వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్
కర్నూలు: ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను చులకన చేయడమే ధ్యేయంగా టీడీపీ పని చేస్తోందని పీఏసీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ కేఈ ప్రతాప్ సోదరులు అధికారులను బెదిరించడం, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం, దౌర్జన్యానికి పాల్పడటమే ధ్యేయంగా పని చేస్తున్నారని మండిపడ్డారు.
మద్యం వ్యాపారంలో సంబంధాలు ఉన్న వ్యక్తులు సంఘ సంస్కర్తలు ఎలా అవుతారని రాజేంద్రనాథ్రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు. సంఘ సంస్కర్త కోటాలో జన్మభూమి కమిటీలో సభ్యుడిగా చేరిన కేఈ ప్రతాప్కు నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు సంబంధం ఉందన్నారు. ప్రభుత్వ ధర కంటే 10 శాతం అధికంగా విక్రయిస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న భవనాలను డిప్యూటీ సీఎం హోదాలో కేఈ కృష్ణమూర్తి ప్రారంభించడం ఎంత వరకు సమంజసమన్నారు. గత ప్రభుత్వాల పథకాలకు కేఈ సోదరులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఆయా పథకాలకు నిధులు ఎవరు మంజూరు చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.
తనకు మతిభ్రమించిందంటూ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రపంచంలో అందరి చిట్టాలు విప్పే అతని చరిత్ర గురించి ఎవరికీ తెలియదనుకోవడం అవవివేకమని బుగ్గన అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించిన విషయం గుర్తు చేశారు. ఆయన వసూళ్ల గురించి కర్నూలులో ఏ పెట్రోల్ బంక్, కిరాణ షాపు యజమానిని అడిగినా చెబుతారన్నారు. అలాంటి వ్యక్తులకు తనను విమర్శించే స్థాయి ఎక్కడిదని ప్రశ్నించారు.
No comments:
Post a Comment