7 October 2016

ప్రత్యేకహోదా..నిరాహార దీక్షకు ఏడాది

  • హోదా కోసం గుంటూరు వేదికగా ఆమరణ దీక్ష
  • దీక్ష ఏడవ రోజుకు చేరుకున్న సమయంలో బాబు కుట్రలు
  • బలవంతంగా దీక్ష భగ్నం 
  • హోదాపై మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • కేసులకు భయపడి హోదాను తాకట్టు పెట్టిన బాబు
  • పార్లమెంట్, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీకి తూట్లు
  • బీజేపీ, టీడీపీల మోసంపై ప్రజాగ్రహం
  • హోదా కోసం వైయస్ జగన్ అలుపెరగని పోరు

గుంటూరుః ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గుంటూరు వేదికగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష.. నేటతో ఏడాది పూర్తిచేసుకుంది. ప్రత్యేకహోదా ఇస్తామన్న కేంద్రం, తెస్తామన్న టీడీపీ రెండు పార్టీలు ఏపీ ప్రజలను వంచించాయి. పార్లమెంట్, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంగలో కలిపాయి. విభజన సమయంలో ఆనాటి ప్రదాని హోదా ఐదేళ్లు అంటే, కాదు పదేళ్లు కావాలని బీజేపీకి చెందిన వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు కోరారు. హోదా పదిహేనేళ్లు కావాలని చంద్రబాబు నాయుడు ఎన్నికలముందు ఊదరగొట్టారు. అంతే కాదు ప్రత్యేకహోదా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాన్ని మర్చి ప్రజలను మోసం చేశారు. దీంతో, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం సంజీవని లాంటి ప్రత్యేకహోదాను సాధించేందుకు ప్రధాన ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ఆ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు.  గుంటూరు నగర శివారు నల్లపాడు రోడ్డులో వైయస్ జగన్ స్వయంగా 07-10-2015 తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రాణాలను పణంగా పెట్టి హోదా కోసం పోరాడుతున్న జననేతకు మద్దతుగా రాష్ట్రప్రజానీకమంతా నల్లపాడుకు కదలివచ్చింది. హోదా కోసం గర్జించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు. 



వైయస్ జగన్ దీక్షతో వణికిపోయిన ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. జనం కోసం జననేత...జననేత కోసం జనం ఒక్కటై హోదా పోరాటం సాగించడంతో బాబుకు ముచ్చెమటలు పట్టాయి.  గుంటూరుకు రాకుండా అడ్డుకునేందుకు శతవిథాల ప్రయత్నించి తోకముడిచారు. మొక్కవోని దీక్షతో హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్న వైయస్ జగన్ కు సంఘీభావంగా తరలివచ్చి ప్రతీ పౌరుడు తోడుగా నిలిచారు. ఆరోగ్యం నీరసించిపోయినా తన వద్దకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ జగన్ దీక్ష కొనసాగించారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున వైయస్ జగన్ దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి కంటతడి పెట్టారు. ఆరోగ్యం బాగా క్షీణించిపోవడంతో దీక్ష విరమించాలని పార్టీ నేతలు కోరినా ఏమాత్రం లెక్కచేయలేదు. తనకన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వైయస్ జగన్ దీక్షను నిర్విరామంగా కొనసాగించారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో బాబు కుయుక్తులు పన్నారు. హోదా కోసం పోరాడుతున్న ప్రజలగొంతు వినపడకుండా చేసేందుకు పోలీసులను ఉసిగొల్పాడు. వైయస్ జగన్ దీక్ష ఏడవ రోజుకు చేరుకున్న సమయంలో దొంగచాటుగా అర్థరాత్రి పోలీసులను పంపించి బలవంతంగా భగ్నం చేశారు.   గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐనా కూడా వైయస్ జగన్ వెనకడుగు వేయకుండా ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగించారు. అక్కడ వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. 



ప్రత్యేకహోదా కోసం అనేక దపాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు వైయస్సార్సీపీ తన పోరాటాలు కొనసాగించింది. ధర్నాలు, దీక్షలు, బంద్ లు, యువభేరి సదస్సులతో ప్రత్యేకహోదా ఆకాంక్షను చాటిచెప్పింది. అసెంబ్లీలోనూ, వెలుపల హోదా కోసం అలుపెరగని పోరాటం కొనసాగించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టింది. ఐనా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల హక్కును కేంద్రానికి తాకట్టుపెట్టాడు. ఐదుకోట్ల మంది ఆంధ్రులను నిట్టనిలువునా దగా చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి హోదా కోసం పోరాడాల్సింది పోయి హోదా వల్ల ఏమొస్తాయంటూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. హోదా ఏమైనా సంజీవనా, హోదాతో రాష్ట్రం స్వర్గమైపోతుందా, కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్తవద్దంటుందా అంటూ పూటకో మాట మాట్లాడుతూ పథకం ప్రకారం నీరుగార్చుతూ వచ్చారు. ముఖ్యమంత్రే అడగనప్పుడు హోదా ఎందుకు ఇవ్వాలన్న ధోరణిలోకి కేంద్రం వెళ్లింది. 

రెండున్నరేళ్లుగా అదిగో హోదా, ఇదిగో హోదా అంటూ ఊరిస్తూ వచ్చిన టీడీపీ, బీజేపీలు ఉసూరుమనిపించాయి. హోదా కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఎప్పటికైనా హోదా తీసుకొచ్చేది మేమే అన్న చంద్రబాబు...హోదాని కాదని ప్యాకేజీకి మోకరిల్లాడు. అర్థరాత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను బాబు స్వాగతించించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బీజేపీ, టీడీపల తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. హోదాను ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు బీజేపీ కుంటిసాకులు వెతుకుతోందని మండిపడ్డారు. ప్యాకేజీని స్వాగతించడానికి బాబు ఎవరని నిలదీశారు. ప్రత్యేకహోదా ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అని నొక్కి వక్కానించారు. బాబు తన జేబులు నింపుకోవడం కోసం హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీని కోరడాన్ని ముక్తకంఠంతో ఖండించారు. 

హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైయస్ జగన్ అనేక సందర్భాల్లో చాటిచెప్పారు.  విద్యార్థులు, యువత రాష్ట్ర ప్రజలకు హోదా ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నారు. బీజేపీ, టీడీపీలు చేస్తున్న మోసాలను ఎంగడుతూ హోదా పోరాటంలో అందరినీ భాగస్వాములు చేస్తున్నారు. ప్రత్యేకహోదా సాధించేవరకు విశ్రమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హోదా ఒక్క జగన్ తో సాధ్యం కాదని, అందరం కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోరాట స్ఫూర్తితో హోదా కోసం ఉద్యమిద్దామని ప్రతీ ఒక్కరినీ కోరారు. ప్రత్యేకహోదాను అమ్మేసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. రాష్ట్రానికి హోదా సాధించేవరకు పోరాటాన్ని కొనసాగిద్దామన్నారు. వచ్చే ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రభుత్వాలను ఢిల్లీపీఠంపై కూర్చోబెడదామని వైయస్ జగన్ తేల్చిచెప్పారు. 

6 October 2016

కొడుక్కి జై కొడితే పనై పోతుందా

  • బాబు, లోకేష్‌ భూ దందాలకు ఆద్యులు
  • రాణి కమల దేవి భూకుంభకోణంలో లోకేష్‌ హస్తం
  • రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని లూటీ చేస్తున్నారు
  • ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా..?
  • లోకేష్ భూ బాగోతంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం
  • వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌
విశాఖపట్నం: అనుభవజ్ఞుడనని బీరాలు పలికే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ అవినీతి, భూ దందా కుట్రలకు ఆద్యులని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ నిప్పులు చెరిగారు. గాంధీకి వారసుడిని, నీతికి అన్నా హజారే తమ్ముడినని చెప్పుకునే చంద్రబాబు దోపిడీ పరిపాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖలో అత్యంత విలువైన రాణి కమల దేవి ప్రభుత్వ భూమిని సీఎం కుమారుడు నారా లోకేష్‌ బీనామీలతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాన్ని ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ వాటాలు వేసి పంచుకుంటున్నాడని మండిపడ్డారు. తండ్రి అధికారంతో కొడుకు పెత్తనం చేస్తున్నాడని దుయ్యబట్టారు. 

ఓటుకు నోటు కేసు నుండి రాజధాని భూ దందా వరకు, అగ్రి గోల్డ్‌ దందా నుండి డాన్‌ నయీం దందాల వరకు చంద్రబాబు, లోకేష్‌ పాత్ర స్పష్టంగా కనబడుతోందని, వారి నేరచరిత్రను ప్రజలు తెలుసుకున్నారని అమర్నాథ్ అన్నారు. గత 20 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న ప్రభుత్వ భూమిని విశాఖ పెద్దలకు వాటాలు వేసి పంచుతున్న తీరు చూస్తుంటే దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకొన్నట్లుందని అన్నారు. విశాఖ నడి బొడ్డున గవర్నర్‌ బంగ్లా ఆనుకొని ఉన్న అత్యంత విలువైన ప్రాంతంలోని సర్వే నెంబర్‌– 1027, 1028, 1029, 1196 మరియు 1197 భూమి రాణి కమల దేవి భూమి అని అన్నారు. ఐతే, ఈ ప్రభుత్వ భూమిని ఆమె ప్రైవేట్‌ భూమిగా సృష్టించి గత 20  సంవత్సరాలుగా హైకోర్టులో పోరాటం చేస్తున్న కొందరు బినామీ పెద్దల అసలు రూపం బట్టబయలు చేశారు. లోకేష్‌తో సిండికేట్‌ అయ్యి బినామీ పెద్దలు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా స్థలాన్ని పంచుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌ సహకారంతో సుమారు 50 మంది పెద్దలు ప్రభుత్వ భూమిని లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక రియలెస్టేట్‌ వ్యాపారమా అని ప్రశ్నించారు.  

ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్‌ పరం చేయడం సిగ్గుచేటు
రాణిదేవి భూమిని సర్వేలు చేసి ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన జిల్లా కలెక్టర్‌ యువరాజ్‌ నోటీకి ప్రభుత్వ పెద్దలు తాళాలు వేశారని అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. నిజాయితీగా  నిర్థారణ చేసి కోర్టు వ్యవహారాలలో కీలకంగా మారి అత్యంత  క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న సమయంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపు లేకుండా బదిలీ చేశారని చెప్పారు. చంద్రబాబుకు అన్ని విధాలుగా భాగస్వామి అయిన మరో నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు  పీఎస్‌గా నియమించి అధికారి నోటికి తాళం వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇదే భూ వివాదంలో నిజాయితీగా పనిచేస్తున్న మరో సబ్‌ రిజిస్టర్‌ పోతురాజుపై ఏసీబీని ప్రయోగించి బీనామీ పెద్దలు సస్పెండ్‌ చేయించింది నిజమా కాదా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ సర్వే నెంబర్‌ 1196,1197 భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించి విశాఖపట్నం వెబ్‌ సైటులో పెడితే , నగర కమిషనర్‌ సర్వే నెంబర్‌లను ప్రభుత్వ భూమిగా తప్పించి నివేదిక ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. రిజర్వాయర్, వాటర్‌ ట్యాంక్‌లు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్‌ స్థలంగా మార్చడం సిగ్గుచేటన్నారు. ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ ద్వారా అనేక విషయాలు ఈ సర్వే నెంబర్‌లపై అడిగినా ఒక్కదానికి కూడా నేరుగా సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఉండడం సిగ్గుచేటు అని అమర్‌ విమర్శించారు. ఎఫ్‌ఎంబీ, ఎస్‌ఎఫ్‌ఏ కాపీ అడిగితే కలెక్టరేట్, తహశీల్దార్‌ కార్యాలయం చుట్టు తిప్పుతున్నారని ఫైరయ్యారు. ప్రతిపక్ష పార్టీకి జిల్లా అధ్యక్షుడినైన తనకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేశారు. 

 లోకేష్‌ కనుసన్నల్లో ఆర్థిక వ్యవహారాలు
విశాఖ 1196 సర్వే నెంబర్‌ స్థలం కోర్టులో ఉండగానే 2002లో టీడీపీ హయాంలో రెండు వేల గజాల స్థలాన్ని పార్టీ కార్యాలయానికి చంద్రబాబు కేటాయించడం నిజమా? కాదా? అని అమర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం బినామీ పెద్దలతో లాలూచి పడి వారితో బహుమతిగా తెలుగుదేశం కార్యాలయం కట్టించుకోవడం వాస్తవమా కాదా అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ ఆర్ధిక వ్యవహారాలన్నీ లోకేష్‌ కనుసన్నల్లో జరుగుతున్నాయని చెప్పారు. ఈ స్థలాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు పరం కాకుండా అడ్డుకుంటామని అమర్నాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా యంత్రాగం తక్షణమే ఈ వ్యవహారం ఫై దృష్టి పెట్టకపోతే లోకేష్‌ భూ భాగోతంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. రాణిదేవి భూమిని ప్రభుత్వ పరం అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌. గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు,  పెందుర్తి సమన్వయకర్త అదీప్‌ రాజు, రాష్ట్ర నాయకులు కొయ్య ప్రసాద్‌ రెడ్డి, జాన్‌ వెస్లీ, పక్కి దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

5 October 2016

చంద్రబాబు కు వైయస్ జగన్ సూటి పశ్న

  • ఒక్క ఎకరా కూడా ఎండనివ్వనని బీరాలు పలికాడు
  • జిల్లాలో కరువు ఉందా అంటూ ఎగతాళి చేశాడు
  • నాలుగు రోజుల్లోనే కరువును తరిమికొట్టానంటూ పచ్చి అబద్ధాలు
  • ఇలాంటి ముఖ్యమంత్రిని చంద్రబాబునే చూస్తున్నాం
  • రైతు మహాధర్నాలో బాబుపై ధ్వజమెత్తిన వైయస్ జగన్

అనంతపురంః రైతులు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ కోసం పాకులాడటం సిగ్గుచేటని వైయస్‌ జగన్‌ మండిపడ్డారు. కరువు ప్రాంతాలను కూడా హెలికాఫ్టర్‌లో ఏరియల్‌ సర్వే ద్వారా సమీక్షించే ముఖ్యమంత్రిని చంద్రబాబునే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహా ధర్నాకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ధర్నాలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 



ముఖ్యమంత్రి కరువే లేదన్నాడు...
అనంతరపురం జిల్లాను ఆగస్టు 6, 8, 28 తేదీల్లో సందర్శించిన మూడుసార్లు సందర్శించిన ముఖ్యమంత్రి జిల్లాలో ఒక్క ఎకరాన్ని కూడా ఎండిపోనివ్వనని బీరాలు పలికారన్నారు. ఆగస్టు 28న పుట్టపర్తికి వచ్చిన బాబు జిల్లాలో కరువుందా అని వ్యంగ్యంగా మాట్లాడి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే నాలుగు రోజుల తర్వాత సెప్టెంబర్‌ 1న కరువును తరిమికొట్టానని పేర్కొనడం చేస్తుంటే అంతా అయోమయంగా ఉందన్నారు. కరువే లేదన్న ముఖ్యమంత్రి నాలుగు రోజుల్లో కనిపించిందా అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ కరువే లేదని సెలవిస్తే మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కరువును పారదోలేందుకు సమీక్ష నిర్వహిస్తారని చెప్పడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. రాష్ట్ర తాజా పరిస్థితులపై మీలోనే ఇన్ని బేదాభిప్రాయాలున్నప్పుడు ప్రజలను ఎలా ఆదుకుంటారని ప్రశ్నించారు. 

15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది...
రెయిన్‌ గన్‌లతో నాలుగు రోజుల్లో కరువును తరిమికొట్టానని సీఎం చంద్రబాబు చంకలు గుద్దుకోవడంపై వైయస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించారు. రాయలసీమ జిల్లాల్లో 21 లక్షల ఎకరాలకు గాను దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని తెలిపారు. రెయిన్‌ గన్‌లను ఈయనే కొత్తగా కనిపెట్టినట్టు ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రెయిన్‌గన్లు, డ్రిఫ్ట్‌లు, స్ప్రింకర్లు దాదాపు పదిహేనేళ్ల నుంచే వాడుకలో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి హడావుడి చేసి దానేదో అపర బ్రహ్మలా మాట్లాడటం సరికాదన్నారు. వాస్తవ పరిస్థితులను చూసి తెలుసుకోవాలన్నారు. కరువు పరిస్థితులను తెలుసుకోవాలంటే హెలికాఫ్టర్‌లో తిరిగితే తెలియదని, వరదలు వచ్చిన సందర్భాల్లోనే హెలికాఫ్టర్లు వాడటం చూస్తాంగానీ మన ముఖ్యమంత్రి మాత్రం వరదలొచ్చినప్పుడూ గాల్లో తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. కంప్యూటర్లు తానే కనిపెట్టానని డబ్బాలు కొట్టుకుంటూ... ప్రతీదీ ఇంటర్నెట్‌లో వెతికే  ముఖ్యమంత్రికి రాష్ట్రంలో కరువుందని మీ కంప్యూటర్లు చెప్పలేదా అని ప్రశ్నించారు. 

రోజుకు 25 లక్షల ట్యాంకర్లు ఎక్కడ్నుంచి తెచ్చారు..
నాలుగు రోజుల్లో కరువును తరిమేసిన ముఖ్యమంత్రీ 30 లక్షల ట్యాంకర్లు ఎక్కడ్నుంచి తెచ్చారని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రెయిన్‌గన్‌ల పనితీరు సామర్థ్యం.. వాటికి అవసరమయ్యే నీటిని వివరాత్మకంగా ట్యాంకర్లతో లెక్కించి బాబు మాయను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక ఎకరా పంటను తడిపేందుకు కనీసం 5 ఎంఎం వర్షపాతం కావాలని.. అంటే దానికి 25వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్లు అవసరమవుతాయని జగన్‌ వెల్లడించారు. మన దగ్గర ఉండేవి 5 లô దా 6 వేల లీటర్ల ట్యాంకర్లు కాబట్టి కనీసం ఐదు ట్యాంకర్లు అవవసరం కావొచ్చిని తెలిపారు. అంటే ఎకరాకి దాదాపు 25 ట్యాంకర్లు వినియోగిచాల్సి వస్తుందన్నారు. అలాంటిది లక్ష ఎకరాలను తడపాలంటే కనీసం 25 లక్షల ట్యాంకర్లు అవసరం కావొచ్చని అన్ని ట్యాంకర్లు పక్క రాష్ట్రాలు తిరిగినా దొరకవన్నారు. అలాంటిది నాలుగు రోజుల్లో రోజుకు లక్ష ఎకరాల వంతున 25 లక్షల ట్యాంకర్లతో నాలుగు రోజులకు లక్షల ట్యాంకర్లు ఎక్కడ్నుంచి తెచ్చారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.  

పదును రావాలంటే కనీసం 28 ఎంఎం వర్షపాతం కావాలి
బాబు చెప్పిన దాని ప్రకారం చూసుకుంన్నా ఎకరాకి 5 ఎంఎం తడి ఎట్టిపరిస్థితుల్లోనూ సరిపోదన్నారు. పంట సక్రమంగా పండాలంటే..  పదును రావాలంటే కనీసం 28 ఎంఎం వర్షపాతం అవసరం అవుతుందని 5ఎంఎంతో పంటలను ఎలా బతికిద్దామనుకన్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా బూటకపు మాటలతో ప్రజలను మాయం చేయడం ఆపాలని సూచించారు. 

టీడీపీ మాజీ సర్పంచ్‌ పంట ఎండిపోయింది...
మీరే స్వయంగా రెయిన్‌ గన్‌లతో తడి చేసిన మీ మాజీ సర్పంచ్‌ పొలం ఎండిపోయిందని ఈ సందర్భంగా జగన్‌ ఫొటోలు చూపెట్టి బాబుకు హితబోధ చేశారు. రాయచోటిలోని మాధవరం టీడీపీ మాజీ సర్పంచ్‌కు చెందిన పొలంలో చంద్రబాబు రెయిన్‌గన్‌లతో నీరు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా అదిప్పుడు ఎండిపోయిందని అలాంటిది నాలుగు లక్షల ఎకరాల సంగతి ఎలా ఉంటుందో తెలిసిపోతుందన్నారు. తాను రోడ్డు మార్గంలో జిల్లాకు వచ్చేటప్పుడు చూడగా పొలాలన్నీ ఎండిపోయి బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాలి తప్ప మాటలు చెప్పి కడుపులు నింపాలనుకోవడం సరికాదన్నారు. ఆనాడు దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కరువు పరిస్థితుల్లో రాష్ట్రానికి చేసిన మేళ్లు ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు. 

3 October 2016

ఈ రకంగా దండయాత్ర చేస్తే పోలా..?

  • రెండున్నరేళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా..?
  • అన్ని తాత్కాలికమంటూ తరలిపోతున్నాడు
  • రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారు
  • ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై చట్టవ్యతిరేక చర్యలు
  • పోలీసులు, తూటాలతో ఉద్యమాలని అణచివేయలేరు
  • బాబును ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుంది
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు 

హైదరాబాద్ః చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా రాజధానిలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టకపోవడం దురదృష్టకరమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అన్నీ తాత్కాలిక కార్యక్రమాలు చేస్తూ హైదరాబాద్ నుంచి తరలిపోవడం దారుణమన్నారు. సగపాలన పూర్తయ్యాక కూడా ఇంకా తాత్కాలికమంటూ బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక శాసనసభ, మండలి వెనుక జరుగుతున్న తంతంగం చూస్తే బాధేస్తోందన్నారు. రెండున్నరేళ్లలో పర్మినెంట్ బిల్డింగ్ లు కట్టే అవకాశం ఉన్నా కట్టకపోవడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ అసమర్థతే కారణమన్నారు.  అమరావతిలో శంకుస్థాపన రాయి వేయడం తప్ప బాబు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. తన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే బాబు, లోకేష్ లు తాత్కాలిక కార్యక్రమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  రాష్ట్రం విడిపోయాక మంచి రాజధాని కావాలి, పరిపాలన మంచిగా జరగాలని అంతా కోరుకున్నామన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం దారుణంగా ఉందని అంబటి విమర్శించారు. ఎలాంటి వసతులు కల్పించకుండానే వెలగపూడి కేంద్రంగా అమరావతిలో పరిపాలన సాగించేందుకు హడావిడిగా ఉద్యోగులను తరలించడం సరికాదన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. 

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా... దోపిడీకి అడ్డుగా ఉందనే, ఉన్నపళంగా బాబు విజయవాడ తరలిపోయారని అంబటి ధ్వజమెత్తారు.  హైదరాబాద్ సెక్రటేరియట్ లో జీవోలు ఇష్యూ చేసినా, డబ్బులు ఖర్చుపెట్టినా ఏదైనా నేరం జరిగితే ఇక్కడి పోలీసులు, డీజీపీ, సీఐడీ పరిధిలోకి వస్తుందన్నారు. హైదరాబాద్ లో ఉండి చేస్తే తన ఆధీనంలో లేని పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయలేడు గనుకే బాబు తరలిపోయారని దుయ్యబట్టారు. మేనేజ్ చేసుకునే పోలీస్ వ్యవస్థ విజయవాడలో ఉంది కాబట్టి, అక్కడకు తరలివెళ్లాలనే తాపత్రయం మినహా ప్రజలకు అందుబాటులో రాజధాని తీసుకెళ్లాలన్న చిత్తశుద్ది బాబుకు ఏ కోశాన లేదన్నారు.   బాబు ప్రతీ కార్యక్రమంలో వైట్ కాలర్ క్రైం, డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రాష్ట్రం చీలిపోయి మూడేళ్లు రాబోతోంది. దేశంలో ఎవరిని నమ్మకుండా సింగపూర్, జపాన్, మలేషియా వాళ్ల మీద ఆధారపడి  ఒక్క కట్టడం కూడా కట్టని దౌర్భగ్యంలో ఎందుకున్నారని బాబును నిలదీశారు.  అన్ని వసతులతో ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ ఉద్దేశ్యపూర్వకంగా వసతులు కల్పించకుండా ఉద్యోగులను తరలించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలని సూచించారు. 

భూసేకరణకు వ్యతిరేకంగా, ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేస్తే  పోలీసు వ్యవస్థను ఉసిగొల్పి అణిచివేయాలని చూడడం ప్రభుత్వానికి తగదన్నారు. ఉన్నతాధికారుల మీటింగ్ లో ప్రివెంటివ్ ఆఫ్ డిటెక్షన్ యాక్ట్ అప్లై చేయాలని బాబు చెబుతున్న ధోరణి చూస్తుంటే డిక్టేటర్ పాలనలో ఉన్నామా...ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు.  ప్రభుత్వ అక్రమాలు, అన్యాయాలపై ఉద్యమిస్తున్న వారిపై ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ పెట్టి  పోలీసుల రాజ్యం, తూటాల రాజ్యంతో అణిచేయాలని చూస్తే ప్రజలు తరమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆక్వా బాధితులకు మద్దతుగా ఉద్యమం చేస్తే గుండాలు, క్రిమినల్స్ మీద ఎటాక్ చేసినట్లు పోలీసులను ఉసిగొల్పి అరెస్ట్ చేసి, నిర్బందించి జైలు పాలు జేశారు. తిరుపతికి వెంకయ్యనాయుడు వస్తే చాలు వైయస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని నిర్బంధించారు. వెంకయ్యనాయుడుకు సన్మానం అనగానే ప్రతిపక్షం వాళ్లను అరెస్ట్ చేసి దండాలు వేస్తున్నారు. ఇదేనా సన్మానం...? పోలీస్ వ్యవస్థను అఢ్డుపెట్టుకొని బాబు పరిపాలన కొనసాగించడం దుర్మార్గమని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను తీసుకొచ్చి వైయస్సార్సీపీ, ప్రజాసంఘాలమీద అమలు చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బాబును హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ శాంతిభద్రతలు కాపాడేందుకు, క్రిమినల్స్ ను అణిచేసేందుకు ఉండాలి గానీ..చట్టానికి వ్యతిరేకంగా బాబు ఏది చెబితే అది చేయడానికి కాదన్నారు.  అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న సంగతి డీజీపీ, ఐపీఎస్, ఐఏఎస్ లు తెలుసుకోవాలన్నారు.  ఎన్టీఆర్, ఇందిరాగాంధీలు చిత్తుగా ఓడిన సందర్భాలున్నాయి. బాబు కూడా చిత్తుగా ఓడిపోయిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు.

దోమల మీద దండయాత్ర చేయాలని బాబు పిలుపునివ్వడం హాస్యాస్పదమని అంబటి తూర్పారబట్టారు.  ఎంత పనికిమాలిన ప్రభుత్వం కాకపోతే దోమలపై దండయాత్ర ఏంటని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ఏం పోయే కాలం వచ్చిందని తూర్పారబట్టారు. ఈసందర్భంగా ఓ తల్లి, పిల్లదోమ కథ చెప్పిన అంబటి ప్రభుత్వంపై ఛలోక్తులు విసిరారు. దోమలు మనుషుల రక్తాన్ని ఏవిధంగా పీల్చుకొని తాగుతాయో, బాబు కూడా అదే మాదిరి ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగుతున్నాడని..బాబుకు కాంపిటీషన్ గా ఉన్నామనే మనల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడని పిల్ల దోమ ప్రశ్నకు తల్లిదోమ బదులిచ్చిన విషయాన్ని అంబటి వివరించారు. చేయాల్సినవి చేయకుండా దోమల మీద దండయాత్రలు. ప్రతిపక్షం మీద పీడీయాక్ట్ లతో అణిచేయాలని చూడడం అవివేకమని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు హైదరాబాద్ లోనే ఉంటానని ప్రగల్భాలు పలకిన బాబు...ఓటుకు నోటు కేసులో దొరికిపోవడంతో కేసులు పెడతారని భయపడి హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్లిపోయాడని అన్నారు. కేసీఆర్, బాబుకు మధ్య వెంకయ్యనాయుడు రాజీ కుదిర్చారని చెప్పారు. బాబుకు ఎక్కడా రాజధాని నిర్మాణ ఆలోచనే లేదని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం ముసుగులో  విదేశాలకు దోచిపెట్టారు గనుకే న్యాయస్థానాలు కూడా బాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాయని తెలిపారు.  

దోమలపై దండయాత్ర కాదని బాబు, మంత్రులు, లోకేష్ మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉపయోగించాలని అంబటి పేర్కొన్నారు. ఇవాళ కాకపోయినా భవిష్యత్తులో అది జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని విమర్శించారు. బాబు తన మాటకు ఎదురుచెప్పని వారిని కీలకమైన ఫోకల్ లో పాయింట్స్ లో వేసుకొని అరెస్ట్ లు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏదో ఓ రోజు ధర్మంగా వ్యవహరించే రోజు వస్తుందన్నారు. చట్టాలు చేతిలో ఉన్నాయి కదా అని ప్రతిపక్షాలను అణిచేయాలని చేయడం బాబు చేతగాదని అంబటి తేల్చిచెప్పారు. ఎంత అణిచివేయాలని చూస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగుస్తాయని, చరిత్ర చదువుకోవాలని బాబుకు హితవు పలికారు. ప్రతిపక్షాలపై  ప్రివెంటివ్  డిటెక్షన్ యాక్ట్ ప్రయోగిస్తే అది  వికటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

1 October 2016

వామ్మో.. అంత పబ్లిసిటీ పిచ్చా.. కొంప మునగటం ఖాయం

  • రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముమ్మాటికీ సంజీవినే
  • అందుకే అన్ని రాష్ట్రాలు హోదానే అడుగుతున్నాయ్‌
  • ప్రత్యేక ప్యాకేజీలో ప్రత్యేకంగా ఏమిచ్చారో చెప్పాలి
  • ఉన్నత పదవుల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి
  • టీడీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

హైదరాబాద్ః ప్రత్యేక హోదాపై రోజుకో మాట చెప్పి ప్రజలను మభ్యపెట్టడం మాని రాష్ట్రాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ పీఏసీ చైర్మన్, వైయస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికారు. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముమ్మాటికీ సంజీవనే అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే గొప్పదైనప్పుడు అన్ని రాష్ట్రాలు ప్యాకేజీ అడగకుండా హోదా కావాలని ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారో బాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలిపిన చంద్రబాబు మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటి కంటే కొత్తగా కేంద్రం ఏమిచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 

షిండేజీ అని లేఖలు రాసి మరీ విభజించారుగా..!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోవాలని ఎవరూ కోరుకోకపోయినా   విడిపోయాం. రాష్ట్రం నుంచి టీడీపీ, కేంద్రంలో బీజేపీలు ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలక పోయి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేదే కాదన్నారు. విభజన జరగకుండా ఉండి ఉంటే మనం ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చేది కాదన్నారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు షిండేజీతో మాట్లాడుతూ విభజనకు అంగీకరిస్తూ ఉత్తరాలు రాసిన  సంగతి మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. అయితే అదంతా గతం. జరిగినదేదో జరిగిపోయింది. ఇకనైనా మాటలాపి ముఖ్యమంత్రి అభివృద్ధి మీద దృష్టి సారించాలని బాబుకు సూచించారు.  హోదా కావాలని ఒకసారి, హోదా సంజీవినా అని మరోసారి... ప్యాకేజీ బాగుందని ఇంకోసారి తడవకోసారి అర్థం పర్థం లేని మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదని బాబుకు హితబోధ చేశారు.

హోదాతో చాలా లాభాలున్నాయి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం వలన చాలా ప్రయోజనాలున్నాయని బుగ్గన వివరించారు. హోదా ఉన్న కాలంలో పరిశ్రమలు స్థాపిస్తే కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. వంద శాతం ఇన్‌కమ్‌ ట్యాక్స్, సెంట్రల్‌ ఎక్సయిజ్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. వీటితోపాటు బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులో 3శాతం వడ్డీ మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఇటీవల కేంద్రమంత్రులు, టీడీపీ నాయకులు, వెంకయ్య నాయుడు తదితరులు మాట్లాడుతూ పరిశ్రమలు తమ పెట్టుబడిలో 15 శాతం ఖర్చుగా చూపించడంతోపాటు 35శాతం తరుగుదల అవకాశం కూడా కల్పించామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అయితే ఇదేమీ మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చిన వరం కాదన్నారు. మనతోపాటు పశ్చిమ బంగా, తెలంగాణ, బీహార్‌ ఇలాంటి రాష్ట్రాలకు కూడా కేటాయించిందని తెలియజేశారు. అలాంటప్పుడు మన కే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లు చెప్పడానికి వారికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అంతేకాకుండా ఏపీలో ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఐఎంలు స్థాపిస్తామని చెప్పడం మంచిదే కానీ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఏర్పాటయ్యాయని కొత్తగా మనకూ కేటాయిస్తున్నారు తప్ప ఇందులో గొప్పతనం ఏమీ లేదన్నారు. ఇవన్నీ విభజన చట్టంలో పొందుపర్చారని అవే వారు నెరవేరుస్తామని చెబుతున్నారని ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రత్యేకంగా ఒక్క పైసా ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. 

ఇలా అయితే మేకిన్‌ ఇండియా సాధ్యమా
మేకిన్‌ ఇండియా అంటూ ప్రచారం చేసుకుంటున్న మోడీ సార థ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించకుండా మేకిన్‌ ఇండియా ఎలా సాధ్యమవుతుందన్నారు. పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలంటే ఇక్కడ అవకాశం కల్పించాలని కోరారు. అప్పుడే ఉద్యోగాలు పెరిగి యువకులకు ఉపాధి లభిస్తుందని, తద్వారా రాష్ట్రం పురోగమిస్తుందని వెల్లడించారు. ప్యాకేజీల పేరుతో రావాల్సినవే విదిలిస్తే మేకిన్‌ ఇండియా కలగానే మిగిలిపోవాల్సి ఉంటుందని బుగ్గన పేర్కొన్నారు. 

హోదా వలన ఉత్తరాఖండ్‌ దూసుకెళుతోంది
హోదా వలన రాష్ట్రాలకు ఏమంత ప్రయోజనం కలిగిందే చెప్పాలని మాట్లాడిన చంద్రబాబుకు బుగ్గన ఉత్తరాఖండ్‌ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఇటీవలే ప్రత్యేక హోదా సాధించిన కోటి మంది జనాభ గల చిన్నరాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు స్థూల జాతీయోత్పత్తిలో 23 శాతం నిధులు కేటాయిస్తే ఐదు కోట్ల జనాభా కలిగిన ఏపీ కనీసం పదిశాతం కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. దీన్ని కూడా ప్రత్యేక ప్యాకే జీ అంటారా అని ప్రశ్నించారు. ఉన్నత పదవుల్లో ఉండే నాయకులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టడం సరికాదన్నారు. ఇదీ చాలదన్నట్టు హోదా కంటే ప్యాకేజీయే బాగుందని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు మరి రెండున్నరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కనిపించడం లేదే అని ఎద్దేవా చేశారు. 

ఎకనామిక్స్‌లో పీహె చ్‌డీ అన్నావ్‌ ఇదేనా.. నీ జ్ఞానం 
చంద్రబాబు తనకు తాను ఆర్థికవేత్తనని, ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశానని చెప్పుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. మరి అంత జ్ఞానమున్న వ్యక్తి ప్యాకేజీకి ఎలా అంగీకారం తెలిపారో తనకైతే అర్థంకావడం లేదన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బాగుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. అంతటి విద్యావేత్తకు హోదా వలన కలిగే ప్రయోజనాలు తెలియవా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటించిన దోమలపై దండయాత్రపై ఛలోక్తులు విసిరారు. ఆయన చేసే యుద్ధం ఇంగ్లిషు చిత్రాలను గుర్తుకు తెస్తుందని విమర్శించారు. ఆయన దోమలను తుపాకులతో కాల్చినట్టు ప్రజలు కలలో కూడా భయపడుతున్నారని తెలిపారు. 

కరువంటే.. పుష్కరాలు, వాగ్ధానాలు అంటే... సింధు
సమస్యలను పక్కదారి పట్టించడం చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ముఖ్యమంత్రిని బుగ్గన ఈ సందర్భంగా విమర్శించారు. ప్రతిపక్షాలు కరువు గురించి మాట్లాడితే చంద్రబాబు పుష్కరాలు బాగా చేద్దాం అంటారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చమని ప్రశ్నిస్తే సింధును తయారు చేశానని చెప్పుకుంటారు... ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే ముఖ్యమంత్రి దోమలపై సమరం అనడం సమస్యలకు భయపడి తప్పించుకోవడం కాక మరేమిటని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత మీపై ఉందని దానిని సమర్థవంతంగా నిర్వహించాలే తప్ప సమస్యలకు సాకులు వెదకడమో.. లేక ప్రతిపక్షాల మీద పడి ఏడవడం చేయడం ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులకు సరికాదని సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరిచి పబ్లిసిటీ మాని పనుల మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. 

టీడీపీ, బీజేపీలు నియంతలా వ్యవహరిస్తున్నాయి

  • ఓట్లు దండుకొని హోదా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశాయి
  • జేబులు నింపుకునేందుకే బాబు ప్యాకేజీని స్వాగతించారు
  • కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే పోలవరం
వైయస్‌ఆర్‌ జిల్లా:  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకపోవడం దారుణమని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ సీనియర్ నేత వైయస్ వివేకానందరెడ్డి మండిపడ్డారు. కడప హరితా కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన చైతన్య పథం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం ఏపీ రాష్ట్రమంతా పోరాడినా వారి భవిష్యత్తును నిర్ధాక్షిణ్యంగా కాంగ్రెస్, బీజేపీలు నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనకు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంటే బీజేపీ దానికి మద్దతు ఇచ్చి బిల్లుకు సహకరించిందన్నారు. 

విభజన బిల్లుకు సహకరించిన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను అమలు పర్చకపోవడం దుర్మార్గమన్నారు. టీడీపీ, బీజేపీలు ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హోదా వస్తే ఆర్థికంగా, పారిశ్రామికంగా వెలుసుబాటు కలుగుతుందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులన్నీ ఇబ్బందికరంగా మిగిలిపోయినా కనీసం చంద్రబాబు వాటిని పట్టించుకోవడం లేదన్నారు. కేవలం రెయిన్‌ గన్‌లతో ట్యాంకర్లతో నీటి కొరతను ఎలా పారదోలుతారని ప్రశ్నించారు. రాయలసీమ ఉక్కు కర్మాగారాన్ని కూడా కేంద్రం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

లాభం కాదని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులా?
ప్రత్యేక హోదాతో ఉపయోగం లేదని మాట్లాడిన టీడీపీ, బీజేపీ నేతలు హోదా కలిగిన రాష్ట్రాల్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి కోట్లకు పడగలెత్తుతూ ఏపీకి హోదాతో ఉపయోగం లేదని మాట్లాడడం దారుణమన్నారు. ‘చైతన్యపథం’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు ముందస్తు డ్రామా ప్రకారం హామీలను కురిపించి ఓట్లు దండుకొని ప్రజలను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. బంతి అయిపోయింది అన్నం పెట్టరు అన్నట్లుగా చంద్రబాబు, వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఏరుదాటాక తెప్ప తగలేసే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విభజన చట్టంలోని అంశాలే తప్ప ప్రత్యేకంగా ఏపీకి ఇచ్చిందేమీ లేకపోయినా బాబు అర్థరాత్రి దాన్ని స్వాగతించడం దారుణమన్నారు.  ఏ కార్యక్రమానైనా డబ్బుల ఈవెంట్‌గా మల్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అందుకోసమే ప్యాకేజీని కూడా జేబులు నింపుకోవడానికి స్వాగతించారని చెప్పారు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసం పోలవరాన్ని బాబు చేజిక్కించుకున్నారని ఆరోపించారు. రాయపాటి సాంబశివరావు, సీఎం రమేష్, మెగా కృష్ణారెడ్డిలకు డబ్బులు ముట్టజెప్పేందుకు పోలవరాన్ని తీసుకొచ్చారన్నారు. పోలవరం బిల్లుల కోసమే ఏపీ ప్రజల మనోభావాలను బాబు కేంద్రానికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. 

రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు

తూర్పుగోదావరి(మండపేట))కపిలేశ్వరపురం మండలం నేలటూరు  గ్రామంలో మండపేట వైయస్సార్సీపీ కో-ఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ఈసందర్భంగా  స్థానికులు తమ సమస్యలు తెలియచేసారు. చేనేత రుణాలు, రేషన్ కార్డులు, ఇళ్లస్థలాలు, రుణమాఫీ ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చడం లేదని  ప్రభుత్వం  వైఫల్యాలను ప్రజలే వైయస్సార్సీపీ నేతల వద్ద విన్నవించారు. ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ....చంద్రబాబు ఓటుకు నోటు కేసులో రాష్ట్రాన్నీ కేంద్రం ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టారు అని విమర్శించారు. సర్కారు వైఫల్యాలఫై ముద్రించిన ప్రజాబ్యాలెట్ ను ఇంటింటికి పంపిణీచేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజన్న పాలన త్వరలోనే  వస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.