10 April 2016

గ్రామాల్లో జన్మభూమి కమిటీల అరాచకం

  • చెలరేగుతున్న పచ్చ పార్టీ నేతలు
  • వ్యవస్థలు, విలువల పట్టింపు లేనే లేదు

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జన్మభూమి కమిటీల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన వ్యవస్థలకు పాతర వేయటాన్ని అంతా తప్పు పడుతున్నారు. ఈ కమిటీలను తక్షణమే రద్దు చేయాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్నారు.
      గ్రామాల్లో ప్రజల తక్షణ అవసరాలు తీర్చటంలో స్థానిక సంస్థలకే ప్రాధాన్యం. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో అసలు లబ్దిదారుల్ని గుర్తించటంలో పంచాయతీ సర్పంచ్ ల పాత్ర కీలకం . ఎందుకంటే ఆయా గ్రామాల్లో ప్రజల మద్దతు చూరగొన్న వారికి అవకాశం ఇవ్వటం తప్పనిసరి. అయితే, గ్రామ సర్పంచ్ లను, పంచాయతీ లను పక్కన పెట్టేసేందుకు, రాజ్యాంగ వ్యవస్థల్ని అపహాస్యం చేసేందుకు జన్మభూమి కమిటీలు పుట్టుకొని వచ్చాయి.
      ప్రతీ గ్రామంలో తెలుగుదేశం నాయకులతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. పారదర్శకత కోసం అన్న వంకతో టీడీపీ నేతల్ని ఇందులో నింపేశారు. ఇక గ్రామంలో రేషన్ కార్డులు ఇవ్వాలన్నా, తీసేయాలన్నా... పింఛన్లు ఇవ్వాలన్నా, తీసేయాలన్నా...బలహీన వర్గాలకు నిధులు ఇవ్వాలన్నా, తీసేయాలన్నా ఈ కమిటీల మాట వినాల్సిందే. ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్రామాల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఏ పని జరగాలన్నా టీడీపీ నేతలు చెప్పిందే వేదం. లేదంటే నిబంధనలు, ప్రభుత్వ వ్యవస్థలు అంతా గాలికి కొట్టుకొని పోతాయి.
జన్మభూమి కమిటీల అరాచకాల మీద గౌరవ హైకోర్టు కూడా మండిపడింది. పింఛన్ పథకాల లబ్దిదారుల పేర్లను జన్మభూమి కమిటీలు తీసేయటాన్ని తప్పు పట్టింది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎప్పటినుంచో జన్మభూమి కమిటీల అరాచకాల మీద పోరాడుతోంది. తాజాగా పులివెందుల పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జన్మభూమి కమిటీలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. పంచాయతీ వ్యవస్థల్ని అపహాస్యం చేస్తున్న ఈ కమిటీలతో వచ్చి పడుతున్న అనర్థాల్ని విడమరిచి చెప్పారు. మరి, అరాచకాల్ని ప్రోత్సహితున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ హితోక్తుల్ని ఎంత వరకు వింటుందో చూడాలి. 

No comments:

Post a Comment