- కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య
- ప్రజా సంకల్ప యాత్ర నుంచి ప్రజలను దారి మళ్లించేందుకే జన్మభూమి
కర్నూలు : జన్మభూమి - మా ఊరు కార్యక్రమం అంటేనే టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య వ్యాఖ్యానించారు. జన్మభూమి ఓ ప్లాప్ షో అని, వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో దారి మళ్లించేందుకు ఈ కార్యక్రమాని చేపట్టారన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో బీవై రామయ్య మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనకు జన్మభూమిలో వస్తున్న లక్షలాది దరఖాస్తులే నిదర్శనమన్నారు. నాలుగువిడతల్లో వచ్చిన ప్రజాసమస్యలలో పరిష్కార జరిగింది 10శాతం మాత్రమేనన్నారు. నాలుగు దశల్లో కూడా ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోవడం ఈ టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నియోజకవర్గాల్లో పర్యటించడానికి అధికారపార్టీ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైతం గ్రామాల్లో వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. గత నాలుగు విడతల్లో జిల్లాలో మూడు లక్షల ప్రజా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఐదు సంతకాలకు దిక్కే లేదు..
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన సమయంలో చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకే దిక్కులేదని బీవై రామయ్య ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు నూతన సంవత్సరం రోజున తొలి సంతకం అంటూ గృహానిర్మాణానికి సంబంధించిన ఫైల్ పై సంతకం అంటూ చంద్ర బాబు కొత్త డ్రామా ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కట్టని బాబు రానున్న సంవత్సరంలో ఏంచేస్తాడో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడం, లేకపోతే బెదిరించడం టీడీపీ నైజంగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు తీరాలంటే వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో సమస్యలు వెల్లువెత్తుతున్నాయని, ప్రతి ఒక్కరూ వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు బీవై రామయ్య చెప్పారు.
No comments:
Post a Comment