- వైయస్ పాలనలో రైతే రాజు
- అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
- వైయస్లో దేవుడిని చూసిన ప్రజలు
ఎంతోమంది పుడుతుంటారు.. గిడుతుంటారు కానీ కొంతమంది మాత్రమే సమాజంపై చెరగని ముద్ర వేసి వెళ్తుంటారు. వాళ్లు శారీరకంగా దూరమైన ప్రజల మనస్సుల్లో కొలువై ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు యెదుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. వైయస్ సంపన్న కుటుంబం నుంచి రాకపోయినా... రాజకీయ నేపథ్యం లేకపోయినా రాష్ట్ర రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రాజకీయాల గురించి కానీ.. పాలన గురించి కానీ చెప్పాల్సి వస్తే వైయస్ఆర్ కంటే ముందు.. వైయస్ఆర్ తర్వాత అని చెప్పేటంతే గొప్ప పాలన అందించారు. మాట తప్పని.. మడిమ తిప్పని నాయకుడిగా ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు. సెప్టెంబర్ 2 వైయస్ఆర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
పదిమందినడిచిన దారిలో నడవడం సులభం...కానీ ప్రజలకు ఉపయోగపడే మార్గం కష్టమైనా అదే దారిని ఎంచుకున్నారు వైయస్. ఆ మార్గంలో నడవడానికి తుదిశ్వాస వరకు విశ్రమించకుండా సాగిపోయిన బాటసారి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైయస్
వైయస్ఆర్ తన పాదయాత్రలో రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిణతితో అర్థం చేసుకున్నారు. రైతాంగ జీవనంలో ఆశావహ వాతావరణం కల్పించడానికి ఆత్మహత్యలు మానాలని, సమస్యలకు అది పరిష్కారం కాదని, తమ పాలనలో రైతుల అప్పులు రద్దు చేస్తామని వైయస్ వారికి భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్పై సంతకం పెట్టారు. రైతుకు గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు.
రైతన్నల కోసం..
``అడుక్కుతినైనా.. అప్పుచేసైనా.. రాష్ట్రంలో జలయజ్ఞం పథకం పూర్తి చేస్తామని నిండు సభలో వైయస్ అన్న మాటలను గుర్తు చేసుకుంటే వైయస్ఆర్కు రైతులు అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. ప్రాజెక్టులు నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో సేద్యపు నీటి సౌకర్యాలకు పెద్దపీఠ వేసి లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని వైయస్ చెప్పడమే కాదు చేసి చూపించారు కూడా. జలయజ్ఞం ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామని చెప్పి 86 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వాటిలో చాలా వరకు పూర్తి చేశారు.
పేదలకు ప్రాణం పోసిన డాక్టర్ వైయస్
వైయస్కు ఎంతో ఇష్టమైన పథకం ఆరోగ్యశ్రీ, చిన్న చిన్న జబ్బులు చేసినా చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన మహనీయుడు డాక్టర్ వైయస్. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పూర్తిగా ఉచిత వైద్యం అందించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు పునర్జర్మ కల్పించారు. అంతేకాకుండా 108, 104 సేవలను ప్రారంభించి వైద్య సేవలను ప్రజలకు మరింత దగ్గర చేశారు. ఆపత్కాలంలో ఆస్పత్రికి చేరాలంటే ఇబ్బందులు ఎదుర్కొనే రోజుల నుంచి 108 ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో ఆస్పత్రిలో ఉండేలా వైయస్ చర్యలు తీసుకున్నారు.
ప్రజల మనస్సు తెలుసుకున్న నేత వైయస్
రూపాయి వైద్యుడిగా కెరీర్ను ప్రారంభించిన డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల మనసు చదివారు. వాళ్లకు ఏమి ఇస్తే సుఖసంతోషాలతో ఉంటారో అవన్నీ కల్పించేశారు. ప్రతి మహిళను లక్షాధి కారిణి చేయాలని తపన పడ్డారు. పావల వడ్డీకే రుణాలు ఇచ్చారు. డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించారు. 85 లక్షల మందికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్తో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కిలో రూ.2లకే బియ్యం ఇచ్చారు. ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప ఇళ్లను మంజూరు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రతి నెల 1వ తేదీన పింఛన్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రజలకు ఏమి అవసరమో అవన్నీ కూడా వాళ్లు అడగకముందేకల్పించిన మహనీయు డాక్టర్ వైయస్ఆర్.
విజన్ ఉన్న నాయకుడు వైయస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక శ్రామికుడిలా నిరంతరం శ్రమించారు వైయస్. అధికారంలో ఉన్న ఐదేళ్లలో కృష్ణపట్నం, గంగవరం డీప్ వాటర్ సీపోర్టులను సాకారం చేయగలిగారు. కృష్ణపోర్టు రావడం వల్లే అక్కడ 10 వేల మెగావాట్ల అల్ట్రామెగా పవర్ ప్రాజెక్టకు దారి ఏర్పడింది. అంతేకాదు విశాఖ, తిరుపతి విమానాశ్రయాలను ఇంటర్నేషల్ ఎయిర్పోర్టులుగా తీర్చిదిద్దడంలో సఫలమయ్యారు. కడప, నిజామాబాద్, నెల్లూరు, ఒంగోలు, కొత్తగూడెం, రామగుండం, కర్నూలు, వరంగల్ ఎయిర్పోర్టులను నిర్మించాలని యోచించారు. టాటా నానో రాకున్నా.. ప్రత్యామ్నాయంగా అదిభట్లలో టాటా హెలికాఫ్టర్ అసెంబ్లింగ్ యూనిట్ను రప్పించగలిగారు. ఎంతోమందికి సర్కారీ ఉద్యోగాలు ఇచ్చారు. వారికి ఆరోగ్య సదుపాయాలు కల్పించారు.
చిరునవ్వే ఆయన ఆస్థి
వైయస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చిరునవ్వుకు చిరునామా అని చెప్పొచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా నిలిచారు వైయస్. ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో పలుకరిస్తూ శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకున్న ఘనత వైయస్కే దక్కింది. అచ్చతెలుగు పంచెకట్టు.. ఆప్యాయ పలకరింపే వైయస్ను ప్రజలకు మరింత దగ్గర చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి వరకు పేరు పెట్టి ఆప్యాయంగా పిలిచే ఏకైక నేత కూడా వైయస్సే. అయితే రాజకీయాల్లో చాలా మంది హీరోలుగా వచ్చి నాయకులైతే.. వైయస్ మాత్రం నాయకుడిగా వచ్చి హీరో అయ్యారని ప్రజలు కీర్తిస్తుంటారు. ఏదేమైనా వైయస్ అనే ఈ రెండు అక్షరాలు ప్రజల గుండెల్లో పచ్చబొట్టుగా చెరిగిపోని ముద్ర వేసుకుందన్నది అక్షర సత్యం.
No comments:
Post a Comment