- ఈడీ అటాచ్ మెంట్ ను సాకుగా చూపి టీడీపీ విషప్రచారం
- ఓటుకు నోటు, రాజధాని భూదందా,ఎమ్మెల్యేల కొనుగోళ్లపై
- బాబు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలి
- ప్రజాన్యాయస్థానంలో బాబు దోషిగా నిలబడ్డారు
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్ః వైయస్ జగన్కు సంబంధించిన ఆస్తులపై కొన్ని పత్రికలు విషప్రచారం చేస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈడీ అనేది న్యాయ నిర్ధారణ సంస్థ కాదని, కేవలం ఒక పోలీస్ వ్యవస్థ లాంటిదేనన్నారు. సీబీఐ చేసిన చార్జీషిట్లపై ఆధారపడి ఆస్తులపై అటాచ్మెంట్ను ప్రకటించాయన్నారు. సీబీఐ కేసులకు సంబంధించి న్యాయస్థానంలో ఇంకా విచారణ జరుగుతుందన్నారు. టీడీపీ రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని విడుదల చేసేనాటికి వైయస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ నాయకుడు కాదన్న విషయం ప్రజలకు తెలుసునన్నారు. కేవలం ఒక వ్యాపార వేత్తగా తన తెలివితో పైకి వచ్చిన వ్యక్తి వైయస్ జగన్ అని చెప్పారు.
కావాలనే వైయస్ జగన్పై విషప్రచారం...
వైయస్ జగన్ ఆస్తుల అటాచ్మెంట్ను సాకుగా చేసుకొని టీడీపీకి చెందిన కొందరు విష ప్రచారం చేస్తున్నారని పద్మ మండిపడ్డారు. కేవలం వైయస్ జగన్మోహన్రెడ్డిని నొక్కేయాలి... తొక్కేయాలి అన్న ధోరణితోనే టీడీపీ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిందన్నారు. బాబు అధికారంలో లేనప్పుడు వైయస్ జగన్కు వస్తున్నప్రజాధారణను చూసి ఓర్వలేకపోయారని... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైయస్ జగన్పై మరోసారి విషప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేవలం వైయస్ జగన్ను టార్గెట్ చేసే ఇదంతా జరుగుతుందన్నారు. కానీ టీడీపీ నాయకులు తెలుసుకోవాల్సిన నిజం ఇంకోటి ఉందన్నారు. ఈడీ కేవలం వైయస్ జగన్మోహన్రెడ్డి ఆస్తులను మాత్రమే అటాచ్మెంట్ చేసిందన్నారు. స్వాధీనం చేసుకోలేదన్న విషయం తెలుసుకోవాలన్నారు.
ప్రజాభిమానం చూసి ఓర్వలేకనే...
వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఓదార్పు యాత్ర చేయడం వల్ల వచ్చిన ప్రజాభిమానం చూసి హస్తం పార్టీ భయపడిందన్నారు . ఓదార్పు యాత్రను ఆపివేయాలని కాంగ్రెస్ చెప్పడంతో వైయస్ జగన్ అందుకు నిరాకరించి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అనంతరం వైయస్ జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్, టీడీపీ లు కుట్రపన్ని పిటిషన్ వేసిన విషయం గుర్తు చేశారు. ఇప్పటికీ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. 16 నెలలు జైలులో పెట్టినా వైయస్ జగన్మోహన్రెడ్డి తాను ఏ తప్పు చేయలేదన్న ఆత్మస్థైర్యంతో ఉన్నారని, ఇప్పటికీ తామందరం అదే ఆత్మస్థైర్యంతో ఉన్నామన్నారు. న్యాయస్థానాల తుది తీర్పులో వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్దోషన్న తీర్పు వస్తుందన్నారు.
ప్రజల మనస్సుల్లోంచి దూరం చేయలేరు...
వైయస్ జగన్ను ప్రజల మనస్సుల్లోంచి దూరం చేయాలన్న ఆలోచనలోనే టీడీపీ నాయకులు విఫలం చెందారన్నారు. ఇంతకు ముందు సైతం ఈడీ వైయస్ జగన్ ఆస్తులను అటాచ్మెంట్ చేసిందని, చివరికి ఆ ఆస్తులను అప్పగించారన్నారు. ఎవరూ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా వైయస్ జగన్కు భూములు కేటాయించలేదని ఐఏఎస్ అధికారులతో పాటు టీడీపీ సర్కారే సర్టిఫికెట్లు ఇస్తుందన్నారు. భూముల కేటాయింపు అక్రమం కాదన్నారు. విచారణ పూర్తికాకముందే వైయస్ జగన్ జైలుకెళ్తాడు... ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తారనడం కేవలం టీడీపీ నాయకుల భ్రమ అన్నారు.
బాబుకు ముందుంది ముసళ్ల పండగ..
చంద్రబాబు అవినీతిపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రులందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందజేసిన విషయాన్ని పద్మ ఈసందర్భంగా ప్రస్తావించారు. బాబుపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే భయంతో పారిపోతున్నారన్నారు. రాజధాని భూ అక్రమ దందాపై దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఓటుకు నోటు కేసు, రాజధాని అక్రమ భూదందా, అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేల కొనుగోళ్లపై బాబుకు ముందుంది ముసళ్ల పండగ అని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. ప్రజాన్యాయస్థానం అనేది కూడా న్యాయస్థానాల్లో ముఖ్యమైందన్నారు. అలాంటి ప్రజాన్యాయస్థానంలో వైయస్ జగన్ సఫలం అయితే... బాబు దోషిగా నిలబడ్డారన్నారు. తాను దొంగతనం చేసి మరో వ్యక్తిని దొంగదొంగ అన్నట్లు ....బాబు అవినీతికి పాల్పడుతూ ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిత్యం అవినీతి అక్రమాలతోనే బాబుకు తెల్లవారుతుందన్నారు. త్వరలోనే సీబీఐ విచారణకు బాబు సిద్ధంగా ఉండాలని సూచించారు. అంతిమ విజయం వైయస్ జగన్దే అన్న ధీమా అందరిలోనూ ఉందన్నారు.
రెండేళ్లలో గర్వంగా చెప్పుకునే ఒక్క పథకం లేదు...
రెండేళ్ల కాలంలో గర్వంగా చెప్పకునే ఒక్క పథకాన్ని కూడా బాబు ప్రవేశ పెట్టలేదన్నారు. ఏ తప్పు లేనప్పుడు బాబు సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధంగా లేరని ప్రశ్నించారు. బాబు రెండేళ్ల పాలనపై కోర్టులో అనేక పిటిషన్లు ఉన్నాయని, ఆ పిటిషన్లు ఏ రాజకీయ నాయకులో చేసినవి కాదని రైతులు, సామాన్య ప్రజలు వేసినవేనన్నారు. రాజధాని భూములపై జరుగుతున్న అక్రమ భూదందాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బాబుపై విచారణ జరిపించాలని కోర్టులో పిటిషన్ వేసిన విషయం గుర్తు చేశారు. బాబు అవినీతిపై పార్టీ తరఫున ఎప్పటికప్పుడు నిలదీస్తున్నామన్నారు. సీబీఐ విచారణ జరిగితే అభివృద్ధి ఆగిపోతుంది అనడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో మిత్ర పక్షంగా ఉండి కూడా సీబీఐ విచారణకు బాబు భయపడడం చూస్తేనే... ఎంతమేర అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు అర్థమవుతుందన్నారు.
No comments:
Post a Comment