9 July 2016

రక రకాల పేర్లతో భూములు లాక్కొంటున్న బాబు

  • చంద్రబాబుకి కలిసివచ్చిన లక్ష ఎకరాల విధానం
  • పది లక్షల ఎకరాలు లక్ష్యమని ముందే ప్రకటించిన చంద్రబాబు
  • ఇప్పుడు బందరు పోర్టు వంతు

విజయవాడ: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చాక కొద్ది రోజులకే తన లక్ష్యం ఏమిటో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల ఎకరాల పంట పొలాల్ని లాక్కొని బినామీ పారిశ్రామిక వేత్తలకు అప్పగిస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో దాన్ని సాకారం చేసుకొంటూ వస్తున్నారు. తాజాగా బందరు పోర్టు ప్రాంతంలో రైతుల్ని రోడ్డున పడేసేందుకు కుట్రలు చేస్తున్నారు.
 రాజధాని పేరుతో భూ దందా
కేవలం కొన్ని భవనాలు, మౌళిక వసతులు అవసరం అయిన రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు ఊరంత రాద్ధాంతంగా మార్చేశారు. వెయ్యి, రెండు వేలు కాదు ఏకంగా లక్ష ఎకరాల భూమిని నాశనం చేసేందుకు కుట్రను అమలు చేశారు. రైతులకు మాయ మాటలు చెప్పి దాదాపు 35వేల ఎకరాల భూమిని లాగేసుకొన్నారు. తర్వాత 32వేల ఎకరాల విస్తీర్ణంలోని అటవీ భూమిని స్వాధీనం చేసుకొనేందుకు పావులు కదుపుతున్నారు. అటు దేవాదాయ, వక్ఫ్, గ్రామకంఠం, అసైన్డ్ భూములన్నీ కలుపుకొంటే మొత్తం లక్ష ఎకరాల  విస్తీర్ణంలో పచ్చదనం మాయం కాబోతోంది. దాదాపు కోటి చెట్లను చంద్రబాబు నరికేస్తారని అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ప్రకటించింది.
ఇప్పుడు బందరు పోర్టు వంతు
బందరు పోర్టు మౌళిక వసతుల కోసం లక్ష ఎకరాల భూమిని లాక్కొంటామని రాష్ట్ర మంత్రిమండలి ప్రకటించింది. 29 గ్రామాల్లో 415 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూముల్ని తీసుకోబోతున్నారు. ఇంతకు ముందు అవలంబించిన మాయదారి విధానాన్ని అమల్లోకి తీసుకొని రాబోతున్నారు. అంటే నయానో, భయానో భూముల్ని లాక్కొనేందుకు పావులు కదుపుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బందరు పోర్టుకి కేవలం రెండున్నర వేల ఎకరాలు సరిపోతాయని ఇదే చంద్రబాబు అనేకసార్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ బినామీల కోసం లక్ష ఎకరాల్ని లాగేసుకొనేందుకు పావులు కదుపుతున్నారు.
చంద్రబాబు భూదాహం
చంద్రబాబు పదవిలోకి వచ్చినప్పటి నుంచీ భూదాహం తీరటం లేదు. మిలియన్ ఎకరాలు అంటే పది లక్షల ఎకరాల భూమిని లాగేసుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన హామీ మేరకు ఆయన అడుగులు వేస్తున్నారు. రాజధాని ప్రాంతం, బందరు పోర్టు ప్రాంతం కూడా మూడు పంటలు పండే సారవంతమైన నేల కావటం విశేషం. ప్రజలకు ఆహారాన్ని అందించే అన్న దాతను రోడ్డున పాడేసి, ఆహారాన్ని అందించే భూముల్ని నాశనం చేస్తున్న చంద్రబాబు పాలన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. 

No comments:

Post a Comment