- చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే ఆర్కే రోజా
- బాబు పాలనలో అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి
- అర్ధరాత్రి వరకు బార్లు తెరిచి పెట్టడం హిందూ సాంప్రదాయమా?
- దేవాలయాల్లో పూజలు చేయొద్దని కొత్త జీవో
- పురిటిలో ఉన్న ఆడపిల్లను కూడా మోసం చేస్తావా బాబూ
- నాలుగేళ్లుగా మహిళా సంక్షేమానికి నువ్వు చేసిందేంటీ?
- గజానికి ఒక గాంధారీ పుత్రుడు గాంధీ గారి దేశంలో అన్నట్లుగా పాలన
- వైయస్ఆర్లా ఒక్క శాతం కూడా లేని చంద్రబాబు పాలన
హైదరాబాద్: 2017 నారావారి నరకాసుర నామ సంవత్సరంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అభివర్ణించారు. చంద్రబాబు పాలన అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలుగా కొనసాగుతుందని మండిపడ్డారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు అనేక అబద్ధాలు చెప్పారని విరుచుకుపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు ధైర్యంతో తన మ్యానిఫెస్టోలో మహిళల కోసం పెట్టిన పేజీని తెరిచి చూడగలరా.. అని ప్రశ్నించారు. ఆంధ్రరాష్ట్రంలో ఆడవారిపై జరుగుతున్న ఆగడాలపై ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు క్యాలెండర్లు, నాలుగు బడ్జెట్లు మారినా ఆడవారి తలరాతలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే బెల్ట్షాపులను రద్దుకు రెండో సంతకం పెడతానని మోసం చేశాడని మండిపడ్డారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన సాక్షాత్తు వెంకటేశ్వరస్వామితో పాటు ఏ గుడిలో అలంకరణ చేయొద్దు.. ఇది మన సంస్కృతి కాదని జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి అర్ధరాత్రి వరకు బార్లకు, వైన్స్లకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. మందుబాబులు ఆడవారిపై దాడులు చేసినా పర్వాలేదా.. ఇదేనా హిందూ సాంప్రదాయం అని నిలదీశారు. మద్యం షాపులు తెరవొచ్చు కానీ దేవాలయాలు తెరవకూడదని చంద్రబాబు దిగజారిపోయి మాట్లాడుతున్నారన్నారు.
చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని రోజా మండిపడ్డారు. ఒక్కొక్కటిగా వివరిస్తూ చంద్రబాబు పాలనను ఎండగట్టారు.
– టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో డ్వాక్రా సంఘాలకు పునర్జీవింపజేస్తానని చంద్రబాబు చెప్పాడు. డ్వాక్రా సంఘాలకు రూ.14,204 కోట్లు ఇస్తే రుణమాఫీ పూర్తిగా అయిపోతుంది. చంద్రబాబు దోచుకున్నదాంట్లో అక్కచెల్లెమ్మల అప్పులు 1 శాతం ఉంటుంది. మహిళలపై గౌరవం ఉంటే మాఫీ చేసేవాడు కానీ హామీ ఇచ్చి కూడా మోసం చేశాడంటే ఏ మేరకు మహిళల సంక్షేమానికి పాటుపడుతున్నారో అర్థం చేసుకోండి. చంద్రబాబు గ్రామాలకు వెళితే.. నిలదీయడానికి ప్రతి మహిళా సిద్ధంగా ఉంది.
– పుట్టిన ప్రతి బిడ్డకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.30 వేలు వేస్తామన్నారు. నాలుగేళ్లుగా ఒక్క ఆడపిల్ల కూడా రాష్ట్రంలో పుట్టలేదా.. ఒక్క బిడ్డకైనా డబ్బులు వేశారా.. పురిటిలోని మహిళలను కూడా చంద్రబాబు మోసం చేసేది నిజం కాదా..? పండంటి బిడ్డ పథకం ద్వారా పౌష్టికాహారం కోసం రూ.10 వేలు ఇస్తానని గాలికొదిలేశారు. గర్భవతులను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు.
– పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు అన్నాడు. ఒక్క ఫోన్ కొడితే 5 నిమిషాల్లో వచ్చి అన్యాయం చేసిన వారి తాటతీస్తామన్నాడు. ప్రమాదంలో ఉన్న మహిళల రక్షణ కొరకు జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి సెల్ఫోన్ ద్వారా పనిచేసే అలారం వ్యవస్థను పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేస్తామన్నాడు. కానీ అన్యాయం అవుతున్న మహిళలు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. తప్పుడు కేసులు పెడతామని భయపెట్టి పంపుతున్నారు.
టీడీపీ నేతల చేతుల్లో అన్యాయానికి గురైన మహిళలు
– పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నర్సాపురం రోడ్డుపై శ్రీగౌతమి అనే యువతి వారి చెల్లెలతో స్కూటీపై వెళ్తుంటే.. టీడీపీ నేత సజ్జ బుజ్జి భార్య శిరీష కారుతో గుద్ధి చంపితే బాధితురాలికి ఎవరు న్యాయం చేశారు.
– రిషితేశ్వరి అనే అమ్మాయిని ప్రిన్సిపల్ దగ్గరుండి ర్యాగింగ్ను ప్రోత్సహించి ఆత్మహత్య చేసుకునే విధంగా
పరిస్థితులు క్రియేట్ చేశాడు. ఆ ప్రిన్సిపల్పై దూళిపాల నరేంద్ర, దేవినేని ఉమలు కేసులు పెట్టకుండా చేశారు. వైయస్ఆర్ సీపీ పోరాడేంత వరకు ఆ తల్లిదండ్రులను ఉడకాడించారు. ఇప్పటి వరకు ఆ కేసులో పురోగతి లేదు.
– అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో సుదమ్మ అనే మహిళ పశువులకు నీటి తొట్టి కొంచెం పక్కకు కట్టండి అని చెపితే పయ్యావుల కేశవులు అనుచరులు చెప్పుల కాళ్లతో ఎగిరెగిరి తన్నారు. స్టేషన్కు వెళ్లి కేసు పెడితే నామమాత్రపు కేసుగా రాసుకొని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంటే పోలీసులు ఎవరికి న్యాయం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి.
– చిత్తూరులో టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూతురుకు అవమానం జరిగింది.. టీడీపీ కార్యకర్తల వల్ల రోడ్డుపై కూర్చొని ధర్నా చేసే దౌర్భాగ్య పరిస్థితి. టీడీపీలో ఏ విధంగా గుండాలు, రౌడీలు రాజ్యమేలుతున్నారు.
ఇవన్నీ చూస్తుంటే గజానికి ఒక గాంధారీ పుత్రుడు గాంధీ గారి దేశంలో అన్న బాలగంగాధర్ మాటలు గుర్తుకు వస్తున్నాయి. నాలుగు సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలోకి వెళ్లినా దుర్వోధనుడు, దుశ్యాసనుడు లాంటి కీచకులు మహిళలపై దాడులు చేస్తున్నారు.
– విశాఖ జిల్లా పెందుర్తి మండలం జె్రరిపోతులపాలెంలో బండారు సత్యనారాయణ ముఖ్య అనుచరులు ఏ విధంగా ఒక మహిళను వివస్త్రను చేసి ఈడ్చికొట్టారో ప్రపంచమంతా చూసింది. రాష్ట్రంలో దుశ్యాసన పాలన ఏ విధంగా ఉందో విదేశాల్లో ఉన్న మహిళలు పవన్ కల్యాణ్కు ట్వీట్ చేశారు. అయినా చంద్రబాబు ఇప్పటి వరకు ఆ విషయంపై స్పందించలేదు. కానీ వైయస్ జగన్ చలించి వెంటనే వైయస్ఆర్ సీపీ మహిళా కమిటీల ద్వారా ధర్నాలు చేయించి ఆమెకు న్యాయం చేయించారు. ఆ మహిళలను ఆర్థికంగా ఆదుకున్నారు.
– టీడీపీ మహిళా ప్రజాప్రతినిధి జానీమూన్ తన కుటుంబాన్ని పచ్చనేతలు చంపేస్తారని ప్రెస్మీట్ పెట్టి కన్నీరు పెట్టుకుంటే ప్రతిపక్షం అండగా ఉండి ఆమెకు న్యాయం చేసింది. చంద్రబాబు దిగొచ్చి మంత్రులను ఆమె ఇంటికి పంపించారు.
– ఎప్పుడైతే వనజాక్షిని ఇసుకలో వేసికొట్టినప్పుడు చింతమనేనిపై చర్యలు తీసుకొనివుంటే ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అయివుండేవి కాదు.
– చంద్రబాబు కేబినెట్లో ముగ్గురు మహిళా మంత్రులు ఉండేవారు. విస్తరణ పేరుతో బీసీ మహిళను, ఎస్సీ మహిళను తొలగించారు. మూడును ఐదు చేస్తే తప్పా..? మహిళలు మంత్రిత్వశాఖను మోయలేరా.. చంద్రబాబూ?
– దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అతిపెద్ద మంత్రిత్వశాఖ హోంశాఖను సబితాఇంద్రారెడ్డికి ఇచ్చి ఆశీర్వదించారు. తన కేబినెట్లో 5 ముఖ్యమైన శాఖలను మహిళలకు ఇచ్చి సువర్ణ పరిపాలనను అందించారు.
– ఫీజురియంబర్స్మెంట్ ద్వారా మహిళలను డాక్టర్లు, ఇంజనీరింగ్ చదువులు చదివించారు. పావలా వడ్డీలు ఇచ్చి డ్వాక్రా మహిళలను ప్రోత్సహించారు. అభయహస్తం పేరుతో మహిళలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేశారు. వైయస్ఆర్ పాలనలో ఒక్క శాతం కూడా చంద్రబాబు చేయలేదు.
– అమరావతిలో గొప్పగా మహిళా పార్లమెంటరీ సభ పెట్టి దాంట్లో చంద్రబాబు, ఆయన బంధువులను పిలుచుకొని పొగిడించుకున్నారు. సభలో ఎక్కడైనా మహిళల గురించి పోరాడిన వారిని పిలిచారా..? ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పిలిపించి అవమానించారు. విజయవాడలో కిడ్నాప్ చేసి తిప్పితిప్పి పక్కరాష్ట్రం హైదరాబాద్లో వదిలిపెట్టారు.
– మహిళలను టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోడే ప్రసాద్లు కాల్మనీ సెక్స్రాకెట్ ద్వారా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ఒక మహిళగా చట్టసభలో పోరాడితే సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. బుద్ధి వెంకన్న, బోడే ప్రసాద్లపై చర్యలు తీసుకోకుండా వారిని చట్టసభల్లో పక్కనే కూర్చొబెట్టుకుంటున్నారు. ఇదేనా చంద్రబాబుకు మహిళలపై ఉన్న గౌరవం..
No comments:
Post a Comment