25 July 2015

ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబుది ప్రచారం ఆర్భాటమే..!


 అనంతపురం: ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది ప్రచార ఆర్భాటం మాత్రమేనని, ఏమాత్రం చిత్త శుద్ధి లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండి పడ్డారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా ఐదో రోజు పి. కొత్త పల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హంద్రీ నీవా ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రచార ఆర్భాటాన్ని ప్రద ర్శిస్తున్నారని మండిపడ్డారు. దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పనుల్లో దాదాపు 85 శాతం దాకా పూర్తి అయ్యాయని వివరించారు. ఇంకా మిగిలిన పనులకు చంద్రబాబు అర కొరా నిధుల్ని ఇస్తున్నారని పేర్కొన్నారు. తీరా చేసి, హంద్రీ నీవా ను పూర్తి చేసిన ఘనత తనదే అంటూ ప్రచారం చేసుకొంటున్నారని జగన్ అన్నారు.
  రుణ మాఫీ పేరుతో చంద్రబాబు రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని మోసం చేశారని మండి పడ్డారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగుల్ని వంచించారని వివరించారు. ఏడాది గడిచిపోయినా, అసలు ఈ హామీల ఊసే ఎత్తటం లేదని జగన్ అన్నారు. ఒక్క కొత్త ఇల్లు ఇవ్వలేదని, పేదలకు పింఛన్లు, రేషన్ కార్డులు అందటం లేదని ఆయన అన్నారు. కరవు తట్టుకోలేక రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. ఒక వైపు ఇంతటి సంక్షోభం నెలకొంటే, చంద్రబాబు మాత్రం అబద్దాలతో కాలక్షేపం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలే లేవని, తమ పాలనలో సుఖ శాంతులతో ఉన్నారని చెప్పటం సిగ్గు చేటని అభివర్ణించారు.
  అనంతపురం జిల్లా లో కరవు తాండవిస్తోందని, రైతాంగం కష్టాలు పడుతోందని జగన్ వెల్లడించారు. ఇంతటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే రైతులు బెంగళూరుకి వలస వెళుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ వస్తుందంటే మాత్రం వచ్చి పరిహారం చెల్లిస్తారని, లేదంటే మాత్రం పట్టించుకోరని వివరించారు. రాహుల్ గాంధీ ఎప్పుడు ఈ దేశంలో ఉంటారో.. ఎప్పుడు విదేశాల్లో ఉంటారో తెలియదని జగన్ వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment