26 September 2016

విదేశీయులను నెత్తిన పెట్టుకొని స్వదేశీయులను కించపరుస్తావా

  • బాబు నీ దోపిడీ పరిపాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు
  • ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే విధానాలు మానుకో
  • హోదా ఉన్న రాష్ట్రాల్లో బిజినెస్ లు చేస్తూ..ఇక్కడ ప్యాకేజీనా..?
  • ప్రభుత్వ తీరుపై వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల ఫైర్

హైదరాబాద్ః విదేశీయులను నెత్తిన పెట్టుకొని స్వదేశీ ఇంజినీర్లను కించపరుస్తున్న చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. తెలుగు వాళ్లు, భారతీయ ఇంజినీర్లు అసమర్థులు, కమిట్ మెంట్ లేదంటూ  బాబు హేళన చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇంజినీర్లను కించపర్చినందుకు క్షమాపణ చెప్పాలని బాబును డిమాండ్ చేశారు. మహాకవి గురజాడ దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టిబెట్టవోయ్ అంటే...చంద్రబాబు మాత్రం విదేశమును ప్రేమించుమన్నా, సొంత ప్రజలను ముంచుమన్నా, గట్టి మూటలు కట్టిపెట్టవోయ్ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ విదేశీయులకు కట్టబెడుతున్న బాబు పరిపాలన విధానాన్నిచూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని బత్తుల చెప్పారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు.  

రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బాటలు వేసుకునే కుట్రలో భాగంగానే ....ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చేందుకు బాబు ఇతర దేశాల వాళ్లను పొగుడుతూ మనవాళ్లను అవమానిస్తున్నారని బత్తుల ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ కట్టింది  మన ఇంజినీర్లు కాదా బాబూ..? మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు లాంటి ఎంతోమంది ఖ్యాతి గడించిన భారతీయ ఇంజినీర్లను అవహేళన చేయడం దుస్సాహసమేనని బాబుపై ధ్వజమెత్తారు. అమెరికాలోని నాసాలో 36 శాతం భారతీయులే ఇంజినీర్లుగా ఉండి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన విషయం మీకు గుర్తుకు రాదా..? మనవాళ్లు అసమర్థులని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. దొడ్డిదారిన ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసే స్థాయికి వచ్చారంటూ చంద్రబాబుపై  నిప్పులు చెరిగారు. 

రాష్ట్రంలో ఇంజినీర్లను ఎక్కడైనా సమర్థవంతంగా పనిచేయనిస్తున్నారా అని బత్తుల బాబును ప్రశ్నించారు.  గ్రామస్థాయి నుంచి పై స్థాయి దాకా ప్రతి పనిలో మీకు వాటా కావాలి. మీ నాయకులు చెప్పినట్లు నడుచుకోవాలి. నీరు-చెట్టు పేరుతో చెరువులు తవ్విస్తున్నామని నమ్మించి మోసం చేసి దోపిడీ చేస్తున్నారు.  స్విస్ ఛాలెంజ్ విధానం పేరుతో సింగపూర్ కు 58 శాతం వాటా ఇచ్చి ప్రభుత్వానికి కేవలం 42 శాతం ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆంతర్యమేంటి..? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని దోపిడీ చేస్తున్నారు. రూ. లక్షల కోట్లు దోచుకొని విదేశాల్లో దాచిపెడుతున్నారు. దోపిడీ వ్యవస్థకు నాయకత్వం అప్పగించే మీ పాలనను ప్రజలంతా చూస్తున్నారు.  సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని బాబును హెచ్చరించారు. 

ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీ కోసం బాబు ఢిల్లీ చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేయడం దుర్మార్గమని బత్తుల విమర్శించారు. టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపిస్తూ ఏపీకి మాత్రం హోదా అవసరం లేదని మాట్లాడడం దారుణమన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, ఆంజనేయులు, గల్లా జయదేవ్  అంతా హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించారే, ఇది నష్టం కోసమా...?హోదా అవసరం లేదని చెబుతున్న వీరంతా అక్కడ పరిశ్రమలు రద్దు చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారా...అందుకు మీరు కట్టుబడతారా అని బాబుకు సవాల్ విసిరారు. ఉత్తరాఖాండ్ లో సుజనా వ్యాపారసంస్థలు ఏర్పాటుచేసుకుంది వాస్తవం కాదా...? అంటే  అక్కడైతే పండుగ, ఇక్కడైతే దండగని ప్రచారం చేస్తారా...?  రాష్ట్రంలో దోచుకున్న డబ్బులు తీసుకెళ్లి హోదా ఉన్న రాష్ట్రాల్లో బిజినెస్ లు చేస్తూ ఇక్కడ ఓటుకు కోట్లు కోసం వెదజల్లుతున్నారని విరుచుకుపడ్డారు. 
 
ఇతర దేశాలకు ఏపీ భవిష్యత్తును  తాకట్టుపెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు బాటలు వేయడం దారుణమని బత్తుల అన్నారు. దేశంలో సమర్థులును అసమర్థులుగా చిత్రీకరిస్తావా....? ఎవరైనా ఏదైనా సాధిస్తే నావల్లే వచ్చిందని చెప్పుకుంటావా...?భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసే బాబు దోపిడీ పరిపాలనను తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగువారిని, ఆంధ్రులను కించపర్చేవిధంగా మాట్లాడడాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.  మహానీయుల ఆలోచనను వక్రమార్గం పట్టించే బాబు దొంగ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని బత్తుల చెప్పారు. దోపిడీని పక్కనబెట్టి ఇంజినీర్లకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పజెప్పి స్వతంత్రంగా పనిచేసేలా అవకాశం ఇవ్వాలన్నారు.  పరిపాలన విధానం మార్చుకోవాలని హితవు పలికారు

No comments:

Post a Comment