10 June 2016

బాబుది పోలీసు టెర్రరిజం

  • పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకొని టెర్రరిజం అనిపించుకొనే చర్యలకు దిగుతున్నారు
  • అన్యాయాల్ని ఎలుగెత్తి చాటితే టీవీ చానెల్ ప్రసారాల్ని నిలిపివేయిస్తున్నారు
  • ప్రజా స్వామ్యంలో ఇది చీకటి రోజు
  • కేసుని సీబీ ఐ కు అప్పగిస్తేనే నిష్పాక్షికంగా దర్యాప్తు
  • పోలీసు మార్కు దౌర్జన్యాన్ని ఖండించినన ప్రతిపక్ష నేత వైయస్ జగన్

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసు టెర్రరిజం అని పేరెన్నదగ్గ రీతిలో దారుణాలకు తెగబడుతున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లో ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యుల మీద చంద్రబాబు చేయించిన పోలీసు దాడిని ఆయన ఖండించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసుని సీబీ ఐ కి అప్పగించాలని, అప్పుడే దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.  వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.
బాబు మార్కు రాజకీయం ఇది
          ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమి చెప్పారో మనకు అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ముద్రగడ అడుగుతున్నారు. అందుకోసం ఆయన దీక్ష చేస్తున్నారు. అది ఒక సామాజిక అంశం. దాన్ని కాస్తా రాజకీయం చేసి శాంతిభద్రతల సమస్యగా మార్చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు. ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం మనం చూశాం. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేశారు. ఒకే కులానికి చెందిన వారి మధ్య చిచ్చు పెట్టి ఉసి కొల్పుతున్నారు. నిన్న చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవహరించారో మనం చూశాం.
          ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఇంటిలో కూర్చొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి చిన్న గ్రామం. అక్కడ జరగుతున్న అంశాన్ని ఎలా చిత్రీకరించారో మనం చూశాం. విపరీతంగా పోలీసుల్ని మోహరించారు. ముద్రగడ కుటుంబ సభ్యులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు లోపలకు దూసుకెళ్లి కొట్టుకొంటూ తీసుకెళ్లారు. అవన్నీ సోషల్ మీడియాలో అందరికీ కనిపిస్తున్నాయి.
ఇది ఒక పోలీసు టెర్రరిజం
          ప్రభుత్వం చేస్తున అన్యాయాల్ని ప్రసారం చేస్తుంటే సాక్షి టీవీ ఛానెల్ ప్రసారాల్ని కత్తిరించారు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సంఘటన ను కవర్ చేయకూడదు అని తమ అనుకూల చానెల్స్ అన్నింటికీ ఆదేశాలు జారీ చేశారు. కాదని చెప్పి ప్రసారం చేసినందుకు సాక్షితో పాటు 2,3 ఛానెల్స్ మీద ప్రతాపం చూపించి ప్రసారాల్ని నిలిపివేయించారు. ఇది ఎమర్జెన్సీ పాలన ను తలపిస్తున్న పాలన.
          తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు పరిపాలన చేస్తుంటాయి. ఈ రెండు పార్టీలకు చానెల్స్ ఉన్నాయి. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరో పార్టీకి చెందిన చానెల్స్ ప్రసారాల్ని కత్తిరించింది లేదు. మన రాష్ట్రంలో కూడా దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు కొన్ని ఛానెల్స్ వ్యతిరేకంగా వార్తలు రాసేవి. కార్యక్రమాలు చేసేవి. అప్పుడు కూడా అటువంటి ఛానెల్స్ ప్రసారాల్ని నిలిపివేసిన దాఖలాలు లేనే లేవు. అటువంటి వార్తలు ప్రచురించిన పత్రికల్ని ఆపివేయటమూ జరగలేదు. చంద్రబాబు నాయుడు కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పుతున్నారు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే పోలీసు టెర్రరిజం అని చంద్రబాబు నామకరణం చేసినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా.
జవాబుదారీ తనం రావాలి
          చంద్రబాబు ఎటువంటి వాగ్దానాలు చేశారు, ఎటువంటి హామీలు ఇచ్చారు. తర్వాత కాలంలో ఏ రకంగా మాట తప్పారు, ఏ విధంగా మోసాలు చేశారో చూశాం. ఆయన అన్న మాటల్ని అమలు చేయమని ఉద్యమం జరుగుతోంది. అటువంటి ఉద్యమం మీద దొంగ కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ అంతకన్నా లేదు. ఇటువంటి పరిస్థితుల్ని చూస్తుంటే ప్రజలు తిరగబడాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.       
          చంద్రబాబు ప్రజలకు మొదట ఒకటి చెబుతారు. ఎన్నికల సమయంలో పని పూర్తయ్యేందుకు రక రకాల మాటలు చెబుతారు. ఓట్లు వేయించుకొన్నాక ఆ విషయాలు గాలికి వదిలేస్తారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు, తర్వాత ఏం జరిగింది అన్నది అంతా గమనించారు. ప్రజల తరపున ఎవరైనా అడిగితే మాత్రం బండలు వేస్తారు. చంద్రబాబు ప్రవర్తన ఇలాగే ఉంటే, ఇలాగే అబద్దాలు చెబుతూ ఉంటే జవాబుదారీ తనం ఎక్కడ ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, లేదా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వ్యక్తి ఇలాగే అబద్దాలు, మోసాలు చెబుతూ ఉంటే దాని మీద జవాబుదారీ తనం లేదా. దీని మీద జవాబుదారీ తనం రావాల్సిన అవసరం ఉంది.
చీపుర్లు చూపిస్తేనే మార్పు
ఇటువంటి పరిస్థితుల మారాల్సిన అవసరం ఉంది. ప్రజలు తిరగబడుతున్నారన్న భయం చంద్రబాబులో రావాలి. బాబు కి అటువంటి భయం రావాలి అంటే ఇటువంటి నాయకులు తిరగుతున్నప్పుడు చీపుర్లు చూపించాల్సిన అవసరం ఉంది. ఇంతటి దారుణమైన పనులు చేస్తున్నారు. చంద్రబాబు చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని రెచ్చిపోయి దారుణాలు చేయటాన్ని ఖండిస్తున్నాం. ఈ రోజు ముద్రగడకు , వాస్తవాలు చూపిస్తున్న సాక్షి టీవీ కి ఎటువంటి పరిస్థితి తలెత్తిందో రేపు మరొక వ్యవస్థలకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇటువంటి ఆగడాల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కదలాల్సిన అవసరం ఉంది. అందరం ఒక్కటై నిరసన తెలపాలి.
          చంద్రబాబుది రాజకీయ దిగజారుడు తనం. అది ఒక సామాజిక అంశం అన్నది అందరికీ తెలుసు. అక్కడ జరుగుతున్న ప్రజల అంశానికి అందరూ మద్దతు ఇస్తుంటారు. అయితే ఇచ్చిన హామీ అమలు కాలేదన్న ఉద్దేశ్యంతో ఎవరైనా రియాక్ట్ అయితే, అది వారికి సంబంధించిన అంశం అవుతుంది. అంతే కానీ, మద్దతు ఇచ్చినా వారు అందరికీ దాన్ని ఆపాదించటం సరికాదు.
దర్యాప్తు సీబీ ఐ కి అప్పగించాలి
          ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్త శుద్ధి ఉంటే కేసు దర్యాప్తుని సీబీ ఐ కి అప్పగించాలి. ఢిల్లీ నుంచి సీబీ ఐ అధికారులు వస్తే సక్రమంగా దర్యాప్తు చేస్తారు. ఇందులో చంద్రబాబు ప్రమేయం ఉందని తెలిసినా చర్యలు తీసుకోగలుగుతారు. లేదంటే చంద్రబాబు చేతిలో ఉండే సీఐడీ పోలీసుల్ని, ఇక్కడ పోలీసుల్ని దర్యాప్తుకి ఉపయోగిస్తే నచ్చని వ్యక్తుల్ని కేసుల్లో ఇరికించ జైళ్లలోకి నెట్టేస్తారు. ఇది ఎంత వరకు ధర్మం. కేసుని సీబీ ఐ కి అప్పగిస్తే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
చంద్రబాబు వ్యవహార శైలి అంతే
          చంద్రబాబు వ్యవహార శైలి ఎలా ఉంటుంది అన్నది గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా, ఎంపీ గా ఉన్న ముద్రగడ పద్మనాభం స్పష్టంగా వెల్లడించారు. రెండు, మూడు సందర్బాల్లో బస్సులు బద్దలు కొట్టండి, రైళ్లను ధ్వంసం చేయండి, ప్రజా ఆస్తులు పగల గొట్టండి అని స్వయంగా చంద్రబాబే ఫోన్లు చేయించి పనులు పురమాయించేవారట. ఆ సంగతి టీడీపీ లో పనిచేసిన నాయకులే వెల్లడిస్తున్నారు. పరిటాల రవి చనిపోయినప్పుడు, ఎన్టీయార్ దిగిపోయినప్పుడు చేయించిన  పనులు ఇవే. అదీ చంద్రబాబు నైజం అని రాష్ట్ర ప్రజలంతా గమనించాలి.
న్యాయం జరగాలి
          ఇటువంటి చంద్రబాబు చేస్తున్న పనులు అన్యాయం, చేస్తున్న చర్యలు తప్పు అని అడిగితే గొంతు నొక్కుతున్నారు. అటువంటి కథనాలు ప్రసారం చేస్తున్నందుకు సాక్షి చానెల్ ప్రసారాలు నిన్నటి నుంచి నిలిపివేశారు. ఇటువంటివి పునరావ్రతం కాకుండా కట్టడి చేయించాలి. రాజకీయ అధికారంతో నచ్చని టీవీ చానెళ్ల ప్రసారాలు నిలిపివేయటం అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు అనుకోవాలి.  
          ఈ కేసుని వెంటనే సీబీ ఐ కి అప్పగించాలి. అరెస్టు చేసిన ముద్రగడ పద్మనాభం ను విడుదల చేయాలి. కట్ చేసిన ఛానెల్స్ ప్రసారాల్ని పునరుద్ధరించాలి.
అని వైయస్ జగన్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment