26 October 2015

అమరావతి గురించి బీబీసీ వార్తా కథనంలో ఏమున్నది


బీబీసీ ప్రత్యేక కథనంలో చేదు వాస్తవాలు
హైదరాబాద్: అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న  విధ్వంసాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ కుండ బద్దలు కొట్టింది. కోటి చెట్లు నరికివేసేందుకు జరుగుతున్న కుట్రను బయట పెట్టింది.

అమరావతి రాజధానికి 400 కోట్లతో శంకుస్థాపన చేయించిన చంద్రబాబు..అందులో 30 కోట్లు దాకా ఖర్చు పెట్టించి ప్రాంతీయ, జాతీయ ఛానెళ్లతో బాగా ఊదించుకొన్నారు. బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టేస్తున్నట్లు హడావుడి చేయించుకొన్నారు.

అంతర్జాతీయ వార్తాసంస్థ బీబీసీ మాత్రం చేదు వాస్తవాల్ని బయట పెట్టింది. కొత్త రాజధాని కోసం చంద్రబాబు చెబుతున్న కబుర్లను మొదట్లో ప్రస్తావించింది. తర్వాత అసలు వాస్తవాల్ని బయట పెట్టింది. అమరావతి పేరుతో పర్యావరణాన్ని తీవ్రంగా విధ్వంసం చేస్తున్నట్లు వెల్లడించింది. సింగపూర్ కు 10 రెట్ల మేర విస్తీర్ణంలో నగరాన్ని కట్టేందుకు తహతహ లాడుతున్నారని రిపోర్ట్ చేసింది.

కోటి చెట్లను నరికేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీబీసీ కథనంలో ఆందోళన వ్యక్తం అయంది. మూడు పంటలు పండే వేలాది ఎకరాల్లో పంట భూముల్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా తప్పు పట్టిందని స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గటం లేదని పేర్కొంది. 49 వేల ఎకరాలకు పైగా అటవీ భూముల్ని డీ నోటిఫై చేసేందుకు అంటే అడవుల్ని నాశన చేసేందుకు  చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని బయట పెట్టింది. ఇంతటి విధ్వంసానికి చంద్రబాబు సర్కారు కుటిల యత్నాలు చేస్తోందని వివరించింది. 

No comments:

Post a Comment