13 June 2016

చానెళ్ల నిలిపివేత అక్ర‌మచ‌ర్య‌

హైదరాబాద్: అక్రమంగా సాక్షి చానెల్ ప్రసారాలు నిలిపేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా నిబంద‌న‌లు, ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని తుంగ‌లోకి తొక్కింద‌ని వైయ‌స్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మొద‌ట  21 రోజులపాటు నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి చెప్పాడనో, లోకేశ్ చెప్పాడనో లేక హోంమంత్రి చెప్పాడనో అలా చేయకూడదని చెప్పారు. అధికారాలు శాశ్వతం కాదని అంబటి గుర్తు చేశారు. ప్రభుత్వాలు చెప్పినట్లు చానెళ్లు ప్రచారం చేయడం సాధ్యం కాదనే విషయం అని అన్నారు. నాయకులు మారినప్పుడల్లా చానెల్ ప్రసారం చేసే తీరు మార్చుకోవాలా? పరిపాలకులకు అనుకూలంగా చానెల్ ప్రసారం చేయాలా అని నిలదీశారు. నాలుగురోజుల పాటు సాక్షి చానెల్ ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. వెంటనే వెంటనే సాక్షి చానెల్ ప్రసారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇక ముద్రగడ విషయంలో స్పందిస్తూ ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన తమను అరెస్టు చేసి పోలీసులు కోరుకొండ స్టేషన్ కు తరలించారని చెప్పారు. రాజమండ్రిలో వందలమంది పోలీసులు ఉన్నారని, పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. అక్కడ చూస్తుంటే రాజమండ్రిలో ఉన్నామా.. లేక పాకిస్థాన్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని అంబటి చెప్పారు. ముద్రగడ విషయంలో ఉగ్రవాది కసబ్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు దౌర్జన్య పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంద్ చేసే వాళ్లను కొడుతూ పోలీసులు బంద్ విఫలానికి ప్రయత్నించారని, సాధారణ పోలీసు అఫీసర్ నుంచి ఐపీఎస్ వరకు ఇలాగే వ్యవహరించారని, అసలు పోలీసుల విధులు ఇవేనా అని ప్రశ్నించారు. ముద్రగడను ఎవరు చూడాలనకుంటే వారు చూసేందుకు అనుమతించాలని, ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించాలని డిమాండ్ చేశారు. ఏం జరుగుతుందో తెలియక ఆంధ్ర కాపు సోదరులంతా ఆందోళన చెందుతున్నారని, వెంటనే ముద్రగడతో చర్చలు జరిపి దీక్షను విరమింపజేయించి, వారి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని అంబటి డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment