హైదరాబాద్ః రెండున్నరేళ్లుగా ప్రత్యేకహోదాపై పూటకో మాట మాట్లాడుతూ మభ్యపెడుతూ వచ్చిన చంద్రబాబు...ఇప్పుడు ప్యాకేజీని స్వాగతిస్తున్నానంటూ చెప్పి రాష్ట్ర ప్రజలను పచ్చి మోసం చేశారని వైయస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు మండిపడ్డారు. హోదాపై చర్చిద్దామని అడిగితే...మార్షల్స్ తో సభనుంచి గెంటేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల హక్కును చంద్రబాబు కాలరాస్తున్నారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు.
ప్రత్యేక హోదా పేరు వింటేనే బాబు గుండెల్లో గుబులు
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
ప్రత్యేక హోదా మాట మాట్లాడితేనే చంద్రబాబు గుండెల్లో గుబులు పుడుతుందని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయిన భయంతోనే చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామనడం హాస్యాస్పదంగా ఉందని, ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఒక్క చంద్రబాబు సర్కార్కు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు జరగదని గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఏకైక నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ప్రతి ఆంధ్రుడు కోరుకుంటున్న ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా తీసుకొస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
బాబుది రెండుకళ్ల సిద్ధాంతం
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన
ప్రత్యేక హోదా అంశం చర్చకు రానీవ్వకుండా అధికార ప్రభుత్వం అడ్డుపడడం అత్యంత దుర్మార్గమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. చంద్రబాబుది మొదటి నుంచి కూడా రెండు కళ్ల సిద్ధాంతమని, రెండు నాల్కల ధోరణితోనే నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అసెంబ్లీలోకి మార్షల్స్ను ముందుగానే తీసుకొచ్చి చంద్రబాబు కుట్రలు పన్నడం హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిలాషను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లనివ్వకుండా మార్షల్స్తో అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. తాను అధికారంలోకి వస్తే పదిహేనేళ్లు ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్రత్యేక ప్యాకేజీ అనడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి టోపి పెట్టి మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
రాష్ట్రవిభజనతో ఏపీ నష్టపోయింది
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఎంతగానో నష్టపోయిందని, ఆ నష్టాన్ని పూడ్చేం దుకు ఆనాటి ప్రధాని, ప్రతిపక్ష పార్టీలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేసి... అధికారంలోకి రాగానే మాట మార్చడం దురదృష్టకరమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలికావాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కళావతి
ప్రజాస్వామ్య బద్దంగానే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తాము నిరసన వ్యక్తం చేశామని, అధికార ప్రభుత్వం కావాలనే మార్షల్స్ను ముందుగానే అసెంబ్లీలోకి రప్పించారని వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించిన దాఖాలాలు లేవని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హక్కులను కాలరాయడం ఒక్క టీడీపీ ప్రభుత్వానికే చెల్లిందని దుయ్యబట్టారు. రూల్స్కు వ్యతిరేకంగా మార్షల్స్ను అసెంబ్లీలోకి తీసుకురావడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మహిళా శాసనసభ్యులు అని కూడా చూడకుండా మార్షల్స్ తమను నెట్టివేసి, అగౌరవపర్చడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యంలోనే ఒక చీకటి రోజుగా భావించాలని ఆమె కోరారు. ప్రతిపక్ష నాయకుడికి కనీసం అర నిమిషం కూడా మైక్ ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధం కాదా అని స్పీకర్ను ప్రశ్నించారు. స్పీకర్ న్యాయంగా, పక్షపాతం లేకుండా వ్యవహారించాల్సి ఉండగా అందుకు వ్యతిరేకంగా స్పీకర్ ప్రవర్తన ఉండడం బాధకరమన్నారు.
దాడి చేయించి తమపైనే నిందలా
ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
అధికార టీడీపీ అసెంబ్లీలో మార్షల్స్తో తమపై దాడి చేయించి..మళ్లీ తమపైనే నిందవేసే కార్యక్రమం చేస్తుందని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల ఆకాంక్షని నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తప్ప... ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదన్నారు. 5 కోట్ల ఆంధ్రప్రజల హక్కుగా ప్రభుత్వంపై పోరాడుతున్నామన్నారు. అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేలపై మార్షల్స్ దాడి అత్యంత హేయనీయమన్నారు.
No comments:
Post a Comment