విజయవాడ: కృష్ణ జిల్లాలో 8 ఎకరాలు ఉన్న రైతు మరో 8 ఎకరాలు కొనుగోలు చేయాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారని... మరి చలమలశెట్టి నిరంజన్ మాత్రం 8 ఎకరాలతో 83 ఎకరాలు ఎలా సంపాదించారో అర్థం కావడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతంరెడ్డి అన్నారు. విజయవాడలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొలంలో వేసిన పంటకు వెయ్యి రూపాయల నోట్లు ఏమైనా కాశాయా అని ప్రశ్నించారు. వందల వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. దీనిని మసిపూసి మారెడుకాయ చేయడానికి ఆంజనేయులు అనే వ్యక్తిని తెచ్చారని ఆరోపించారు.
చట్టాలకు తూట్లు
విదేశీ డబ్బులు ఇండియాకు రావాలంటే ఫేమా యాక్ట్ అనే చట్టం ఉందని, విదేశాల నుంచి వచ్చిన డబ్బుతో ఇండియాలో ఏది కొనుగోలు చేయాలన్న దానికి ఆర్బీఐ అనుమతి ఉండాలని తెలిపారు. ఇప్పటి వరకు నిరంజన్బాబు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఒక్కరూపాయి కూడా ఇన్కమ్ట్యాక్స్ చెల్లించ లేదని తెలిపారు. అటువంటప్పుడు వందల కోట్లతో ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. సదావర్తి భూములకు సంబంధించి గజాల రూపేణా ఉండే భూముల్ని ఎకరాల రూపేణా అమ్మారని, ఈ విషయం మీద సరైన సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రచారం జరగలేదని, నేరుగా తమిళనాడులో ప్రచారం చేసి, ఉదయం ఒక రేటు ప్రకటించడం, సాయంత్రానికి మరో రేటుతో కొనుగోలు చేయడం దారుణమన్నారు.
టీడీపీ రాజ్యం.. అవినీతి రాజ్యం
టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారానికి సంబంధించిన బినామీలు పెదబాబు, చిన్నబాబేనన్న విషయం ప్రజలకు అర్థమయిందన్నారు. ఎన్నికలకు ముందు తాము అన్నహజరే, మేథాపాట్కర్ దారిలో నడుస్తామన్న చంద్రబాబు... ఇప్పుడు సదావర్తి భూములపై అన్నహజరే, మేథాపాట్కర్ను పిలిచి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సదావర్తి భూముల విషయంలో అవినీతి జరిగిందని టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ సైతం ఆరోపిస్తోందన్నారు. అలాంటప్పుడు ఈ అవినీతిలో చినబాబు, పెదబాబుల హస్తం లేకుండా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా టీడీపీ కళ్లు తెరచి సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేసి, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దున్నేవాడిదే భూమి
ఒకప్పుడు దున్నెవాడిదే భూమి.... జై కిషన్... జై జవాన్ అన్న మాటలు మాట్లాడేవారని ఇప్పుడు జై పెదబాబు.. జై చినబాబు.. భూములు మొత్తం మావే అన్న మాటలు టీడీపీ మాట్లాడుతోందన్నారు. ఐదు లక్షల ఉద్యోగాలను ఇస్తామన్న పల్లె రఘునాథరెడ్డి ఐదు వేల ఉద్యోగాలను కూడా ఇవ్వలేదని విమర్శించారు. బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే బాబు గానీ, బాబుగారి శిష్యులు కానీ బహిరంగ విచారణకు రావాలని సవాల్ విసిరారు.
No comments:
Post a Comment