చిలకలూరిపేట ఎన్ఎస్పి ఉద్యోగులకు బెదిరింపులు
ఇళ్లు ఖాళీ చేయాలంటూ పచ్చనేతల హల్చల్
ఇళ్లకు నీరు, కార్యాలయానికి కరెంట్ కట్
రోడ్డున పడేయడంపై ఉద్యోగుల ఆందోళన
పనులు నిలిపేయాలని హెచ్చరిక
గుంటూరు : ఇప్పటికే రాజధాని పేరుతో రైతుల భూములు లొక్కోవడం మొదులు ఇళ్లను తొలగించేందుకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ...ఇప్పుడు పార్టీ కార్యాలయాల కోసమూ పలు ప్రాంతాల్లో ఇళ్లు తొలగించేందుకు వెనుకాడడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పచ్చనేతలు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం తమ ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని.... చిలకలూరిపేటలోని ఎన్ఎస్పి ఓఅండ్ఎమ్ క్యాంప్ కాలనీ వాసులు లింగంగుంట్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యం.ఆర్ మోహిద్దీన్కు మొరపెట్టుకున్నారు. ఏపీ ఇరిగేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులతో కలసి భాధితులు ఈఈని కలిసారు.
ఎన్ఎస్పి ఓఅండ్ఎమ్ సెక్షన్లో పనిచేస్తూ... క్యాంప్ కాలనీలో అనేక ఏళ్ళగా నివసిస్తున్నామని బాధితులు తెలిపారు. కాగా ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉందంటూ క్యాంప్ ఆవరణలో నిర్మాణాలు చేపడుతున్నారని వివరించారు. ఇప్పటికే డ్రెయిన్లతో పాటు పైలాన్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. తాము నివసిస్తున్న ఇళ్ళను కూల్చివేస్తామని, ఖాళీ చేయాలని బెదిరిస్తున్నరన్నారు. ఇళ్ళకు తాగునీరు సరఫరాతో పాటు కార్యాలయానికి కరెంటు కట్చేశారని వాపోయారు. దీంతో, కాలనీలో నివసించే 10 కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడపుతున్నట్టు యూనియన్ నాయకులు వివరించారు.
ఎన్ఎస్పికి చెందిన స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు....అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతంలో ప్రతి నెలా ఇంటి అద్దెను మినహాయిస్తున్నామన్నారు. ఎన్ఎస్పి స్థలంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా నిర్మాణాలు చేపడతారని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం కోసం మమ్మల్ని రోడ్లు పాలు చేస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న సమయంలో ఇళ్లు ఖాళీ చేయమంటే ఎక్కడకు వెళ్లాలని విలపించారు.
దీనిపై స్పందించిన ఈఈ చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. అధికారులతో చర్చించి సమస్యను మీరే పరిష్కరించుకోవాలంటూ ఆయన యూనియన్ నాయకులకు సలహా ఇచ్చాడు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. తమ శాఖల నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఇండ్లను ఎలా ఖాళీ చేయిస్తారని వారు ప్రశ్నించారు. మున్సిపాలిటి చేపట్టిన పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీలోపు తమ సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఎన్జీవొ నాయకులతో కలసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియాన్ నాయకులు ఎన్.నాగరాజు, సి.కొండారెడ్డి, యం.మరియదాసు, ఎ.శివ, కోటిరెడ్డి, బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment