్లు పోసుకునేందుకు నీళ్లు ఎప్పుడు ఇస్తారో కూడా ప్రకటన చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని పార్థసారథి ధ్వజమెత్తారు. చంద్రబాబు రైతులను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. నధుల అనుసంధానం అయిపోయిందని చెబుతున్న మీరు పంటలకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.  ముఖ్యమంత్రి, మంత్రులు చేతగాని వాళ్లని ప్రజలు నిర్ణయించుకున్నారని పార్థసారథి తెలిపారు. ఇప్పటికైనా రైతాంగానికి విత్తనాలు ఎలా ఇస్తారు...? ఎరువులు ఇవ్వడంలో సంసిద్ధత ఏంటి..? నీళ్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్విస్ ఛాలెంజ్ ద్వారా కాకుండా పారదర్శకంగా రాజధాని నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఎంతసేపు జగన్ జగన్ అని జపం చేయకుండా ఆయన సూచనలు కూడా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని బాబుకు సూచించారు.

24 June 2016

చంద్రబాబుకి ఎందుకు కోపం వచ్చిందంటే..!

  • పుష్కరాల పనుల్లో కోపం చూపించిన చంద్రబాబు
  • ఇలాగైతే కుదరదు అంటూ హడావుడి
  • బాబు ఆవేశం మేరకు సీఎం కార్యాలయం నుంచి ఉత్తర్వులు
  • అసలు నాటకానికి తెర దీస్తున్న ఉన్నతాధికారులు

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో పుష్కరాల పనుల్ని పరిశీలించారు. పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని, జాప్యాన్ని తాను సహించనని మండిపడ్డారు. మీడియా కెమెరాల వైపు తిరిగి కోపాన్ని మరింతగా ప్రదర్శించారు. తెల్లారేసరికి పచ్చ మీడియా పత్రికల్లో పుష్కరాల పనులపై సీఎం ఆగ్రహం, వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశాలు, అధికారులపై బాబు మండిపాటు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇక్కడే అసలు కథ మొదలు కాబోతోంది.
పుష్కరాలకు ముందే సన్నాహాలు
వాస్తవానికి పుష్కరాలు అన్నవి ఇప్పటికిప్పుడు వచ్చిపడ్డవి కావు. ఆగస్టు నెల రెండో వారంలో పుష్కరాలు అన్న సంగతి ఏడాది ముందే తెలుసు. అటువంటప్పుడు ఆరు నెలల ముందే బడ్జెట్ కేటాయింపులు పూర్తవుతుంటాయి. సాధారణంగా ఇటువంటి బ్రహత్తర కార్యక్రమాలకు ఒక ఐఎఎస్ అధికారిని స్పెషల్ ఆఫీసరు గా నియమించటం ఆనవాయితీ. ఆ అధికారి సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమన్వయం చేసుకొంటూ పనులు చేయిస్తారు. కానీ చంద్రబాబు హయంలో అటువంటి ఆనవాయితీలు పాటించరు. ఎందుకంటే పనులు సమన్వయంతో సాగటం ఆయనకు ఇష్టం ఉండదు. అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరగాలన్నది ఆయన ఫిలాసఫీ. అందుకే ప్రత్యేక అధికారిని నియమించకుండా కాలం నెట్టుకొస్తున్నారు. పైగా బడ్జెట్ కేటాయింపులు చేసినా టెండర్లు పిలవటం, పద్దతి ప్రకారం పనులు జరిపించటం చేయించలేదు.
పక్కా స్కెచ్ తోనే కోపం
పుష్కరాల పనుల్ని పరిశీలించేందుకు చంద్రబాబు మందీ మార్బలంతో తరలి వెళ్లారు. మీడియాను కూడా పెద్దఎత్తున తీసుకొని వెళ్లారు. అక్కడ పనులు నత్త నడకన నడుస్తుండటాన్ని చూసి చంద్రబాబు కోపం తెచ్చిపెట్టేసుకొన్నారు. ఇలా అయితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకొంటానని తెగేసి చెప్పారు. మీడియా ప్రతినిధులకు స్పష్టంగా తెలిసేలా మరింత గట్టిగా కోప్పడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడుతుండగానే అసలు డ్రామాకు తెర దీస్తారు. అందుకోసమే ఈ హడావుడి అన్నది అసలు లోగుట్టు.
నామినేషన్ పద్దతిన పంచుకొనేందుకే
ముఖ్యమంత్రి పనులు వేగంగా జరిపించాలని ఆదేశాలు జారీ చేయగానే పచ్చ తమ్ముళ్లు గద్దల్లా వాలిపోతారు. పుష్కరాలకు రెండు నెలల సమయం కూడా లేదు కాబట్టి వెంటనే పనుల్ని నామినేషన్ పద్దతిన కేటాయించేస్తారు. అప్పుడు బహిరంగ టెండర్లు పిలవాల్సిన అవసరమే లేదు. టీడీపీ నాయకులకు కోట్ల రూపాయిలు గుమ్మరించేస్తారు. అందిన కాడికి దోచుకొంటూ పనుల్ని తూతూ మంత్రంగా చేయించేస్తారు. నామినేషన్ విధానంలో, అందునా టీడీపీ నేతల పనులు కాబట్టి చెక్కులు చక చకా విడుదల అయిపోతాయి. నాణ్యత గురించి అడిగే దిక్కు ఉండదు. అప్పుడు దోచుకొన్న వారికి దోచుకొన్నంతగా డబ్బు మిగులుతాయి.
          ఎందుకంటే సరిగ్గా గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కనుసన్నల్లో పనులు ఇలాగే జరిగాయి. అందుకే అంతా బాబే నడిపించినట్లుగా కలరింగ్ ఇచ్చేశారు. పచ్చ మీడియా కూడా కీర్తిస్తూ కథనాలు రచించింది. ఇప్పుడు క్రిష్ణా పుష్కరాల్లో కూడా అలాగే జరగబోతోంది.

రాయలసీమ పేరు చెప్పుకొని దోపిడీ

ప్రాజెక్ట్ లలో విచ్చలవిడిగా అవినీతి
సీమపై వివక్ష...చుక్కనీరిచ్చిన దాఖలాలు లేవు
అన్యాయంగా ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు  
కేసీఆర్ కు భయపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు
టీడీపీ సర్కార్ పై మండిపడ్డ శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ః  రాయలసీమ పేరు చెప్పుకొని టీడీపీ సర్కార్ ప్రాజెక్ట్ లను దోపిడీ చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే  రాయలసీమకు నీళ్లు ఇస్తామని మభ్యపెడుతూ ఆ ప్రాంత ప్రయోజనాలను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు ప్రజల భవిష్యత్తును నిర్ధేశించే కృష్ణా ప్రాజెక్ట్ లపై ....టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని, దీన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని  శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.  

ఢిల్లీలో జరిగిన కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు మీటింగ్ కు ...సరైన ప్రణాళితో వెళ్లకుండా ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ రాష్ట్ర హక్కులను దెబ్బతీస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి అవసరానికి మించి నీళ్లు ఎక్కువగా వస్తున్నా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్ ల పేరుతో ఎక్కువ టీఎంసీలను తోడేసుకుంటున్నా...దానికి సరైన సమాధానం చెప్పకుండా ఏపీ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమైన అంశాల్లో నీటి సమస్య ఒకటని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. వైయస్సార్సీపీని గానీ, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను గానీ సంప్రదించకుండా, అపెక్స్ కౌన్సిల్ ను గట్టిగా పట్టుబట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు.  

ఏపీ ప్రజల గుండె చప్పుడు అయిన పోలవరం ప్రాజెక్ట్ ను ఎవరూ సరైన రీతిలో తీసుకురాని నేపథ్యంలో...మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముందుకు వచ్చి అనుమతులు తెప్పించి నిధులు కేటాయించడంలో ఉత్సాహం చూపించారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి క్లియరెన్స్ లో అడ్డంకులు సృష్టించినా,  ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో వైయస్సార్  రైట్, లెఫ్ట్ కెనాల్ ను పూర్తి చేస్తే....పట్టిసీమ పేరుతో రూ. 1800 కోట్ల అవినీతికి పాల్పడి అక్కడ నాలుగు పంపులు బిగించి నధులు కలిపేశామని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు. రాయలసీమ కోసమే పట్టిసీమ అని చెప్పిన ప్రభుత్వం దాన్ని కట్టాక రాయలసీమకు చుక్క నీరైనా ఇచ్చిందా అని నిలదీశారు. పట్టిసీమ ఓ వేస్ట్ అని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమా కాదా అని తమ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్ లో ప్రశ్నించారని, బీజేపీ సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసినా నిర్లక్ష్యం చేస్తూ....అంతర్భాగం కాదని టీడీపీ చెప్పిన విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు దీన్నే అదునుగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం  పట్టిసీమ కింద 40 టీఎంసీల వాటా, పోలవరం కింద 95 టీఎంసీలు వాటా కావాలని కోరుతోందన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

గతంలో ఆరు జిల్లాల అవసరం తీర్చే ఉద్దేశ్యంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి  పోతిరెడ్డి పాడు కడుతుంటే దానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టి దేవినేని ఉమ రాయలసీమ వ్యతిరేకతను చూపారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అలా వ్యతిరేకత చూపించాడనే  బాబు దేవినేని మంత్రిగా చేసి మళ్లీ ఇవాళ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం జలాశయంలో  854 అడుగులు మెయింటెన్ చేస్తేనే వెలిగొండ, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్ట్ లకు  నీళ్లు వస్తాయని తాము గొంతు చించుకున్నావినకుండా....తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఇద్దరూ నిర్ధాక్షిణంగా  పవర్ పేరుతో శ్రీశైలం ఖాళీ చేశారన్నారు. డెడ్ స్టోరేజ్ లో కూడా నీళ్లు తోడేస్తున్నారని నిప్పులు చెరిగారు.  

800 అడుగుల నుంచే కేసీఆర్  120 టీఎంసీలు డ్రా చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్ లు కడితే ఇక రాయలసీమకు ఏం మిగులుతుందని నిలదీశారు. ఏపీ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైన టీడీపీ రివర్ బోర్డ్ మీటింగ్ లో రాయలసీమ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. రాయలసీమ పేరు చెప్పుకొని దోపీడీకి పాల్పడుతున్నారు తప్పితే....నీళ్లు ఇచ్చి ఆదుకోవాలన్న చిత్తశుద్ధే ప్రభుత్వానికి లేదన్నారు. ఈరకంగా అన్యాయం జరుగుతుందని వైయస్ జగన్ దీక్ష చేపట్టి ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం కరువైందన్నారు. ఎందుకు ఈరకంగా ఓ ప్రాంతాన్ని అన్యాయం చేస్తున్నారని టీడీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

అన్ని ప్రాంతాలను సమానంగా చూడమంటే ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ టీడీపీ వాళ్లు తమపైనే ఎదురుదాడి చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి వాపోయారు. తెలుగు ప్రజలు కలిసుండాలని చెప్పిన ఏకైక పార్టీ వైయస్సార్సీపీ అని తెలియజేశారు. రాయలసీమపై ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండపై కృష్ణా బోర్డు మీటింగ్ లో ఒక్క మాటైనా మాట్లాడారా...?
ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ప్రభుత్వం  సరైన రీతిలో వ్యవహరించకపోవడం వల్లే  రాష్ట్రానికి ఈదుస్థితి వచ్చిందన్నారు. ఆనాడు బాబు అధికారంలో ఉన్నప్పుడు  ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా పట్టించుకోలేదు. ఇవాళ కేసులకు భయపడి  తెలంగాణ సర్కార్ ను నిలదీయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

తమకు కావాల్సింది చంద్రబాబు డైలాగులు కాదని.... ప్రాజెక్ట్ లు పూర్తి చేసి నిళ్లివ్వాలని డిమాండ్ చేశారు. నాలుగు మోటార్లు బిగించి నధుల అనుసంధానం అయిందని చెప్పి పట్టిసీమలో 700 కోట్లు దోచుకున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ 100 కోట్ల ప్రాజెక్ట్ పనులను 450 కోట్లకు పెంచి అడ్డగోలుగా దోచుకున్నారు. కోట్లాది ప్రాజక్ట్ లను నామినేషన్ పద్ధతిన ఇచ్చి ఇష్టమొచ్చినట్లు వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. అధికారులను కాంట్రాక్ట్ లను చేస్తున్నారు. హంద్రీనీవాలోని ఓ ప్యాకేజ్ లో  టీడీపీ నాయకుడికి నామినేషన్ పైన ఎక్స్ పీరియన్స్ లేకున్నా కట్టబెట్టారు. డబ్బులు పిండుకొన్న తర్వాత అది చేయలేము అని చెబితే పదింతలు ఎక్సస్ కు పెంచి టెండర్ల మాటున మరోమారు దోపిడీ చేశారు. 8వ ప్యాకజీలో 30 కోట్ల పెండింగ్ వర్క్ ని 170 కోట్లకు పెంచారు. ప్రభుత్వ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా కూడా... ప్రజలు సిద్ధేశ్వరం ఏవిధంగా తరలివెళ్లారో రిపోర్ట్ తెచ్టుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి హితవు పలికారు. కేసీఆర్ మహారాష్ట్రతో సంప్రదించి ఆనకట్టలు కడుతూ కో ఆర్డినేట్ చేస్తుంటే బాబుకు ఆ ఆలోచనే లేకపోవడం దురదృష్టకరమన్నారు.  ఇప్పటికైనా  కళ్లబొల్లి మాటలు చెప్పడం మానుకొని నీళ్లు తెచ్చే విధంగా చూడాలన్నారు. కరవు ప్రాంతాల్లో  తాగునీటితో పాటు కనీసం ఆరు తడి పంటకు నీళ్లిచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి పోరాడుదామని, అఖిలపక్షాన్ని పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం దుర్మార్గమన్నారు. పిలిస్తే వాళ్ల తప్పులు బయటపడతాయని భయపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఇప్పటికైనా ఆలోచన చేయాలన్నారు. ఎంతసేపు అధ్భుతాలు చేస్తాం. గ్రహాలన్నంటికీ రాజధాని నిర్మిస్తాం. మేం చక్రవర్తులం. ఇతర గ్రహాలన్నంటికీ వారధులు కట్టేస్తామన్న మాటలు మానుకోవాలన్నారు.  రియాల్టీకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేవిధంగా బోర్డుపై ఒత్తిడి పెంచి అన్యాయం జరగకుండా చూడాలని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.  

23 June 2016

వైయ‌స్సార్‌సీపీది అల‌సిపోయే సైన్యం కాదు...కవాతుకు సిద్ధంగా ఉన్న సైన్యం

  • బాబు చరిత్రే రైతు వ్యతిరేక చరిత్ర
  • హామీల అమలుపై పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు
  • ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
  • ముద్రగడ పట్ల వ్యవహరించిన తీరు దుర్మార్గం
  • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన క‌రుణాక‌ర్‌ రెడ్డి

హైదరాబాద్ః ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా నేర‌వేర్చామ‌ని చంద్ర‌బాబు ఒంగోలులో చెప్ప‌డం సిగ్గు చేట‌ని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి  ధ్వజమెత్తారు. ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకుండానే బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతుల క‌న్నీళ్లు తుడుస్తా... డ్వాక్రామ‌హిళ‌లకు రూ. 14వేల కోట్ల రుణాలు చెల్లిస్తా... బ్యాంకుల్లో తాక‌ట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాన‌ని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్కరికీ మాఫీ చేసిన పాపాన పోలేదన్నారు. ఎన్నిక‌ల‌ప్పుడు ఉన్న రూ. 87వేల కోట్ల రుణాలు కాస్తా రెండేళ్ల‌లో ల‌క్ష ప‌దికోట్ల రూపాయ‌లు అయ్యింద‌న్నారు. రుణాలు లక్షా 10 వేల కోట్లుంటే ....రూ. 11,000 కోట్లు రుణామ‌ఫీ చేశాన‌ని మిగ‌తా రూ. 13వేల కోట్లు మూడేళ్ల‌లో చెల్లిస్తాన‌ని బాబు చెప్ప‌డం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. 

రూ.24వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘ‌న‌త  టీడీపీకే చెల్లింద‌న‌డం దుర్మార్గమన్నారు. రైతుల క‌ళ్ల‌లో ఆనందం, సంతృప్తి, వెలుగు చూస్తున్నాం... గ‌తంలో ఎప్పుడూ ఈ ర‌కంగా లేదు.  ప్ర‌భుత్వం చేసిన‌ పనులను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలంటూ బాబు టీడీపీ నేతలకు చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలకు ఏమీ చేయకుండానే చేశామని చెప్పడం దారుణమన్నారు. రోజూ ప‌త్రికా స‌మావేశాలు, టెలికాన్ఫ‌రెన్స్‌ల పేరిట బాబు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాల‌ను విన‌లేక ... బుచాడు వ‌చ్చాడు పారిపోదామన్న తీరు ప్ర‌జ‌ల్లో నెల‌కొంద‌ని భూమన అన్నారు. 

మంత్రగాళ్లను మించిన మాయగాడు బాబు..
దోపిడీ చేయ‌డంలో ప్ర‌పంచంలోనే బాబు అగ్ర‌గామిగా నిలిచారని భూమన విమర్శించారు.  బాబు చేసిన మోసాలు, వాగ్దానాల భంగంపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జూలై 8వ తేదీ నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్సార్‌కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఎండగడుతుందని భూమన చెప్పారు. చంద్ర‌బాబు చేసిన‌ హామీలు నేర‌వేర్చారా లేదా అని ఇంటింటికి వెళ్లి తెలుసుకుంటామ‌న్నారు.  మోసగాళ్లు, చేత‌బడులు చేసే మంత్రగాళ్లు కూడా బాబు మాదిరి అబ‌ద్ధాలు చెప్పర‌ని భూమన ఎద్దేవా చేశారు. బాబు మాయ‌ల మ‌రాఠీల‌ను మించిన మాయ‌గాడ‌ని భూమన ఆరోపించారు. 

ఎన్నిక‌ల‌ప్పుడు ఇచ్చిన హామీల్లో ఒక్క‌టి కూడా స‌రైన రీతిలో అమ‌లు చేసిన దాఖాలాలు లేవ‌న్న‌ది రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్ర‌జ‌లకు తెలిసిన నిజ‌మ‌న్నారు. సీఎంగా బాబు మొద‌టి సారి చేసిన ఐదు సంతాకాలో  ఒక్క‌టి కూడా అమ‌లు కాలేద‌న్నారు. రెండేళ్ల పాల‌న త‌ర్వాత కోన‌సీమ రైతులు మ‌ళ్లీ క్రాప్ హాలీడేను ప్ర‌క‌టించార‌న్నారు. బాబు రైతాంగ వ్య‌తిరేక విధానాల వ‌ల్ల వ్య‌వ‌సాయం చేయ‌డం వీలుకావ‌డం లేద‌ని కోన‌సీమ‌లోని అల్లావ‌రం మండ‌ల ప‌రిధిలోని అన్ని గ్రామాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయ‌న్నారు. రైతుల‌కు శ‌త్రువుగా మారిన వ్య‌క్తి బాబు అని భూమన దుయ్యబట్టారు.  రైతాంగానికి ఉచిత విద్యుత్‌ను అంద‌జేస్తామ‌న్న బాబు ఇప్పుడు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. 

బాబు చ‌రిత్రే రైతు వ్య‌తిరేక చ‌రిత్ర‌ అని, బాబు గ‌త‌మంతా ఇదేనని భూమన ఆరోపించారు. ప్ర‌జ‌లు ఏం చెప్పినా నమ్ముతారన్న ధీమాతోనే బాబు ఇలా అబ‌ద్దాలు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు.  బాబు పాల‌న‌పై ఎవ‌రైనా వ్య‌తిరేకంగా మాట్లాడితే అక్ర‌మ కేసులు పెడుతూ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌న్నారు.  హామీలపై ఒత్తిడి తెస్తే వారిపై ప్ర‌జాద్రోహులుగా ముద్ర వేయ‌డం బాబుకు ప‌రిపాటిగా మారింద‌ని ఆగ్రహించారు. రాజ‌కీయ రాక్ష‌సులుగా బాబు మారార‌ని ధ్వజమెత్తారు. బీసీల్లో చేరుస్తామని చెప్పడంతో న‌మ్మి ఓట్లు వేసిన కాపుల‌ను బాబు ఎంత దారుణంగా వంచించారో, ఎంత అమానుషంగా ప్రవర్తించారో స‌భ్య స‌మాజం చూసింద‌న్నారు. 

బాబు  తీరు మాన‌వ జాతికే మ‌చ్చ‌
బాబు త‌న అధికార బ‌లంతో ప్ర‌చార మ‌ధ్యమాల‌ను ఇనుప డెక్కాల కింద అణిచివేసిన తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని భూమన గుర్తు చేశారు. ముద్ర‌గ‌డ కుటుంబంపై బాబు స‌ర్కారు తీరు మానవ జాతికే మ‌చ్చ అన్నారు. మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా ముద్ర‌గ‌డ భార్య‌, కోడ‌లి ప‌ట్ల వ్య‌వ‌హరించిన తీరు అమానుషమా కాదా అని భూమన బాబును ప్ర‌శ్నించారు. ఇంత‌ దారుణంగా, దుర్మార్గంగా వ్య‌వ‌హరించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. రైతులు  గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని కోరితే బాబు ఎంత వెట‌క‌రంగా మాట్లాడారో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. 

తిరుగుబాబుకు నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి
ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్క‌డ‌మే కాకుండా స‌ర్వ‌నాశనం చేయ‌డానికి బాబు  ప్ర‌య‌త్నిస్తున్నార‌ని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొద్దికాలం బాబు అందర్నీ చెప్పుచేత‌ల్లో ఉంచుకున్న‌ా... ఈ నిరంకుశ ధోర‌ణికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు త్వ‌ర‌లోనే తిరుగుబాటు చేస్తార‌న్నారు. తిరుగుబాటుకు నాయ‌కుడుగా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఉంటార‌న్నారు. ఎప్ప‌టికైనా గెలుపు వైయ‌స్సార్‌సీపీదేన‌న్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క‌రు కూడా సంతృప్తితో లేదరని భూమన చెప్పారు. పార్టీ మారి చాలా పెద్ద త‌ప్పు చేశామ‌న్న ధోరణిలో ఎమ్మెల్యేలు ఉన్నార‌న్నారు. బాబు వైఖ‌రి ప‌ట్ల అంద‌రూ తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌న్న‌ది నిజ‌మ‌న్నారు. 

అల‌సిపోయే సైన్యం కాదు... క‌వాతుకు సిద్ధంగా ఉండే సైన్యం 
అల‌సిపోయే సైన్యం వైయ‌స్సార్‌సీపీలో లేరని భూమన చెప్పారు. నిరంత‌రం క‌వాతుకు సిద్దంగా ఉండే సైనికుల్లాగా వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పిలుపు మేరకు జూలై 8వ తేదీనుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామ‌న్నారు. బాధ్య‌త‌ాయుతమైన ప‌ద‌విలో ఉన్న శాస‌న‌ స‌భ‌ాప‌తి ఎన్నిక‌ల్లో రూ. 11.5 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌ానని చెప్పడం ద్వారానే... బాబు పార్టీ ఎన్ని వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి అధికారంలోకి వ‌చ్చిందో ప్ర‌జ‌లు గ‌మ‌నించార‌న్నారు.  స్పీకర్ కోడెలపై ఎన్నిక‌ల క‌మిష‌న్‌, కోర్టులు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భూమన కోరారు.