16 April 2016

స్వ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నాడు : వై.వీ సుబ్బా రెడ్డి

  • అనైతికంగా ఎమ్మెల్యేలను కొంటున్నావ్
  • సిగ్గేయడం లేదా బాబు నీకు
  • విభజన హామీలపై పోరాటాన్ని ఉధృతం చేస్తాం
  • ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారుః వైవి
విశాఖపట్నంః ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం చేతగాక చంద్రబాబు రాష్ట్రంలో నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాడని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని  ధ్వజమెత్తారు.  తెలంగాణలో ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు...అక్కడ ఎమ్మెల్యేలను అమ్మేసుకొని ఏపీలో ఎమ్మెల్యేలను కొంటూ పచ్చకండువాలు కప్పే కార్యక్రమం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఓ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను అనైతికంగా చేర్చుకోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. తమ అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామన్నారు.  

విశాఖకు రైల్వే జోన్ సాధనే లక్ష్యంగా  జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు వైవి సుబ్బారెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వే జోన్, పోలవరం, రాజధాని నిర్మాణం సహా అనేక హామీలిచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించాయని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నాయని ఫైరయ్యారు. టీడీపీ, బీజేపీలు ఏవిధంగా అన్యాయం చేస్తున్నాయో అంతా గమనిస్తున్నారన్నారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

ఇప్పటికే విభజన హామీలపై వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీలం ప్రధానిని, హోంమంత్రిని, రైల్వే మినిస్టర్ ను కలిశామని..పార్లమెంట్ లోనూ పోరాడామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఐనా కూడా ఇప్పటివరకు ప్రత్యేకహోదా గానీ, రైల్వే జోన్ గానీ ఏ ఒక్కటి ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టే దిశగానే కొనసాగుతున్నాయని ఆగ్రహించారు.  వైఎస్సార్సీపీ తరపున ఏపీకి రావాల్సిన హక్కులపై పార్లమెంట్ బయట, లోపల పోరాటాన్నితీవ్రతరం చేస్తామన్నారు. ప్రత్యేకహోదా ఏపీ ప్రజల హక్కు ...రైల్వే జోన్ విశాఖ ప్రజల హక్కు నినాదంతో పోరాటాన్ని ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు.  

పోలవరం ప్రాజెక్ట్ నిధులను టీడీపీ సర్కార్ మళ్లించే అవకాశం ఉన్నందున...దాని బాధ్యతను కేంద్రప్రభుత్వమే తీసుకోవాలని వైవి డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే కోస్తా జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తిచేస్తామని చెబుతున్నారని... రెండేళ్లలో 200 కోట్లతో ఎలా నిర్మిస్తారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఏపీ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని నిలదీశారు.  వైజాగ్ కు రైల్వేజోన్ అన్నది దశాబ్దాల కోరిక అని...దాన్ని ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రభుత్వాలను కడిగిపారేశారు. 

రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన టీడీపీ...అందుకోసం పోరాడకుండా కేంద్రంలో మంత్రివర్గంలో కొనసాగడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి  మేలు చేయకపోగా కీడు జరుగుతున్నా కూడా బాబు చోద్యం చూస్తున్నాడని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బాబు పాలన హీన స్థితికి దిగజారిందని వైవి అన్నారు. డబ్బులు, పదవులు ఎరవేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయోచ్చేమో గానీ...ప్రజలను కొనలేరన్నారు. ప్రజల హృదయాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం వైఎస్ జగన్ ప్రజాపోరాటాలు చేస్తూనే ఉంటారని వైవి తేల్చిచెప్పారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రజలు వైఎస్ జగన్ కు పట్టం కట్టడం ఖాయమని..మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సువర్ణ పాలన వస్తుందన్నారు.  అమర్ దీక్షకు పార్టీ అంతా వెన్నంటి ఉంటుందని వైవి స్పష్టం చేశారు. 

నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా విచ్చేసిన వైఎస్సార్సీపీ పెద్దలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు...అదేవిధంగా వామపక్ష నేతలు, లోక్ సత్తా, ప్రజా,విద్యార్థిసంఘాలు, మేధావులు ప్రతి ఒక్కరికీ అమర్నాథ్  కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు దీక్షలో కూర్చున్న ముస్లిం సోదర సోదరీమణులకు అభినందనలు తెలిపారు.  రైల్వే జోన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని తాత్సారం చేయడం పట్ల అమర్నాథ్ మండిపడ్డారు. రైల్వే జోన్ కోసం పార్లమెంట్ లో పోరాడుతామని ప్రకటించిన వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుల బృందానికి అమర్నాథ్ 
ధన్యవాదమలు తెలిపారు. 

No comments:

Post a Comment