భూ సమీకరణకు ఒప్పుకోని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఘీంకరించారు. సమీకరణకు సహకరించని రైతులపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా బెదిరిస్తూ వచ్చారు. అయితే రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. రాజధాని రైతులను చైతన్యపరచడంలోనూ, వారికి అండగా ఉంటూ ఉద్యమాలు చేయడంలోనూ వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ముందు ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ కుయుక్తులను గమనిస్తూ రైతులను అప్రమత్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తుండడం వల్లనే చంద్రబాబు ప్రభుత్వం సవరించిన భూసేకరణ చట్టాన్ని రాజధాని రైతులపై ప్రయోగించలేకపోయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. భూ సమీకరణ ద్వారా 25 వేల ఎకరాలను సమీకరించిన ప్రభుత్వం ప్రతిపాదిత 33వేల ఎకరాలలో మిగిలిన 8 వేల ఎకరాలను భూసేకరణ చట్టాన్ని ఉపయోగించి సేకరించాలని తలపోసింది. స్థానికుల ఆమోదం, సామాజిక ప్రభావం మదింపు, బహుళ పంటలు పండే భూములు వంటి అంశాలలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆర్ఎస్ఎస్, స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి సంస్థలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తున్నాయి. దాంతో కేంద్రప్రభుత్వం భూసేకరణ సవరణలపై ఆలోచనలోపడింది. సామాజిక ప్రభావం మదింపు అంశం నుంచి మినహాయింపు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 166 జారీ చేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూసి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అంటున్నారు. ఏమైతేనేం ప్రస్తుతానికి భూసేకరణ చట్టం ప్రయోగించే పరిస్థితి ఎంతమాత్రమూ లేదని తెలుస్తోంది. అందువల్ల రాజధాని రైతులకు ఇది ఊరట కలిగించే అంశమే.
No comments:
Post a Comment