27 May 2016

రాజ్యసభ కు ఆర్థిక నేరగాళ్లను పంపిన ఘనత చంద్రబాబుదే

  • బ్యాంకుల్ని ముంచేసిన వారిని కేంద్రమంత్రులుగా చేసుకొన్నారు
  • టీడీపీ విమర్శల్ని తిప్పికొట్టిన వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అత్యున్నత విద్యావంతుడు అని, ఆయన్ను మించిన విద్యార్హతలుగానీ, మానవీయ విలువలు గానీ ఉన్న వ్యక్తి టీడీపీ ఎంపీల్లో ఏ ఒక్కరూ కూడా లేరని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభిప్రాయ పడ్డారు.  విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసులన్నీ రాజకీయ కేసులేనని టీడీపీ ఒప్పుకుందని ఒక పత్రికా ప్రకటనలో అంబటి పేర్కొన్నారు.విజయసాయి రెడ్డి వంటి మేధావులు, విజ్ఞులు ఒక్కరున్నా రాజ్యసభ గౌరవ సభగా ఉంటుందని కొనియాడారు.
విజయసాయి రెడ్డిని ముద్దాయి అంటున్న టీడీపీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా డబ్బు పంపి.. ఫోన్‌లో సంభాషణలు జరిపి ఆడియో, వీడియో రికార్డింగ్‌లలో అడ్డంగా దొరికిపోయి నేటికి తప్పుంచుకు తిరుగుతున్న దొంగ కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌ సీఎం మీద సీబీఐ విచారణ జరుగుతోందని, చంద్రబాబు మీద సీఐడీ విచారణ కూడా జరగడం లేదంటూ ఇంతకు మించిన ఆర్థిక, రాజకీయ నేరగాడు లేడని ఆయన అభివర్ణించారు.
రాజ్యసభకు ఆర్థిక నేరగాళ్లను, మనీ లాండరింగ్‌ నిపుణుల్ని పంపడమే కాకుండా కేంద్ర మంత్రులుగా వారిని నియమించే సంస్కృతి టీడీపీ సొంతమని అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్‌ చేసుకుంటున్న వ్యక్తి అని అభిప్రాయ పడ్డారు.  టీడీపీ రాజ్యసభ సీట్లను అమ్ముకుంటున్న విషయం ఆ పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసునని చెప్పారు. ఇప్పుడు టీడీపీ ఎంపిక కూడా నిస్సిగ్గుగా డబ్బు ప్రాతిపదికగానే ఉంటుందన్నది అందిరికీ తెలిసిన విషయమేనని చెప్పారు.

కేంద్ర మంత్రి సుజనా చౌదరి మీద ఉన్న కేసుల గురించి, మారిషస్‌ బ్యాంకుల మోసాల గురించి తెలిసికూడా ఆయన్ను కేంద్రమంత్రి చేయడం టీడీపీకి మాత్రమే సాధ్యమైందని దుయ్యబట్టారు. టీడీపీ పంపే రాజ్యసభ సభ్యుల్ని చూస్తే బ్యాంకుల్ని ముంచేసినవారు, పదవి వచ్చే వరకు ఏనాడూ పార్టీలో కనిపించనివారని విమర్శించారు.

మనీ లాండరింగ్‌ నిపుణులు, పదవుల్ని కొనుగోలు చేసినవారు చాలామంది కనిపిస్తున్నారని చెప్పారు. టీడీపీకి రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత ఏనాడూ లేదని అన్నారు. ప్రజల్లో అభిమానం సంపాదించడం చేతగాక, విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తాను బలంగా ఉన్నానని టీడీపీ నానా గడ్డీ కరుస్తోందని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినవారు.. టీడీపీలో చేరుతున్నవారు, చేరినవారు ప్రజల తీర్పును కాలరాచి కుట్రదారులతో వెన్నుపోటు దారులతో చేతులు కలిపారంటూ మండిపడ్డారు. అలాంటి టీడీపీ ఈ రోజున రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించటమేనని అంబటి రాంబాబు విమర్శించారు.

No comments:

Post a Comment