16 May 2016

బాబు కేసీఆర్ ను ఎందుకు నిలదీయడం లేదు..?

  • ఎవడబ్బ సొమ్ము అని నీళ్లు తీసుకుపోతున్నారు
  • తాగడానికి నీళ్లు రాకపోతే కేసీఆర్ కు ఉసురు తగలదా..?
  • చంద్రబాబు చేసిన అన్యాయాన్ని మహానేత సరిదిద్దారుః వైయస్ జగన్

కర్నూలుః ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టానికి విరుద్ధంగా తెలంగాణ స‌ర్కార్ ప్రాజెక్టులు క‌డుతుంటే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  ప్ర‌శ్నించారు. ఏ ప్రాజెక్టులు క‌ట్టాల‌న్నా ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ 84 ప్ర‌కారం నిబంధ‌న‌లు ఉన్నాయ‌న్నారు. ముందుగా సీడ‌బ్ల్యూసీ అనుమ‌తి, నీటి యాజ‌మాన్య బోర్డుల అనుమ‌తి తీసుకోవాల‌ని, త‌ర్వాత ఎపెక్స్ కౌన్సిల్ అనుమ‌తి తీసుకోవాల‌ని స్ప‌ష్టంగా ఉంద‌న్నారు. ఈ అనుమ‌తులు లేకుండానే కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నార‌ని త‌ప్పుబ‌ట్టారు.  దీనిపై బాబు కేసీఆర్ ను ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని కడిగిపారేశారు. గోదావ‌రి న‌దిపై కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల, దేవాదుల ఎత్తిపోత‌ల‌, తుపాకుల గూడెం, సీతారాంపూర్‌, భ‌క్త‌రామ‌దాసు ఎత్తిపోత‌ల‌తో నీళ్లు ఎత్తుకుపోతున్నా చంద్ర‌బాబు నోరు మెద‌ప‌డం లేద‌ని మండిప‌డ్డారు. 2015లో మ‌న‌కు చుక్క‌నీరు కూడా అంద‌లేద‌ని, 2014లో ఇదే చంద్ర‌బాబుతో క‌లిసి ఆ ఒక్క సంవ‌త్స‌రానికి సంబంధించి నీళ్ల పంప‌కంపై ఒక స‌మావేశం పెట్టుకున్నార‌ని తెలిపారు. ఆ స‌మావేశంలో 299 టీఎంసీల నీళ్లు తెలంగాణ రాష్ట్రం వాడుకోవ‌డానికి అప్ప‌ట్లో చంద్ర‌బాబు ఆమోదం తెల‌ప‌డం త‌ప్పు అన్నారు. కానీ అది కేవ‌లం ఒక్క ఏడాదికేన‌న్న‌విష‌యం మ‌ర్చిపోకూడ‌ద‌ని కేసీఆర్‌ను హెచ్చ‌రించారు. 

 
నాడు హైద‌రాబాద్ తీసుకెళ్లారు..
తెలుగు ప్ర‌జ‌లంద‌రం స‌మైక్యంగా ఉండాల‌ని పోరాటం చేస్తే.. రాష్ట్రాన్ని అడ్డంగా విభ‌జించార‌ని, కేసీఆర్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ నాడు హైద‌రాబాద్ న‌గ‌రాన్నితీసుకెళ్లిపోయార‌ని వైయ‌స్ జ‌గ‌న్ విమ‌ర్శించారు. దీంతో చ‌దువుకున్న యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు కోల్పొవాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ మ‌న‌కు రావాల్సిన నీటిని పై నుంచి పైకి తీసుకెళ్తున్నా అడిగే నాథుడే క‌రువ‌య్యాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రం విడిపోయాక తెలుగువారు అని కూడా చూడ‌కుండా ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కింది రాష్ట్రంలో తాగ‌డానికి నీళ్లు రాక‌పోతే అక్క‌డి ప్ర‌జ‌ల ఉసురు త‌గ‌ల‌దా అని కేసీఆర్‌ను నిల‌దీశారు. మీరు చేస్తున్న‌ది త‌ప్పు.. దానిని స‌రిచేసుకోవాల‌ని కేసీఆర్‌కు సూచించారు. 



మహానేత ఆ తప్పును సరిదిద్దారు
శ్రీ‌శైలం ప్రాజెక్టు నీటి మ‌ట్టం విష‌యంలో చంద్ర‌బాబు చేసిన అన్యాయాన్ని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవో నంబ‌ర్ 107 విడుద‌ల చేసి స‌రిదిద్దార‌ని వైయ‌స్ జ‌గ‌న్ గుర్తు చేశారు. శ్రీ‌శైలం ప్రాజెక్టులో ఎప్పుడూ క‌నీసం 854 అడుగుల నీళ్లుండాల‌ని 1960లోనే ప్రాజెక్ట్  డిజైన్ చేశార‌ని తెలిపారు. దానికి అనుకూలంగా నాటి ముఖ్య‌మంత్రి అంజ‌య్య పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్‌కు శంకుస్థాప‌న చేసి, పూర్తి చేయించార‌న్నారు. మ‌న కర్మ‌కొద్దీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొద‌టి సారిగా ఈ డ్రా డౌన్ లెవెల్‌ను ఒక జీవో ద్వారా త‌గ్గించార‌ని విమ‌ర్శించారు. మ‌ళ్లీ చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో కేసీఆర్ పాల‌మూరు-రంగారెడ్డి, ప్రాజెక్టు నిర్మాణానికి టెండ‌ర్లు పిలిచి, 800 అడుగుల‌కే ఇన్‌టేక్ పాయింట్ పెడుతుండ‌టం దారుణ‌మ‌న్నారు. ఎగువ ప్రాంత‌లోనే నీళ్లు తోడుకుంటే  శ్రీ‌శైలానికి నీళ్లు ఎలా వ‌స్తాయ‌ని, త‌ర్వాత సాగ‌ర్ ప‌రిస్థ‌తి ఏంట‌ని, కృష్ణా డెల్టా ఎడారి అయిపోదా అని ప్రశ్నించారు. ఇంత జ‌రుగుతున్నా చంద్ర‌బాబు నోరు మెద‌ప‌క‌పోవ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. 



ప్రతీ బొట్టు కోసం పోరాడుదాం
ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్ర‌తినీటి బొట్టు కోసం అంద‌రం ఏక‌మై పోరాడుదామ‌ని వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పిలుపునిచ్చారు. 2011 బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూన‌ల్ తీర్పు మీద 26 మంది ఎమ్మెల్యేల‌తో నాడు ధ‌ర్నా చేశామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. మ‌హారాష్ట్ర నుంచి ఆంధ్ర‌రాష్ట్రం చివ‌రి వ‌ర‌కు ప్ర‌తి బొట్టు కూడా.... మా వాటా మాకు, వాళ్ల వాటా వాళ్ల‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు తెలిపారు. 15 రోజుల‌కు ఒక్క‌సారి వాటాల స‌ర్ధుబాటు జ‌ర‌గాల‌న్నారు. ఇలా చేయ‌కుండా మా ద‌గ్గ‌ర నుంచి నీళ్లొస్తాయి కాబ‌ట్టి ఇష్టం వ‌చ్చిన‌ట్లు అడ్డుప‌డితే ఇండియా-పాకిస్థాన్ మ‌ధ్య గొడ‌వ‌లా అయిపోదా అని ప్ర‌శ్నించారు. కృష్ణా, గోదావ‌రి ప్రాజెక్టుల నుంచి ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని నీళ్లు తీసుకెళ్తున్నార‌ని వైయ‌స్ జ‌గ‌న్ కేసీఆర్‌పై మండిప‌డ్డారు. ఇక్క‌డ జ‌రుగుతున్న అన్యాయం మ‌న రాష్ట్రంలోని వాళ్ల‌కే కాదు, దేశంలోని నాయ‌కులంద‌రికీ తెలియాల‌న్నారు. కేసీఆర్‌, చంద్ర‌బాబుకు జ్ఞానోద‌యం కావాల‌ని నాలుగు అడుగులు ముందుకు వేద్దామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment