17 September 2016

చైతన్య దీప్తి..జననేత యువభేరి

  • ప్రత్యేకహోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎనలేని పోరాటపటిమ
  • విభజన చట్టంలోని హామీలకు టీడీపీ, బీజేపీ తూట్లు
  • రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టిన చంద్రబాబు
  • హోదా కోసం ఎందాకైనా అంటున్న జననేత
  • హోదా సాధించేవరకు విశ్రమించేది లేదన్నవైయస్ జగన్

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమ వేడిని మరింతగా పెంచింది. రాష్ట్ర  హక్కుల సాధనకు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎందాకైనా పోరాడేందుకు సిద్ధపడ్డారు. హోదా సాధనే ధ్యేయంగా పోరాటాన్ని తీవ్రతరం చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను యూపీఏ ప్రభుత్వం రెండుగా చీల్చి మానని గాయం చేస్తే..ఆదుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీలు ఆపుండుపై కారం చల్లుతున్నాయి. పార్లమెంట్, తిరుపతి సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్న హామీని టీడీపీ, బీజేపీలు తుంగలో తొక్కడంపై రాష్ట్రమంతా భగ్గుమంటోంది. 

ప్రజలకు వెన్నుపోటు
రెండున్నరేళ్లుగా హోదా ఇస్తామని, తెస్తామని ప్రజలను మభ్యపెట్టిన బీజేపీ, టీడీపీలు.... ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఈ క్రమంలో హోదా కోసం ముందుండి పోరాడుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధర్నాలు, దీక్షలు, బంద్ లతో హోదా ఆకాంక్షను ప్రతిబింబించారు. అసెంబ్లీ లోపల, వెలుపల హోదా కోసం వైయస్ జగన్ చేయని పోరాటం లేదు. ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేపడితే దాన్ని భగ్నం చేసి చంద్రబాబు నీరుగార్చే ప్రయత్నం చేశారు. అయినా వైయస్‌ జగన్‌ వెనుకడుగు వేయకుండా అలుపెరగని పోరాటం చేస్తున్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సైతం  తన సభ్యులతో కలిసి నల్లదుస్తులతో హాజరై ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టారు. ఇలా మూడు రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హోదాపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో శాసనసభా కార్యాకలాపాలను వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు స్తంభింపజేశారు. ఈ నెల 10న రాష్ట్ర బంద్‌ చేపట్టి నిరసన తెలిపారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. 

యువత భవిష్యత్తు తాకట్టు
బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్యాకేజీకి మోకరిల్లి యువత భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నాడు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. హోదా కలిగిన రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే ఈ ప్రయోజనాలేవి పట్టని చంద్రబాబు కేంద్రం నుంచి వచ్చే నిధులతో కాంట్రాక్టులు చేసుకొని కమీషన్లు పొందే కుట్రపన్నారు. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనుమతించింది. అంతేకాకుండా ఓటుకు కోట్లు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి అమ్మేశారు. 

యువతను చైతన్యపరిచేందుకు యువభేరి
ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలపై యువత, విద్యార్థులను చైతన్యవంతం చేసేందుకు వైయస్ జగన్ నడుం బిగించారు. యూనివర్సిటీల్లో యువభేరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి మొదలు మొన్నటి నెల్లూరు యువభేరి కార్యక్రమం వరకు పెద్ద ఎత్తున విజయవంతమయ్యాయి. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో ఆటంకం కలిగించేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నారు. ఏమాత్రం బెదరకుండా  విద్యార్థులు యువభేరి సదస్సులతో అధిక సంఖ్యలో పాల్గొని హోదాకోసం నినదించారు. యువతకు హోదా వల్ల కలిగే ఉపయోగాలను వైయస్‌ జగన్‌ వివరిస్తూ చైతన్యవంతం చేశారు. అదే స్ఫూర్తితో ఈనెల 27న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైయస్సార్సీపీ యువభేరి కార్యక్రమ ఏర్పాట్లు చేస్తోంది.  హోదా వచ్చేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని వైయస్ జగన్ తేల్చిచెప్పారు. హోదా సాధనే వైయస్సార్సీపీ ధ్యేయమని మొక్కవోని విశ్వాసంతో పోరాటం కొనసాగిస్తున్నారు. 

తిరుపతి(సెప్టెంబర్‌15, 2015)
వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో మొట్ట మొదటి సారిగా తిరుపతి నగరంలో 2015, సెప్టెంబర్‌ 15 యువభేరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి యువకుల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ యూనివర్సిటీల నుంచి పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి హోదా కోసం నినదించారు. పలువురు మేధావులు, ప్రొఫెసర్లు పాల్గొని హోదాకు మద్దతు పలికారు. 

విశాఖ(సెప్టెంబర్‌ 22–2015)
తిరుపతి యువభేరి స్ఫూర్తిగా అదే నెల 22న విశాఖపట్నంలో తలపెట్టిన యువభేరి కార్యక్రమం విజయవంతమైంది. యువభేరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సదస్సుకు విద్యార్థులు పెద్ద ఎత్తున  తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో కళావాణి ఆడిటోరియం పోటెత్తింది. యువభేరిలో ప్రత్యేకహోదాపై ప్రతిపక్షనేత, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గర్జించారు. పచ్చనేతల గుండెల్లో వణుకుపుట్టేలా  ప్రభుత్వ  వైఖరిని తూర్పారబట్టారు.  ప్రత్యేకహోదాపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ విద్యార్థులు,యువతకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు సర్కార్‌ విద్యార్థులను రానీయకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించినా..బేఖాతరు చేయకుండా యువత యువభేరికి హాజరయ్యారు.

కాకినాడ( జనవరి 27–2016) 
కాకినాడ( జనవరి 27–2016)కాకినాడలోని అంబేద్కర్‌ భవన్‌ లో జనవరి 27న యువభేరి కార్యక్రమం నిర్వహించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం నలుమూలల నుంచి  పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, యువత ఇతర నాయకులతో అంబేద్కర్‌ భవన్‌ కిక్కిరిసిపోయింది.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన ప్రత్యేక హోదా, దాని వల్ల వచ్చే ప్రయోజనాలపై నిరుద్యోగులు, విద్యార్థులకు సభలో  వైయస్‌ జగన్‌ వివరించారు. 

శ్రీకాకుళం(ఫిబ్రవరి 2–2016)
 శ్రీకాకుళం పట్టణంలో ఫిబ్రవరి 2, 2016న యువభేరి నిర్వహించారు. పట్టణంలోని టౌన్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువభేరి ప్రాంగణం విద్యార్థిలోకం కేరింతలతో మార్మోగింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైయస్‌ జగన్‌ యువత, విద్యార్థులను చైతన్యవంతం చేశారు. ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి యువతకు వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

నెల్లూరు(ఆగష్టు 4–2016)
ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా వైయస్‌ఆర్‌సీపీ  పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తూ నెల్లూరు నగరంలో ఆగస్టు 4, 2016న యువభేరి నిర్వహించింది.‘యువభేరి’ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. స్థానిక కస్తూరి దేవి గార్డెన్స్‌లో  జరిగిన యువభేరి సదస్సులో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి యువతకు చాటిచెప్పారు. 

No comments:

Post a Comment