29 June 2016

కోడెల‌పై అన‌ర్హ‌త వేటు వేయాలి


హైదరాబాద్: అడ్డగోలుగా డ‌బ్బులు వెద‌జ‌ల్లి గెలిచిన స‌త్తెన‌ప‌ల్లి   టీడీపీ ఎమ్మెల్యే మరియు స్పీకర్ కోడెల శివ‌ప్ర‌సాద్ గెలుపు నైతిక గెలుపు కాద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు అన్నారు. 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రూ. 30వేలు ఖ‌ర్చ అయ్యాయ‌ని,  అదే 2014లో పోటీచేస్తే రూ. 11.5 కోట్లు ఖ‌ర్చు అయ్యాయ‌ని చెప్పిన కోడెలపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అంబ‌టి అన్నారు. ఎన్నిక‌ల నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి ఖ‌ర్చు చేసిన   కోడెల‌పై ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ భ‌న్వ‌ర్‌లాల్‌కు వైయ‌స్సార్సీపీ నాయకులు అంబ‌టి, వాసిరెడ్డి పద్మ,  ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా త‌దితరులు ఫిర్యాదు చేశారు. 


వేటు వేయాల్సిందే
ఎన్నిక‌ల నియామ‌వ‌ళికి విరుద్ధంగా ఖ‌ర్చు చేసిన కోడెల‌పై అన‌ర్హ‌త చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఓ టీవీ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో త‌న ఎన్నిక‌ల ఖ‌ర్చు రూ. 11.5 కోట్లు అయ్యాయ‌ని కోడెల స్వ‌యంగా చెప్పార‌న్నారు. రూ. 28ల‌క్ష‌ల‌కు మించి ఖ‌ర్చు చేయ‌రాద‌ని ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉన్నప్పటికీ అందుకు వ్య‌తిరేకంగా కోడెల కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశార‌ని అంబ‌టి మండిప‌డ్డారు. రూ. 11.5 కోట్లు ఖ‌ర్చు చేసి త‌న‌పై కేవ‌లం 924 ఓట్ల తేడాతోనే గెలిచాడ‌ని ఎద్దేవా చేశారు. అక్ర‌మంగా సంపాధించిన డ‌బ్బును నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు ల‌క్ష‌ల మందికి పంచార‌ని విమ‌ర్శించారు. అక్ర‌మ ప‌ద్ధ‌తిలో గెలుపొందిన వ్య‌క్తి కాబ‌ట్టే ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్న ఎమ్మెల్యేల‌పై వేటు వేయ‌టం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ తీసుకునే నిర్ణ‌యం ఆధారంగా న్యాయ‌నిపుణుల‌ను సంప్ర‌దిస్తామ‌న్నారు.  


డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టేముందు రూల్స్ గుర్తుకు రాలేవా..?
అసెంబ్లీలో రూల్స్‌, రెగ్యూలేష‌న్స్ అని ప‌దేప‌దే మాట్లాడే స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌కు ఎన్నికల నియామ‌వ‌ళికి విరూద్దంగా డ‌బ్బులు ఖర్చు చేసేట‌ప్పుడు రూల్స్ గుర్తుకు రాలేదా అని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజా అన్నారు. కోడెల డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టిన విధానం చూస్తేనే ఎంత‌మేర నైతిక విలువ‌లు ఉన్నాయో   తెలుస్తుంద‌న్నారు. ఎన్నిక‌ల్లో అక్ర‌మ మార్గంలో గెలుపొందారు కాబ‌ట్టే ఆయ‌న కుమారుడు, కూతురు, డ్రైవ‌ర్, బినామీల పేర్ల‌తో రాజ‌ధాని చుట్టూ భూములు కొనుగోలు చేస్తున్నార‌ని ఆరోపించారు. కోడెల కూతురు చేస్తున్న అవినీతిని పార్టీ ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ రెడ్డి ఆధారాల‌తో స‌హా నిరూపించిన విష‌యం గుర్తు చేశారు. 
స్పీక‌ర్ స్థానంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌లు జ‌రిపించాల్సిన కోడెల టీడీపీ ఎమ్మెల్యేలను వైయ‌స్సార్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపైకి ఉసిగొల్పుతున్న తీరు చూస్తే ప్ర‌జ‌ల‌పై, శాస‌న‌స‌భ‌పై ఎంత గౌర‌వం ఉందో తెలుస్తుంద‌న్నారు. చంద్ర‌బాబు కోట్లు పెట్టి ఎమ్మెల్యేల‌ను కొంటుంటే స్పీక‌ర్ డ‌బ్బులు పెట్టి ఓట్లు కొంటున్నాన‌ని ప్ర‌జ‌ల‌ను అవ‌మానిస్తున్నార‌ని మండిపడ్డారు. భ‌విష్య‌త్‌లో ఇలాంటివి పున‌రావృతం కాకుండా కోడెల శివ‌ప్ర‌సాద్‌ను సస్పెండ్ చేయాల‌ని ఆమె కోరారు.
బాబు బాటలో కోడెల
ఓటుకు నోటు కేసులో  త‌న‌దైన అడ్డ‌దారిలో త‌ప్పించుకున్న చంద్ర‌బాబు దారిలోనే కోడెల న‌డుస్తున్నార‌ని వైయ‌స్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు. ఎన్నిక‌ల నిబంధ‌న‌లో కోడెల తాను ఇచ్చిన అఫిడ‌విట్ త‌ప్పు అని ఒప్పుకున్న త‌ర్వాత కూడా చర్య‌లు తీసుకోక‌పోతే ప్ర‌జాస్వామ్యం బ‌త‌క‌ద‌న్నారు. 

No comments:

Post a Comment