13 April 2016

మంత్రి నారాయణకు కనిపించని కష్టాలు

  • మునిసిపాలిటీల్లో తిష్టవేసిన తాగునీటి సమస్య
  • పట్టణాలు, శివారు కాలనీల్లో అల్లాడుతున్నజనం
  • పట్టించుకోని మంత్రి నారాయణ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్య తీవ్రం అవుతోంది. కార్పొరేషన్లు, గ్రేడ్..1, గ్రేడ్..2,  గ్రేడ్..3, నగర పంచాయతీలు అన్నీ కలిపి 110 మునిసిపాలిటీలు ఉంటే వీటిలో 90 చోట్ల తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అధికారులే అంగీకరిస్తున్నారు. కానీ దీన్ని పరిష్కరించేందుకు అవసరమైన సన్నద్ధత మాత్రం కాన రావటం లేదు.
మునిసిపాలిటీల్లో పరిస్థితి
ప్రతీ ఏటా వేసవి వస్తుందంటే పట్టణాలు, శివారులకు తాగునీటి సమస్య ఏర్పడుతుంది. జన సామర్ధ్యం అధికంగా ఉండటం, నీటి వనరులు తక్కువగా ఉండటంతో ఈ సమస్య గ్రామాలలో కంటే పట్టణాల్లో అధికంగా ఉంటుంది. అంతే గాకుండా పట్టణ ప్రాంతాల్లో కచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థ ల ద్వారానే తాగునీటి సరఫరా జరగాలి. పల్లెటూర్లలలో మాదిరిగా ప్రజలు దూరంగా వెళ్లి నీళ్లు తెచ్చుకోవటం కష్టం. దీంతో సాధారణంగా వేసవి కన్నా ముందే పురపాలక శాఖ పరంగా తాగునీటి ఎద్దడి మీద కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొంటారు. ఇందుకోసం పట్టణాల వారీగా ప్రతిపాదనలు తెప్పించుకొని వాటిని సమీక్ష చేసుకొని కార్యాచరణ రూపొందించుకొంటారు.
గాలికి వదిలేసిన మంత్రి
మునిసిపల్ మంత్రి నారాయణ చాలా కాలంగా రాజధాని మంత్రిగా మారిపోయారన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా సింగపూర్ లావాదేవీలు పూర్తిగా చంద్రబాబు తరపున నారాయణే పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంత్రిత్వ శాఖల పనులన్నీ పెండింగ్ లో పడుతున్నాయి. ముఖ్యంగా తాగునీటి వంటి అత్యవసర సమీక్షలు కూడా పెద్దగా జరగటం లేదు. ఫలితంగా తాగునీటి మీద ఎటువంటి సమగ్ర ప్రణాళిక రూపొందించలేదు.
అవస్థలు పాలవుతున్న జనం
పట్టణాల్లో జనం అయితే నీరు అందక అల్లాడిపోతున్నారు. మురికివాడల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా మీద ప్రభుత్వం చేతులెత్తేసింది. 12 వేలకు పైగా బోర్లు ఎండిపోయాయని తెలుస్తోంది. దీంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకొంటే తప్ప తామేమీ చేయలేమని స్థానిక అధికారులు వాపోతున్నారు. 

No comments:

Post a Comment