24 August 2016

పట్టిసీమ పేరిట కృష్ణాడెల్టాను నాశనం చేస్తున్నారు

  • రైతాంగాన్ని బాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు
  • టీడీపీ సర్కార్ పై ఎంవీఎస్ నాగిరెడ్డి ఆగ్రహం
  • వేమూరులో దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన నాగిరెడ్డి
తెనాలిః పట్టిసీమ పేరుతో కృష్ణాడెల్టాను నాశనం చేయొద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ప్రథమ వినియోగ హక్కు, నికర జలాల హక్కు కలిగిన కృష్ణాడెల్టాకు పట్టిసీమ పేరుతో నీటి కేటాయింపులపై అయోమయ పరిస్థితిని కల్పించవద్దన్నారు. చిత్తశుద్ధి వుంటే కృష్ణాబోర్డు నుంచి ఏ మేరకు నీటిని తీసుకొంటారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గంలో సాగునీరందక దెబ్బతిన్న వరిసాగు పొలాలను నాగిరెడ్డి పరిశీలించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో సాగుభూమి 43 లక్షల హెక్టార్ల నుంచి 40.9 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు. తెలంగాణలో సాగుభూమి 38.58 లక్షల హెక్టార్ల నుంచి 43 లక్షల హెక్టార్లకు విస్తరించిందని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో పంటల సాగు 69 శాతం కాగా, గుంటూరు జిల్లాలో 59 శాతం మాత్రమేనని చె ప్పారు. ఇదే జిల్లాలో 1.89 లక్షల హెక్టార్లకు 76 శాతమే సాగు చేయగలిగినట్టు నాగిరెడ్డి వివరించారు. ఏరువాక పేరుతో పండుగలు చేసిన ప్రభుత్వం, జులై 10వ తేదీనుంచి నారుమళ్లు పోసుకోవచ్చని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ...కృష్ణాడెల్టా రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నాగిరెడ్డి ఆరోపించారు.

పట్టిసీమ నీటిని నెల్లూరు, పెన్నావరకు తీసుకెళతామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం కృష్ణాడెల్టాలో నారుమళ్లకు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు.  పుష్కరాల ప్రాంతంలో ఉంన్న ముఖ్యమంత్రి, అక్కడ పంటలు ఎండిపోతున్నా కూడా పట్టించుకోలేదనీ, సుభిక్షమైన కృష్ణాడెల్టాను బీడుగా మార్చారని ఆరోపించారు. పంటకాలువల నుంచి ఇంజిన్లతో బ్రాంచి కాలువలకు, అక్కడ్నుంచి మళ్లీ ఇంజిన్లతో పొలాలు తడువుకోవాల్సిన దుస్థితిని రైతులు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

పట్టిసీమ నీటిని తరలిస్తున్న పోలవరం కాలువను కాంక్రీట్ లైనింగ్‌తో సహా 130 కి.మీ వరకు వైయస్ హయాంలో పూర్తిచేస్తే ...తర్వాత 42 కి.మీ దూరం కాలువను సక్రమంగా నిర్మించని కారణంగానే గండి పడిందన్నారు. మళ్లీ గండ్లు పడతాయన్న భయంతోనే 24 పంపులను వినియోగించే ధైర్యం చేయలేకపోతున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గత రెండేళ్లలో ప్రకటించిన కరువు మండలాల రైతులకు ఇంతవరకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించలేదని ఫైర్ అయ్యారు. 2003లో కరువు సమయంలో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు.

రైతాంగం కోసం ఏ పార్టీలతోనైనా కలిసి పోరాడేందుకు తమ పార్టీ సిద్ధంగా వుందన్నారు. నాగిరెడ్డితో పాటు పార్టీ రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పెరికల కాంతారావు, యలవర్తి రామమోహనరావు, యలవర్తి నాగభూషణం, గాదె శివరామకృష్ణారెడ్డి, ఉయ్యూరు అప్పిరెడ్డి, రాపర్ల నరేంద్ర వేమూరులో పర్యటించారు

No comments:

Post a Comment